Tuesday, September 28, 2010

ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ * ప్రైవేటు టీచర్.కామ్

గూగుల్ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్ వంశీ నాయక్. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం.

మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.

ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.

తండాలో పుట్టి...
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి.

అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.

పేపర్ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు.

వంశీ పేపర్ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్ ఉండాలి. ఆ యజమాని సైకిల్ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.

ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు.

ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్.

ఎడ్యునెస్ట్ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్ కావాలి. ఒకరు మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం.

వేరే స్కూల్లో అదే పోస్ట్, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్ఎమ్ఎస్ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్ఎమ్ఎస్ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ.

ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 
జూ బీరెడ్డి నగేష్ రెడ్డి

No comments: