Wednesday, September 29, 2010

శ్రమైక జీవన సౌందర్యమే ‘ఆనందం’


ఆయన ఓ సర్పంచ్. అయితే ఏంటని అంటారా? ఓ వైపు ప్రజాసేవ చేస్తూ, మరో వైపు పాడి పశువులు పెంచుతూ, ఇంకో వైపు వ్యవసాయం సాగిస్తూ ‘ఆనందం’ పొందుతున్నారు. అన్ని బాధ్యతల్ని సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారు. రాజకీయ నాయకులందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. పాడి పశువుల ఆలనా పాలనా చూసుకుంటూ పాల వ్యాపారిగా అవతారం ఎత్తుతూ ... పొలం పనులు సాగిస్తూ... గ్రామ సర్పంచ్‌గా ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ... ఇలా మూడు రంగాలలోనూ శభాష్ అనిపించుకుంటున్నారు. ఆయనే కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలంలోని వెల్దుర్తి గ్రామానికి చెందిన అయిల్నేని ఆనందరావు. శ్రమైక జీవన సౌందర్యంలోని మాధుర్యాన్ని రుచి చూస్తున్న ఆనందరావును ‘న్యూస్‌లైన్’ పలకరిస్తే ఎన్నో విషయాలు తెలిపారు. ఆ వివరాలు మీరూ తెలుసుకోండి మరి...

ఒక్క గేదెతో వ్యాపారం మొదలెట్టి...
ఇంటర్ వరకూ చదివిన ఆనందరావు స్వయంకృషిని, ఆత్మవిశ్వాసాన్ని నమ్ముకున్నారు. పశు పోషణను ఉపాధిగా ఎంచుకున్నారు. 1990లో ఒకే ఒక్క గేదెతో పాల వ్యాపారం మొదలెట్టారు. ఇప్పుడు వాటి సంఖ్య 12కు చేరింది. అంతే సంఖ్యలో చిన్న దూడలూ ఉన్నాయి. అప్పుడప్పుడూ పాడి గేదెల్ని కొంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మరు. గేదెల్ని స్థానికంగానే కొనుగోలు చేస్తారు.

పాల వ్యాపారంలో మేటి
పాల అమ్మకం ద్వారా ప్రతి నెలా 12 వేల రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు ఆనందరావు. లీటరుకు 15-20 రూపాయల వరకూ ధర పలుకుతోంది. రోజుకు కనీసం 60-70 లీటర్ల పాలను స్కూటర్‌పై తీసికెళ్లి సమీపంలోని జగిత్యాల పట్టణంలో విక్రయిస్తారు. తాను తిన్నా, తినకున్నా ప్రతి గేదెకు అయిదు కిలోల చొప్పున ఉదయం, సాయంత్రం తౌడు, అటుకుల పిండిని దాణాగా అందిస్తారు. తానే స్వయంగా ఎడ్ల బండి తోలుకుని పొలానికి వెళ్లి గడ్డి తెచ్చి పశువులకు మేపుతారు. వరి పైరు కోసిన తర్వాత వచ్చే ఎండు గడ్డిని ఓ పూట గేదెలకు వేస్తారు. దీంతో పశుగ్రాసం ఖర్చు కూడా తగ్గుతోంది. పశువులకు అవసరాన్ని బట్టి టీకాలు వేయించడంతో పాటు వాటికి ఎలాంటి వ్యాధులు వచ్చినా పశు వైద్యుల సలహాలు, సూచనలతో చికిత్సలు చేపడతారు.

పెద్దల నుండి వచ్చింది 30 గుంటలే...
సర్పంచ్ ఆనందరావుకు పెద్దల నుండి వచ్చిన వ్యవసాయ భూమి కేవలం 30 గుంటలే (ముప్పావు ఎకరం). దానినే అభివృద్ధి చేసుకుంటూ ఇప్పుడు అయిదెకరాల ఆసామి అయ్యారు. ఇది పాడి పరిశ్రమ పుణ్యమేనని సగర్వంగా చెబుతారు ఆనందరావు. ఎందుకంటే పాల అమ్మకం ద్వారా వచ్చే ఆదాయం ఇద్దరు పిల్లల చదువులకు, వ్యవసాయ పెట్టుబడులకు, ఇంటి ఖర్చులకు సరిపోతుంది. పంటలు అమ్మగా వచ్చిన ఆదాయం మిగులుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఏటా అన్ని ఖర్చులు పోను మూడు లక్షల రూపాయల నికరాదాయం పొందుతున్నారు. ప్రతి పనినీ తానే స్వయంగా చేసుకుంటారు. అవసరమైనప్పుడు ఒకరిద్దరు కూలీలను పెట్టుకుంటారు.

సేంద్రియ వ్యవసాయంపై మక్కువ
ఆ ప్రాంతంలోని రైతులందరూ వ్యవసాయ భూములకు పశువులు లేదా కోడి ఎరువు, చెరువు మట్టిని ఉపయోగిస్తుంటారు. అయితే పశువుల ఎరువు సరిగా లభ్యం కాకపోవడం, ధర అధికంగా ఉండటంతో వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ మన ఆనందరావు మాత్రం తన పాడి గేదెల పేడనే వరి, మొక్కజొన్న, పసుపు పంటలకు ఎరువుగా వాడుతున్నారు. చాలా వరకూ సేంద్రియ ఎరువునే వినియోగిస్తుండడంతో పైర్లకు ఎలాంటి చీడపీడలు సోకడం లేదని అంటారాయన. అంతే కాకుండా ఇతర రైతుల కంటే దిగుబడులు ఎక్కువ వస్తున్నాయి. ఎలాంటి భేషజం లేకుండా ఓ వైపు పాడి గేదెల పాలు విక్రయిస్తూ మరో వైపు గ్రామ ప్రజలకు అవసరమైన సేవలు అందిస్తూ అందరి మెప్పూ పొందుతున్నారు. ఆనందరావును ఆదర్శంగా తీసుకుని తోటి రైతులు కూడా ఇప్పుడు పాడి పశువుల పెంపకంపై దృష్టి సారిస్తున్నారు. ఆనందరావు నుండి సలహాలు పొందుతున్నారు.


4.30 గంటలకే దినచర్య మొదలు
ప్రతి రోజూ ఉదయం 4.30 గంటలకే ఆనందరావు దినచర్య మొదలవుతుంది. ముందుగా అన్ని గేదెల పాలు పిండి, పశువుల వద్ద పేడ తీసి దాణా వేస్తారు. ఆ తర్వాత పాలను జగిత్యాల తీసికెళ్లి రోజువారీ వినియోగదారులకు విక్రయిస్తారు. ఈ పనంతా తెల్లారే సరికే పూర్తవుతుంది. ఉదయం 7-8 గంటల లోపే పంచాయతీ కార్యాలయానికి చేరుకొని సర్పంచ్ విధుల్లో నిమగ్నమవుతారు. 11 గంటల తర్వాత వరి పొలాలు, పసుపు తోటల్లో పనులు చూసుకుంటారు. సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు పచ్చి మేత తీసుకొస్తారు. మధ్యాహ్న సమయంలో పశువుల్ని మేపుకు రావడానికి ఒక మనిషిని నియమించారు. సాయంత్రం పాడి గేదెలు ఇంటికి రాగానే వాటికి మేత వేస్తారు. రాత్రి కాగానే దాణా పెట్టి పాలు పితుకుతారు. పాలు పిండిన తర్వాత మేత వేస్తారు. అప్పటితో ఆయన దినచర్య పూర్తవుతుంది. ఆనందరావు ఎప్పుడూ ఊర్లోనే గడుపుతారు. ఒకవేళ ఎక్కడికైనా వెళ్లినా చీకటి పడేసరికే ఇంటికి చేరుకుంటారు. గ్రామాభివృద్ధికి సంబంధించి ఏదైనా పని మీద మండల కేంద్రానికి వెళితే సాయంత్రానికే తిరిగి వచ్చేస్తారు.
పాల వ్యాపారాన్ని వదలను
ఏ స్థాయిలో ఉన్నా పాడి గేదెల పెంపకాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలి పెట్టను. మరి న్ని పాడి గేదెలు కొనుగోలు చేయాలని, వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ఉత్సాహంగా ఉంది.

ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాను. రాజకీయాల్లో ఉన్న వారు చాలా మంది తమ పాత వృత్తిని కొనసాగించేందుకు నామోషీగా ఫీలవుతారు. కానీ నేను అలా భేషజాలకు పోను. ఈ వ్యాపారాన్ని వదలను.

అందరికీ అందుబాటులో...
పాల వ్యాపారంతో పాటు వ్యవసాయ పనుల్లో బిజీగా ఉండే ఆనందరావు గ్రామస్తుల కోరిక మేరకు సర్పంచ్‌గా పోటీ చేసి విజయం సాధించారు.
అందరితో కలుపుగోలుగా ఉండే ఆనందరావు ఎవరికి ఏ సమస్య వచ్చినా నేనున్నానంటూ వారి ముందు వాలిపోతారు. ఎంత బిజీగా ఉన్నప్పటికీ చేనుకు వెళ్లడం మాత్రం మరచిపోరు. అన్ని పనులకు సమ న్యాయం చేసే క్రమంలో కొంత ఒత్తిడికి గురవుతున్నప్పటికీ ఎప్పుడూ ఆహ్లాదంగా కనబడుతుంటారు.

Tuesday, September 28, 2010

ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్ * ప్రైవేటు టీచర్.కామ్

గూగుల్ కూడా గుర్తించలేని ఒక మారుమూల తండాలో పుట్టాడు సోమేశ్వర్ వంశీ నాయక్. అయితే ఇప్పుడు గూగుల్‌లో అతని గురించి ఒక్కసారి వెతికి చూడండి.. మీకు కావాల్సినంత సమాచారం దొరుకుతుంది. అసలు వంశీ గురించి మేమెందుకు తెలుసుకోవాలి అంటారా? ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు మరెవరికీ ఎదురుకాకూడదని ఉపాధ్యాయుల కోసం ఒక ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ని రూపొందించాడు. దాని గురించే ఈ కథనం.

మీరు టీచర్‌గా పనిచేస్తున్నారా? లేదంటే పనిచేయాలన్న ఆలోచన ఉందా? ఇప్పుడున్న పాఠశాలలో కాకుండా మరో మంచిస్కూల్ కోసం వెతుకుతున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం మీకు ఒకే దగ్గర దొరుకుతుంది. అదే ఎడ్యునెస్ట్ (www.edunest.org). కేవలం టీచర్ల కోసమే రూపొందించిన వెబ్ పోర ్టల్ ఇది. దీన్ని డిజైన్ చేసింది పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదు, నిన్న మొన్ననే ఎంఏ పూర్తి చేసిన ఒక సాధారణ టీచర్. అసలు అతనికి ఎందుకు ఈ ఆలోచన వచ్చిందో చదవండి.

ఓ దసరా పండగ మధ్యాహ్నం.. ట్యాంక్‌బండ్‌పై ఒంటరిగా బెంచీ మీద కూర్చుని ఇలా డైరీ రాసుకుంటున్నాడు వంశీ నాయక్. "అందరూ కొత్తబట్టలు వేసుకుని, పండగ జరుపుకుంటూ సంతోషంగా ఉన్నారు. కానీ నా పరిస్థితేంటి ఇలా ఉంది? ఆకలిగా ఉంది. జేబులో చిల్లిగవ్వలేదు. ఏం చేయాలి? చచ్చిపోవాలనిపిస్తోంది. ఛీ... నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా? లేదు. పిరికివాడిలా చావకూడదు. ఎలాగైనా చదువుకోవాలి. ఏదైనా సాధించాలి'' అనుకున్నాడు.

తండాలో పుట్టి...
నిజానికి వంశీకి అమ్మానాన్నా, ఇద్దరు అక్కలూ ఉన్నారు. అతనిది మహబూబ్‌నగర్ జిల్లాలోని బుద్ధారం ధర్మ తండా. చాలా పేద కుటుంబం. కుటుంబంలో అందరూ ఏదో ఒక పనిచేస్తేనే కడుపునిండేది. అలాంటి పరిస్థితుల్లో వంశీని చదివించడం తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయింది. వంశీ అప్పుడు నాలుగో తరగతి చదువుతున్నాడు. సెలవుల్లో అక్కలతో కలిసి కూలీ పనికి వెళ్లేవాడు. రోజుకు పది రూపాయలు వచ్చేవి.

అలా కూడబెట్టుకున్న డబ్బులు, అక్కావాళ్లు ఇచ్చిన ఇంకొన్ని డబ్బులు మూటకట్టుకుని ఇంట్లోంచి పారిపోయాడు. వనపర్తిలోని ఒక హాస్టల్‌లో ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకోసాగాడు. వాళ్ల అమ్మనాన్న కూడా 'పోనీ చదువుకోనీలే' అని వదిలేశారు. సెలవుల్లో ఇంటికి వెళ్లి వస్తుండేవాడు కానీ ఇంట్లో వాళ్లు డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలా రెండు మూడేళ్లు గడిచింది.

పేపర్ బాయ్‌గా..
ఏడో తరగతి చదువుతున్నప్పుడు సాయంత్రం పూట వంశీ ఒక ఎస్టీడీ బూత్‌లో పనిచేసేవాడు. నెలకు వంద రూపాయలు వచ్చేవి. అవి కూడా సరిపోయేవి కావు. 'ఇంకా ఏదైౖనా పని ఉంటే చెప్పండి' అని ఎస్టీడీ యజమానిని అడిగితే 'పేపర్ బాయ్‌గా చేస్తావా? 150 రూపాయలిస్తాను' అన్నాడు.

వంశీ పేపర్ వేయడానికి రెడీ అయ్యాడు. కానీ ఆ పని చేయాలంటే సైకిల్ ఉండాలి. ఆ యజమాని సైకిల్ తానే ఇస్తానన్నాడు కానీ దానికి అద్దె నెలకు 75 రూపాయలు. అలా ఉదయం, సాయంత్రం కష్టపడితే వచ్చే 175 రూపాయలతో వంశీ చదువుకునేవాడు.

ఆలోచన పుట్టిందిలా..
ఇంటర్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు అప్పటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 'మళ్లీ బడి' కార్యక్రమంలో చేరాడు. పాటలు పాడుతూ, పాఠాలు చెబుతూ గ్రామాల్లో తిరిగేవాడు. ఆ సందర్భంలోనే ఉపాధ్యాయ వృత్తి పట్ల ఆసక్తి కలిగింది. తర్వాత వనపర్తిలో డిగ్రీ చదువుతూ హైదరాబాద్‌లోని జనవిజ్ఞాన వేదిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటుండేవాడు.

ప్రయివేటు ట్యూషన్లు చెబుతూ ఎంఏ కూడా పూర్తి చేశాడు. ఇప్పుడు వనపర్తిలోని బ్రిలియంట్ స్కూల్‌లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఆ ఉద్యోగ వేటలో తనకు ఎదురైన అనుభవాలు, సహోద్యోగులు ఎదుర్కొన్న సమస్యల నుంచి పుట్టిన ఆలోచనే ఎడ్యునెస్ట్.

ఎడ్యునెస్ట్ గురించి...
ఈ రోజుల్లో ఒక వెబ్‌సైట్ రూపొందించడం పెద్ద కష్టం ఏం కాదు. చాలా తక్కువ ఖర్చులో కూడా తయారుచేయొచ్చు. కానీ వంశీ తయారు చేసుకున్న కాన్సెప్ట్ చాలా ఖర్చుతో కూడుకున్నది. ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యాలు రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం చాలా జిబి స్పేస్ కావాలి. ఒకరు మ్యాథ్స్ టీచర్‌గా పనిచేస్తున్నారనుకుందాం.

వేరే స్కూల్లో అదే పోస్ట్, ఎక్కువ జీతంతో ఖాళీ ఉందనుకుందాం. ఆ వివరాలు వెబ్‌సైట్‌లో ఎంటర్ చేస్తే అవి వెంటనే ఆ టీచర్‌కు ఎస్ఎమ్ఎస్ రూపంలో వెళ్తాయి. ఇప్పటి వరకు ఇలాంటి సమాచారాన్ని కేవలం ఇ-మెయిల్స్ ద్వారానే అందిస్తున్నాయి మిగతా వెబ్‌సైట్లు. అందరూ ప్రతిరోజూ ఇంటర్‌నెట్ చూసే అవకాశం ఉండదు కాబట్టే ఈ ఎస్ఎమ్ఎస్ పద్ధతిని ఎంచుకున్నానంటాడు వంశీ.

ఈ వెబ్‌సైట్ రూపకల్పనకు అతనికి 50 వేల రూపాయలు ఖర్చు అయింది. ఈ మొత్తాన్ని తనకు నెల నెల వచ్చే జీతం నుంచి వాయిదాల పద్ధతిలో కడుతున్నాడు వంశీ. అధికారికంగా వెబ్‌సైట్‌ని ప్రారంభించేందుకు గవర్నర్‌గారి అపాయింట్‌మెంట్ కోసం ఎదురుచూస్తున్నాడు. 
జూ బీరెడ్డి నగేష్ రెడ్డి

మావో కొడుకు కావటమే దురదృష్టం!

"చైనా విముక్తి పోరాటంలో ఆరుగురు కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న మావోకు తన సొంత బిడ్డలంటే చాలా ప్రేమ ఉండేది. కాని వారితో చాలా కఠినంగా ఉండేవాడు. మావో పెద్దకొడుకు మావో అనియింగ్ ( పెద్ద భార్య యాంగ్ కాహ కొడుకు) సోవియట్ యూనియన్‌లో చదువుకొని చైనాకు తిరిగి వచ్చాడు. మావో అతనిని షాన్‌క్సి-గన్‌న్సూ-నింక్సియా సరిహద్దులలోకి - వ్యవసాయ పద్ధతులు నేర్చుకోవటానికి పంపాడు...

(అనియింగ్ తనకు నచ్చిన అమ్మాయినిపెళ్లి చేసుకోవటానికి రెండు సార్లు ప్రయత్నించాడు. తొలి ప్రయత్నం విఫలమయింది. రెండో ప్రయత్నంగా- సికి అనే యువతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కాని ఆమెకు పదహారేళ్లు మాత్రమే ఉండటంతో మావో ఒప్పుకోలేదు. దీనితో అనియింగ్‌కు చాలా కోపం వచ్చింది. ఆ నేపథ్యంలో జరిగిన ఒక సంఘటన) నాలాంటి బాడీగార్డ్స్‌తో కలిసి మావో అయినింగ్ సీ మెస్‌లో ఉండేవాడు. అయినింగ్‌ను బి మెస్‌లోకి మార్చటానికి అధికారులు ప్రయత్నించారు. కాని ఛైర్మన్ (మావో) ఒప్పుకోలేదు. "నీ చెల్లి(లీ నీ)- చిన్నప్పటి నుంచి సీ మెస్‌లోనే ఉంది. నువ్వు తన కన్నా పెద్ద.

నువ్వు ఏ మెస్‌లో ఉండాలో నీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు..'' అని అయినింగ్‌తో మావో అన్నాడు. ఒక రోజు మేమందరం కింద కూర్చుని భోజనం చేస్తున్నాం. ఒక కోడిని పుంజు వెంటాడుతోంది. దాని వల్ల దుమ్ములేస్తోంది. వాటిని చూసి- "కోడి పెట్టకు కూడా పుంజు కావాలి. నేను మనిషిని. నాకు ఇరవై ఏడేళ్లు వచ్చేసాయి. అయినా ఇంకా వేచి ఉండాల్సి వస్తోంది'' అని గట్టిగా గొణిగాడు. నాకు అప్పటికి 21 ఏళ్లు. నాకు పెళ్లి అయింది. అయినింగ్‌కు కాలేదు. నాకు ఇబ్బందిగా అనిపించింది. "కొద్ది కాలం ఓపిక పట్టు. ఛైర్మన్ మావో మంచి మూడ్‌లో ఉన్నప్పడు వెళ్లి పెళ్లిమాట చెప్పు. ఒప్పుకుంటాడు'' అని సలహా ఇచ్చాను.

నేను సలహా ఇచ్చిన కొన్ని రోజులకు- తూర్పు చైనాలో ఏడు శత్రు సైనిక బ్రిగేడ్లను మా సేనలు మట్టుపెట్టాయనే వార్తలు వచ్చాయి. మావో చాలా ఆనందంగా ఉన్నాడు. మావో ఆనందంగా ఉన్నప్పుడు బీజింగ్ ఒపేరా పాటలను గట్టిగా పాడేవాడు. ఆ రోజు కూడా గట్టిగా బీజింగ్ ఒపేరా పాటలను పాడుతున్నాడు. "ఛైర్మన్ పాటలు పాడుతున్నాడు. వెళ్లి నీ పెళ్లి విషయం చెప్పు. ఈ సారి ఒప్పుకుంటాడు'' అని అయినింగ్‌కు మళ్లీ సలహా ఇచ్చా. అయినింగ్ తండ్రి ఆఫీసుకు వెళ్లాడు. "నాన్నా! నేను రేపు పెళ్లి చేసుకుంటున్నా'' అని చెప్పాడు.

మావో తలెత్తి- "నిన్ను కొద్ది కాలం ఆగమన్నాను కదా'' అన్నాడు. "ఈ విషయం నా అంతట నేను నిర్ణయించుకోవాల్సింది అనుకుంటా!'' అని అయినింగ్ కొంత వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు. "ఎవరిని పెళ్లి చేసుకోవాలో నువ్వు నిర్ణయించుకోవచ్చు. కాని ఏ వయస్సులో పెళ్లి చేసుకోవాలో నిర్ణయించుకొనే అధికారం మాత్రం నీకు లేదు..మన దగ్గర ఉన్న నిబంధనలు మాత్రమే నిర్ణయిస్తాయి'' అని మావో స్వరం పెంచాడు. " నిబంధనలు ఉన్నా వాటిని పట్టించుకోకుండా చాలా మంది పెళ్లి చేసుకుంటున్నారు..'' అన్నాడు అయినింగ్. "కాని నువ్వు మావో జెడాంగ్ కొడుకువి.. నువ్వే పట్టించుకోపోతే- ఇంకెవ్వరు నిబంధనలను పట్టించుకుంటారు?'' అని మావో గట్టిగా అరిచాడు. చేతిలో ఉన్న బ్రష్‌ను విసిరేశాడు. అయినింగ్ విసవిస నడుచుకుంటూ రూమ్ బయటకు వెళ్లిపోయాడు. మావో కోపంతో ఊగిపోయాడు. "ఒక మంచి రోజంతా పాడైపోయింది..'' అన్నాడు.

(సైనికాధికారులు ఎంత చెబుతున్నా వినకుండా- కొరియా యుద్ధానికి మావో తన కొడుకును కూడా పంపాడు. ఆ యుద్ధంలో అయినింగ్ మరణించాడు..) అయినింగ్ మరణించినట్లు పెంగ్ దెహాయ్ నుంచి టెలిగ్రామ్ వచ్చింది. మరణవార్తను వెంటనే మావోకు చెప్పలేదు. కొద్ది సేపు దాచిపెట్టారు. ఆ తర్వాత చౌన్ ఎన్ లై, జిలాంగ్ మావో దగ్గరకు వెళ్లారు. అప్పటికి రాత్రి అయింది. మావో ఈజీ ఛైర్‌లో కూర్చుని ఉన్నాడు. అయినింగ్ మరణవార్త విన్న వెంటనే షాక్ తిన్నాడు. ఏమీ మాట్లాడలేదు. చౌన్ ఎన్ లై, జిలాంగ్‌ల కేసి చూస్తూ ఉండిపోయాడు. వారిద్దరు తలలు వంచుకొని నేల వైపు చూస్తున్నారు.

వారిద్దరికి కూడా ఏం చేయాలో అర్థం కావటం లేదు. మావో నెమ్మదిగా కళ్లు తిప్పాడు. దగ్గరలో ఉన్న టీ టేబుల్ మీద ఉన్న సిగరెట్లను తీసుకోవటానికి చేయి చాపాడు. సిగరెట్టు పెట్టెను తీసుకున్నాడు. దానిలో నుంచి ఒక సిగరెట్టును తీసుకోవటానికి ప్రయత్నించాడు. మావో చేతులు వణుకుతున్నాయి. పెట్టెలో నుంచి సిగరెట్టును తీసుకోలేకపోయాడు. నేను వెళ్లి మావోకు సిగరెట్టు నోట్లో పెట్టి ముట్టించాను. మొత్తం గదంతా నిశ్శబ్దంగా ఉంది. మావో సిగరెట్టు పొగను పీలుస్తున్న చప్పుడు తప్ప మరే శబ్దం వినిపించటం లేదు. మావో కళ్లు ఎర్రగా అయ్యాయి. దుఖఃం చేత కావచ్చు. సిగరెట్టు పొగ చేత కావచ్చు. అయినింగ్ జ్ఞాపకాల వల్ల కూడా కావచ్చు. జిలాంగ్ శబ్దం చేయకుండా గది బయటకు వెళ్లిపోయాడు. మావో మరో సిగరెట్టు తీసుకొని కాల్చటం మొదలుపెట్టాడు. గదంతా ఇంకా నిశ్శబ్దమే ఆవరించి ఉంది.. ఒక్క సారి గట్టిగా - "అతను మావో జెడాంగ్ కొడుకు. అదే అతని దురదృష్టం..'' అన్నాడు. నేను కళ్లు తిప్పుకున్నాను. ఒక్కసారి ఏడుపు పొంగి వచ్చేసింది.

(మావోకు లీ మిన్, లీ నీ అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరితో కూడా మావో కుమారులతోలాగే కఠినంగానే వ్యవహరించేవాడు. అయితే లీ నీ అంటే మావోకు ప్రత్యేకాభిమానం ఉండేది. లీ నీ మావో ఇంటికి దూరంగా ఉన్న ఒక విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ ఉండేది. విశ్వవిద్యాలయంలో ఆమెకు కూడా మిగిలిన విద్యార్థుల మాదిరిగానే రేషన్ ఉండేది. ఒక రోజు ఆమె మావో ఇంటికి వచ్చింది)

లీ నీ బెడ్‌రూమ్ లోపలికి వచ్చి తండ్రికి తన చదువు గురించి చెబుతోంది. ఆ తర్వాత విశ్వవిద్యాలయంలో తిండి గురించి ఫిర్యాదు చేయటం మొదలుపెట్టింది. "నాకు కావాల్సినన్ని రేషన్లు ఎప్పుడూ దొరకవు. ఏ రోజూ నేను క్లాసుకు పూర్తిగా తిని వెళ్లలేదు'' అంది. "ఈ ఇబ్బందులు ఎక్కువ కాలం ఉండవు. దేశంలో మిగిలిన వారి మాదిరిగానే నువ్వూ తినాలి. మిగిలిన వారికి నువ్వు ఒక ఉదాహరణ కావాలి. కమ్యూనిస్టు పార్టీ మీద విశ్వాసం కోల్పోవద్దని నువ్వు వారికి చెప్పగలగాలి...'' అన్నాడు మావో. ఇంతలో ఇన్ జిన్‌షాన్ వచ్చి భోజనం రెడీ అయిందని చెప్పాడు. "దా.. నాతో పాటు వచ్చి భోజనం చేయి'' అని లీ నీని మావో చేయి పట్టుకొని డైనింగ్ టేబుల్ దగ్గరకు తీసుకువెళ్లాడు. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న తర్వాత- లీ నీ అక్కడ గిన్నెలో పొగలు గక్కుతున్న అన్నం వైపు చూసింది.

"ఎంత మంచి వాసనొస్తోందో!'' అని గట్టిగా అంది. మావో భార్య అయిన, లీనీ తల్లి జియాంగ్ క్వింగ్ కూతురి వైపు చూసింది. ఏదో అనాలనుకుని ఆగిపోయింది. లీ నీ ముందున్న బౌల్‌లో అన్నాన్ని పెట్టింది. "భోజనం మొదలుపెట్టు..'' అన్నాడు మావో. లీ నీ గబగబ అన్నాన్ని నోటిలో కుక్కుకోవటం మొదలుపెట్టింది. అన్నం వేడిగా ఉండటం వల్ల నోరు కాలిపోయి ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి. "నెమ్మదిగా తిను. కంగారు లేదు'' అన్నాడు మావో. ఇదంతా ఒక బాడీగార్డు చూస్తూనే ఉన్నాడు. "మేము స్కూల్లో చాలా త్వరగా తింటాం. అదే అలవాటు అయిపోయింది'' అంది లీనీ ఆ బాడీగార్డుతో. "కాని ఇప్పుడు నువ్వు ఇంట్లో భోజనం చేస్తున్నావు...'' అన్నాడు మావో నవ్వుతూ. ఆయన మాటల్లో విషాదం ధ్వనించింది. "నువ్వు ఎంత తినగలిగితే అంత తిను..'' అంది క్వింగ్ లీ నీతో తల్లితండ్రులిద్దరినీ పట్టించుకొనే పరిస్థితిలో లేదు లీనీ.

ఆకలిగొన్న తోడేలులా.. అన్నాన్ని నమిలి మింగాలనే సృహ లేకుండా మింగేస్తోంది. మావో మౌనంగా ఆమెనే చూస్తున్నాడు. క్వింగ్ కూడా కుమార్తె వైపు, భర్త వైపు మార్చి మార్చి చూస్తోంది. లీ నీ తినే వేగం తగ్గింది. " అరే.. నువ్వు తినటం ఆపావేం?'' అని తండ్రిని ప్రశ్నించింది లీనీ. "నేను ముసలివాడిని అయిపోయాను. అందువల్లే ఎక్కువ తినలేకపోతున్నాను. నాకు కూడా నీ వయస్సు ఉంటే బావుండేది'' అన్నాడు మావో. టేబుల్ మీద ఉన్న న్యూస్ పేపర్‌ను తీసుకొని చదవటం మొదలుపెట్టాడు. క్వింగ్ లేచి నిలబడి తాను తింటున్న బౌల్‌లో ఉన్న అన్నాన్ని కూడా లీనీ బౌల్‌లో వేసేసింది. ఏడుస్తూ డైనింగ్ రూమ్ వదిలి వెళ్లిపోయింది.

Sunday, September 26, 2010

'ద గ్రాండ్ డిజైన్' - విశ్వం గురించిన 'శాస్త్రీయ అవగాహన చరిత్ర' * స్టీఫెన్ హాకింగ్

సృష్టికి కొత్త తాళంచెవి M సిద్ధాంతం

స్టీఫెన్ హాకింగ్-ఐన్‌స్టీన్ తర్వాత అంతటి పేరుప్రఖ్యాతుల్ని, గౌరవాన్ని సంపాదించుకున్న శాస్త్రవేత్త. ఆయన పేరు వినగానే రెండు విషయాలు మనసులో మెదులుతాయి. ఒకటి వీల్‌చైర్‌కి అంకితమైపోయిన ఆయన శరీరం, రెండోది ఆయన రాసిన 'ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్'. అనంత విశ్వం పుట్టుక గురించి రాసిన పుస్తకం. 1988లో అచ్చైన ఆ పుస్తకమే ఆయన్ని సామాన్య జనకోటికి సుపరిచితుణ్ణి చేసింది. ఒక్క ఇంగ్లీషులోనే 90 లక్షల కాపీలు అమ్ముడుపోయాయి. వందకి పైగా భాషల్లోకి అనువాదమైంది. ఆ స్టీఫెన్ హాకింగే ఇప్పుడు మరొక శాస్త్రవేత్త లియొనార్డ్ మ్లాదినోవ్‌తో కలిసి 'ద గ్రాండ్ డిజైన్' అనే పుస్తకం రాశారు. ఈ నెల 7న విడుదలైన ఆ పుస్తకం విశ్వం గురించిన 'శాస్త్రీయ అవగాహన చరిత్ర'ను మరోసారి పరిశీలిస్తుంది. ఆ పుస్తకంలోని కొన్ని భాగాలే ఈ వారం కవర్‌స్టోరీ.

"మనుషుల జీవితకాలం చాలా తక్కువ. ఆ కొద్ది కాలంలో ఈ విశ్వంలోని ఏ కొద్ది భాగాన్నో మాత్రమే మనం శో«ధిస్తాం. మనలో తలెత్తిన ప్రశ్నలకి సమాధానాలు వెతుకుతాం.... మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనమెలా అర్థం చేసుకోవాలి? ఈ విశ్వం ఇలాగే ఎందుకుంది? ఇది అసలెక్కడినుంచి వచ్చింది? ఎవరైనా సృష్టించారా? మనల్ని ఈ సందేహాలు నిత్యం వేధించకపోయినా ఎప్పుడో ఒకసారి అయినా మనం వాటిగురించి ఆలోచించకుండా ఉండలేం.
ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పాల్సింది తత్వశాస్త్రం. అయితే తత్వశాస్త్రానికి ఎప్పుడో కాలం చెల్లింది. శాస్త్రీయ రంగం, ముఖ్యంగా భౌతికశాస్త్ర రంగంలో జరుగుతున్న అభివృద్ధిని అర్థం చేసుకునేంతగా తత్వశాస్త్రం ఎదగలేదు. జ్ఞానాన్వేషణ అనే ప్రయాణంలో శాస్త్రవేత్తలే కాగడా పట్టుకు ముందుకు నడిపించే నాయకులయ్యారు. ఆ క్రమంలోనే ఈ మధ్యకాలంలో కనుగొన్న విషయాలు, చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలు మన ప్రశ్నలకి సమాధానాలిస్తున్నాయి. వాటిని అందించడమే ఈ పుస్తకం ఉద్దేశం.......

ఆధునిక భౌతికశాస్త్రం అభివృద్ధి చెందేవరకు ప్రపంచాన్ని ప్రత్యక్షంగా పరిశీలించి తెలుసుకోవచ్చని అనుకునే వాళ్లు. మనకి కనిపిస్తున్నట్టే వస్తువులు ఉంటాయని, మనం అవగతం చేసుకున్నదే వాస్తవమని మనం అనుకోవచ్చు గాక. కాని ఆధునిక భౌతిక శాస్త్రం అలా భావించదు. మనకి కనిపించే దృశ్యాల్ని మనం అర్థం చేసుకునే తీరు, అవే దృశ్యాల్ని ఆధునిక భౌతికశాస్త్రం విశ్లేషించే తీరు ఒకలా ఉండవు. అందుకే విశ్వాన్ని అర్థం చేసుకోవడానికి 'మోడల్ డిపెండెంట్ రియలిజం'ని ఉపయోగించాలి. అంటే ఏమిటంటే... మన ఇంద్రియాలు మెదడుకి చేరవేసే సంకేతాల్ని బట్టి మన మెదడులో మన చుట్టూ ఉన్న ప్రపంచ నమూనా ఏర్పడుతుంది. మన చుట్టూ జరిగే ప్రక్రియల్ని ఆ నమూనా వివరించగలిగితే ఆ వాస్తవాన్నే మనం నిజం అని నమ్ముతాం. అయితే ఒకే భౌతిక సందర్భాన్ని వేర్వేరు సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించవచ్చు. ఏదైనా ఒక ప్రక్రియని రెండు భిన్న సిద్ధాంతాలు వేర్వేరుగా వివరించినపుడు వాటిలో ఏది మెరుగో చెప్పలేం కాని మనకి అనుకూలంగా ఉన్న సిద్ధాంతాన్ని ఉపయోగించుకోవచ్చు.

శాస్త్ర విజ్ఞాన రంగంలో వచ్చిన మార్పుల్ని గమనిస్తే... ఒకదాని తర్వాత ఒకటిగా మెరుగైన సిద్ధాంతాలు, నమూనాలు వస్తూనే ఉన్నాయి. ప్లాటో నుంచి న్యూటన్ సిద్ధాంతాల దాకా, క్వాంటమ్ సిద్ధాంతాల దాకా మనం కొత్తకొత్త నియమాలను తెలుసుకుంటూనే ఉన్నాం. ఈ క్రమానికి ముగింపు లేదా అని అనుకుంటూనే ఉన్నా ఈ విశ్వానికి సంబంధించిన ప్రతి కదలికను, మన దృష్టికి వచ్చిన ప్రతి అంశాన్ని వివరించగలిగే ఒకే ఒక సిద్ధాంతం ఉండదా? ఈ ప్రశ్నకి సమాధానం మనవద్ద లేదు కాని అలాంటి సిద్ధాంతం గనక ఒకటుంది అనుకుంటే అదే ఎం. సిద్ధాంతం. ఆ సిద్ధాంతంపై ఆధారపడే ఈ చర్చ మొత్తం జరగనుంది. ఎం-సిద్ధాంతం ప్రకారం మన విశ్వం ఒక్కటే కాదు, మరెన్నో విశ్వాలున్నాయి. వాటి సృష్టికి ఏ దేవుడి అవసరమూ లేకపోయింది. భౌతిక సిద్ధాంతాలను బట్టి చూసినపుడు ఆ విశ్వాలన్నీ వాటంతటవే ఏర్పడ్డాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే మనలాంటి జీవులు ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. మొత్తం విశ్వాన్ని లోతుగా అర్థం చేసుకోవాలంటే ఆ విశ్వం ఎలా ప్రవర్తిస్తుందో మాత్రమే తెలుసుకుంటే సరిపోదు, అలా ప్రవర్తించడానికి కారణాలు తెలుసుకోవాలి.

ఈ విశ్వం ఎందుకుంది? శూన్యమే ఉండొచ్చుగా!
మనం ఎందుకున్నాం?
ఈ విశ్వాన్ని గురించి తెలియజేయడానికి కొన్ని సిద్ధాంతాలు మాత్రమే ఎందుకున్నాయి, వేరేవి ఎందుకు లేవు?


జీవితానికి, విశ్వానికి... సమస్తానికి సంబంధించి ఇవే అంతిమ ప్రశ్నలు. ఈ పుస్తకంలో పై ప్రశ్నలకి సమాధానాలు వెతికే ప్రయత్నం చేస్తాం.......

***

వాస్తవం అంటే ఏమిటి?

కొన్నేళ్ల క్రితం సంగతి... ఇటలీలోని మోంజా అనే నగర కౌన్సిల్ గోల్డ్ ఫిష్‌లను గోళాకార గాజు పాత్రల్లో ఉంచకూడదని నగర పౌరులను కోరింది. గుండ్రంగా ఉన్న గాజు గోడల గుండా చేప బయటి ప్రపంచాన్ని చూసినపుడు, దాని కళ్లకి బాహ్య ప్రపంచం వంగినట్టు కనిపిస్తుందని వారి వాదన. మరి మనం చూసేది సత్యమని మనకెలా తెలుసు? మనం కూడా గోల్డ్ ఫిష్‌లాగే ఒక మహాగోళంలో నుండి బాహ్య ప్రపంచాన్ని చూస్తున్నామేమో. గోల్డ్ ఫిష్ చూసేదానికి మనం చూసేదానికి తేడా ఉన్నా, మనం చూసేదే వాస్తవమని మనం ఎలా చెప్పగలం? నేరుగా వెళుతున్న ఏదైనా వస్తువు గోల్డ్ ఫిష్‌కి వలయాకారంలో ప్రయాణిస్తున్నట్టు కనిపిస్తుంది. దాన్నిబట్టి ఆ చేప వేరే శాస్త్రీయ పరిశీలనలు చేయొచ్చు, ఆ ఫిష్‌బౌల్ నుండి చూసినపుడు అవన్నీ కరెక్టే అని కూడా అనిపించవచ్చు...... ఖగోళంలోని వస్తువుల కదలికల ఆధారంగా టాలమీ క్రీ.శ. 150లో ప్రకృతి నియమాలను ప్రతిపాదించాడు. దాని ప్రకారం భూమి విశ్వానికి కేంద్రం... కాని 16వ శతాబ్దంలో కొపెర్నికస్ సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు.

పై రెండు సిద్ధాంతాల్లో ఏది వాస్తవమో తెలుసుకోవడం కంటే, మనం చేస్తున్న పరిశోధనలకి ఏది పనికొస్తుందని భావిస్తామో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. ఫిష్‌బౌల్ లోపల ఉన్నపుడు ఆ చేపకి కనిపిస్తున్న వాస్తవాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కాని బయట నుండి చూసినపుడు అది పనికి రాదు... అందుకే ఎం-సిద్ధాంతం కొన్ని సిద్ధాంతాల సముదాయం కాబట్టి ఆ సిద్ధాంతం ఉపయోగించి విశ్వాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ విశ్వంలో ప్రతి వస్తువు కదలికలను, ప్రవర్తనను శాస్త్రీయ సిద్ధాంతాలతో వివరించవచ్చు...

***

సృష్టి గురించి....

సృష్టికి సంబంధించి చైనీయులు 1782లో ఒక సంఘటన జరిగిందని నమ్ముతారు. దాని ప్రకారం.... అప్పుడు ఒక్కసారిగా విశ్వం మొత్తం మారిపోయింది. పది సూర్యగ్రహాలు ఒకేసారి ప్రత్యక్షమయ్యాయి. వాటి వేడికి ప్రజలందరూ ఇబ్బంది పడడంతో అప్పటి చక్రవర్తి ఒక్క సూర్యుణ్ణి మాత్రం ఉంచి మిగిలిన వాటిని బాణంతో కూల్చేయమని ఆజ్ఞాపించాడు..... సౌరమండలంలో ఎక్కువ సూర్యులుంటే జీవానికి అనువుగా ఉండదని చైనీయులు గ్రహించారు... సౌరమండలంలోని గ్రహాలలో కొన్ని ప్రత్యేక లక్షణాలున్నాయి కాబట్టే ఇక్కడ జీవం ఆవిర్భవించింది. అయితే ఈ సౌరమండలంలో గ్రహాల గమనానికి సంబంధించి శాస్త్రవేత్తల ప్రతిపాదించిన నియమాలను ఇక్కడ ప్రస్తావించాం. సూర్యుడు, చంద్రుడు, ఇతర గ్రహాల గమనం కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటుందన్న విషయాన్ని వివరించాం. అందుకే దేవుడు, దెయ్యం లాంటి మరే ఇతర శక్తి తమ ఇష్టం వచ్చినట్టుగా ఈ విశ్వాన్ని నడపలేదని మేం అంటున్నాం.

***

నియమం అంటే ఏమిటి?


ఒక నియమానికి ఒక క్రమం ఉంటుంది. ఏదైనా చర్య జరిగినపుడు ఆ చర్య జరిగిన క్రమాన్ని బట్టి శాస్త్రవేత్తలు దాని తర్వాత ఏం జరుగుతుందో అంచనా వేస్తారు. అయితే మనం చూసినదల్లా నియమం అయిపోదు. రోజూ సూర్యుడు తూర్పున ఉదయించడం మనం చూస్తున్నంత మాత్రాన 'సూర్యుడు తూర్పున ఉదయించును' అని సిద్ధాంతీకరించలేం కదా. దాన్ని శాస్త్రీయ నియమంగా గుర్తించలేం....
ఆధునిక శాస్త్రంలో అన్ని నియమాలూ గణిత సమీకరణాల్లో ఇమిడి ఉంటాయి. వాటిలో కొన్ని నియమాలకి ఖచ్చితమైన విలువలు ఉండొచ్చు, కొన్నిటికి ఉండకపోవచ్చు. ఆ నియమాల్లో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే వర్తించవచ్చు. న్యూటన్ గమన నియమాలు భూమ్మీద ప్రయాణించే వస్తువులకి వర్తిస్తాయి కాని కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్న వస్తువులకు వర్తించవు. అయినా వాటిని నియమాలుగా గుర్తించాం... ఈ సృష్టి కొన్ని నియమాలకి కట్టుబడి ప్రవర్తిస్తుందని చెప్పింది శాస్త్రవేత్తలే.

సృష్టి ఆ నియమాలకు తగ్గట్టుగా ప్రవర్తించేలా రూపొందించిందెవరు?
ఆ నియమాలకి మినహాయింపు ఉంటుందా?
అసలు ఆ నియమాలు ఎందుకు?


ఈ ప్రశ్నలకు శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు వారి వారి సమాధానాలిచ్చారు. అయినా ఈ నియమాలన్నీ సృష్టించింది దేవుడే అనుకునేవారు కూడా ఉన్నారు. ఈ సృష్టి నియమాల సముదాయమే దేవుడని అంటారు వారు. ఒకవేళ అవి దేవుడి సృష్టే అయితే వాటికి మినహాయింపులు ఉంటాయా? ఆయనే సృష్టించిన వాటికి మినహాయింపులు కల్పించడం ఏమిటి.....

ఖగోళంలోని గ్రహ, నక్షత్రాలకు సంబంధించి మాత్రమే అలాంటి నియమాలు వర్తిస్తాయని, భూమిపైన జరిగే రకరకాల ప్రక్రియలకు, మానవుల ప్రవర్తనకు ఆ నియమాలు వర్తించవని మొదట్లో భావించే వారు. ఎందుకంటే భూమ్మీద జరిగే వాటికి కారణాలను ప్రాచీన నాగరికులు కనుగొనలేక పోయారు. అయితే క్రమంగా ఖగోళమే కాదు, భూమ్మీద జరిగే ప్రతి క్రియకి కొన్ని నియమాలున్నాయని, వాటికి కట్టుబడే అవి జరుగుతాయని కనుగొన్నారు....
ఈ మొత్తం విశ్వం ఒకానొక నిర్ధారిత సమయంలో ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడానికి తగిన నియమాలు ఉన్నపుడు మాత్రమే ఆ నిర్ధారిత సమయం నుంచి విశ్వంలో క్రమంగా ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటున్నాయో పరిశీలించగలం, అధ్యయనం చేయగలం. ఆ నియమాలన్నీ అన్ని వేళలా నిరూపించబడాలి. అప్పుడే అవి నియమాలవుతాయి. వాటికి మినహాయింపులు ఉండకూడదు. అంటే... వాటికి కట్టుబడి కాకుండా ఏ అద్భుతాలో జరగడానికి తావుండకూడదు. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడంలో దేవుళ్లు దెయ్యాల ప్రమేయం ఉండకూడదు.....
శాస్త్రీయ నిర్ధారణ అనే ఆలోచన వచ్చాకే న్యూటన్ గమన నియమాలు మనకు తెలిశాయి. ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాపేక్ష సిద్దాంతంతో శాస్త్రీయ నిర్ధారణ మరో అడుగు ముందుకేసింది. ఆ తర్వాత వచ్చిన మరికొన్ని నియమాలు విశ్వాన్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో దోహదపడ్డాయి. అయితే ఈ నియమాలన్నీ విశ్వానికి సంబంధించినంత వరకు వివిధ చర్యలు ఎలా జరుగుతున్నాయనే విషయాన్నే పరిశీలిస్తున్నాయి కాని ఎందుకలా జరుగుతున్నాయనే ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాయి.

ఆ ప్రశ్నకి సమాధానం దేవుడని, ఈ విశ్వాన్ని సృష్టించింది దేవుడేనని కొందరంటారు. ఈ సృష్టికి మూలం దేవుడైనపుడు ఆ దేవుణ్ణి సృష్టించినవారెవరు అనే ప్రశ్న కూడా తలెత్తకుండా ఉండదు. అలా వాదించుకుంటూ పోతే... ఏదైనా వస్తువుని ఎవరూ సృష్టించనవసరం లేదని, అది అలా ఏర్పడవచ్చని, అదే దేవుడని కూడా వాదించే వారున్నారు. అయితే ఈ సృష్టి ఎందుకలా ఏర్పడిందన్న ప్రశ్నకి సమాధానం చెప్పడానికి దేవుడు అవసరం లేదు. సైన్సే వాటికి సమాధానం చెబుతుందని మేమంటున్నాం.
(ఎలాగో తెలుసుకోవాలంటే ఎం. సిద్ధాంతాన్ని తెలుసుకోవాల్సిందే, పుస్తకం చదవాల్సిందే)

ఎం-సిద్ధాంతం అంటే...

పరమాణు స్థాయిలో పదార్థాల ప్రవర్తనని అభ్యసించేది క్వాంటమ్ సిద్ధాంతం. ఖగోళంలోని గ్రహాల, నక్షత్రాల గురించి అభ్యసించేది సాపేక్ష సిద్ధాంతం. ఈ రెండిటినీ కలిపి ప్రతిపాదించినది స్ట్రింగ్ సిద్ధాంతం. ఇది పరమాణువు నుంచి అనంత విశ్వం దాకా దేనిగురించి అయినా అభ్యసించడానికి దోహదపడుతుంది. కాబట్టి దీన్ని 'థియరీ ఆఫ్ ఎవ్విరిథింగ్' అని అంటారు. దీని కొనసాగింపుగానే ఎం. సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఎం. అంటే మెంబ్రేన్.

Saturday, September 25, 2010

The world’s first * One Million Star Hotel * Sand Hotel

World’s First One Million Star Hotel



I know it sounds incredible, but the world’s first one million star hotel is not what you’d expect. If you love the outdoors, it’s actually better.
Five star hotels are awesome, seven star hotels are incredible, so just imagine what a million star hotel would be like. I bet you’re not picturing a corn field, are you? Well, that’s exactly what the world’s first million star hotel looks like – a building-like shape carved into a corn field, near the German village of Bad Kissingen. 42-year-old Monica Fritz thought it would be a great idea to offer tourists the chance of living in a million star hotel that actually offers a view of all the stars in its title. She carved out the hotel, installed hay beds, and dug holes in the ground as kitchens and toilets. Not exactly the luxury most people would expect from such a pompous sounding establishment, but the owner says the night view of the stars and the fresh air are compensation enough. The so-called rooms of the one million star hotel cost between 3 and 7 euros and, believe it or not, have been booked in advance. Monica Fritz says that despite the short summer season (the corn will be harvested soon), her hotel already has 400 reservations for the following weeks.
 





**********************

World’s First Sand Hotel




The world’s first sand-hotel is open for business on Weymouth beach, Dorset, in England. The 1000 tone-of-sand structure was built in a week by a team of 4 sand-sculptors and is only expected to last until it rains…which, as you probably know, happens quite often in Britain.
The sand-hotel was commissioned by a local travel website that, upon doing some research, found out that 57% of English tourists prefer foreign beach-destinations instead of national ones. So this is like a statement that signifies the rebirth of British tourism. The sand hotel has no roof, so you have a clear view of the star-filled night sky, no toilets and is not recommended for those that hate getting sand between their toes. For an offbeat experience like spending a night at the wonderful sand-hotel, you only have to pay $21, more than a fair price, in my opinion.
And if this doesn’t appeal to you, maybe you’d like to try the ice-hotel? But you’ll have till winter for that one. sand_hotel.jpg sand_hotel1.jpg sand_hotel2.jpg sand_hotel3.jpg

Friday, September 24, 2010

'సెమీ ఆటోమేటిక్ చపాతీ' ఆలోచన

రెడీమేడ్ చపాతీ

నలుగురున్న ఇంట్లో చపాతీలను, పూరీలను తయారుచే యాలంటే పెద్ద పని. పిండి కలపాలి, వత్తాలి. ఆపై కాల్చాలి. పూరీలయితే వేయించాలి. పెద్దపెద్ద హోటళ్లలో, క్యాంటీన్లలో ఈ పని మరింత భారం కదా.
ఏదో ఒక యంత్రం పిండి కలిపి, చపాతీ, పూరీలను చేసి కాల్చడానికి రెడీగా అందిస్తే..? కలో, కోరికో కాదు. ఇప్పుడు అలాంటి యంత్రం ఉంది. వాటికి భారీ మార్కెట్ కూడా ఉందని చెప్పారు హైదరాబాద్‌కి చెందిన ప్రభాకర్. ఒక కొత్త తరహా ఆలోచనతో వ్యాపారాన్ని ప్రారంభించిన ఆయన మార్గం ఇంకొందరు ఔత్సాహికులు అనుసరించడానికి అనువుగా ఉంది.

హైదరాబాద్‌లోని మల్కాజ్‌గిరి ప్రాంతంలో ఒక మలుపులో 'ఇక్కడ వండుటకు సిద్ధంగా ఉన్న చపాతీలు, పూరీలు, జొన్నరొట్టెలు లభిస్తాయి' అనే ప్రకటన కనిపిస్తుంది. ఒకటి రెండు రూపాయలకు మించని ధర. పరిశుభ్రమైన వాతావరణం

. వెళ్లినవాళ్లు కొన్నయినా కొనుక్కురాకుండా ఉండలేరు, ఒకసారి కొన్నవాళ్లు మరోసారి వెళ్లకుండా అసలే ఉండలేరు. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ఉద్యోగినులు, బ్రహ్మచారులకే కాదు, గృహిణులకు కూడా ప్రభాకర్ ప్రారంభించిన చపాతీ యంత్రం ఒక ఊరటలాగా కనిపిస్తోంది. అందువల్లే ఏడాది క్రితం ప్రారంభమైన ఆయన వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతోంది.

ఆలోచన ఎలా?
ఒక మద్యం తయారీ సంస్థ సేల్స్ రంగంలో 27 సంవత్సరాలు పనిచేసిన ప్రభాకర్ ఆ పనితో విసిగిపోయారు. ఒత్తిడివల్ల రక్తపోటు, మధుమేహం వంటి ఆరోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. ఏదైనా వ్యాపారం చేద్దామనుకున్నాడు. దేశమంతా తిరిగిన అనుభవం, కొత్తగా చెయ్యాలన్న తపన.. వీటికి ఇంటర్నెట్ పరిజ్ఞానం జోడిస్తే 'సెమీ ఆటోమేటిక్ చపాతీ' ఆలోచన వచ్చింది ఆయనకు. ఆ యంత్రాన్ని కొనుగోలు చేసి, తన ఆలోచనకు తగినట్టు దానిలో మార్పులుచేర్పులు చేశారు.

ఎలా తయారవుతాయి?
గోధుమపిండి, నూనె, ఉప్పు, నీటిని ఒకేసారి యంత్రంలో వెయ్యాలి. సరిగ్గా ఏడు నిమిషాల్లో పిండి కలపడం పూర్తవుతుంది. దాన్ని సిలిండర్‌లో పెట్టి హైడ్రాలిక్ ప్రెషర్‌ను ఉపయోగించినప్పుడు చపాతీలు, పూరీలు కావాల్సిన పరిమాణంలో వచ్చేస్తాయి. ఈ క్రమంలో తేమ తీసేస్తారు కనుక అవి ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి. అందువల్లే అవి ఫ్రిజ్‌లో ఉంచితే ఆరు రోజుల వరకూ పాడవకుండా ఉంటాయి.

ఇలా తయారయిన వాటిని ఇంట్లో నేరుగా వండుకోవడమే. ప్రస్తుతానికి ప్రభాకర్ వీటిని సామాన్య వినియోగదారులతో పాటు, కేటరింగ్ సంస్థలు, కర్రీపాయింట్లు, హాస్టళ్లు, సూపర్‌మార్కెట్లకు పంపిణీ చేస్తున్నారు. కిందటేడు కర్నూల్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో వరదలు వచ్చినప్పుడు అక్కడ పంచడానికి దాతలకు తగ్గింపు ధరల్లో దాదాపు పద్దెనిమిదివేల చపాతీలను అందజేశారు.

కిటుకులు తెలియాలి..
ప్రభాకర్ యంత్రం గంటకు నాలుగువందల చపాతీలను తయారుచెయ్యగలదు. కాని ఇప్పటికైతే రోజుకు రెండువేల చపాతీలు, పూరీలు అమ్ముడుపోతున్నాయి. దీనిమీద ప్రభాకర్ కాకుండా ముగ్గురు మహిళలు, ఒక సూపర్ వైజర్ ఉపాధి పొందుతున్నారు. 'పెద్ద ఉద్యోగాన్ని వదిలేసి, రొట్టెలమ్ముకోవడం ఏమిట'ని ప్రభాకర్‌ను చాలామందే నిరుత్సాహపరిచారట.

వ్యాపారం ప్రారంభించిన కొత్తలో సరిగా కుదరక చాలా పిండి వృధా అయిపోయి నష్టం వచ్చేదట. నాలుగయిదు నెలలయితేగానీ ఆ పనిలో చేయి తిరగలేదు. 'చపాతీ, పూరీల పిండి సరిగా కలపడం అనుభవాన్ని బట్టే ఉంటుంది. దానికితోడు వాతావరణాన్ని అనుసరించి కూడా ఉంటుంది.

హైదరాబాద్ వంటి పొడి వాతావరణంలో పాళ్లు కలిపినట్టు విశాఖపట్నం వంటి సముద్రతీర ప్రాంతాల్లో కలపడానికి కుదరదు.. అది చెయ్యగాచెయ్యగా వస్తుంది' అని చెబుతున్న ప్రభాకర్ ప్రభుత్వ సంస్థ అయిన 'డైరెక్టరేట్ ఆఫ్ షోర్‌గమ్'తో (షోర్‌గమ్ అంటే జొన్నలు) ఒప్పందం కుదుర్చుకున్నారు.

మధుమేహవ్యాధిగ్రస్తుల కోసం ఆ సంస్థ రాగులు, జొన్నలను కలిపి తయారు చేసిన పిండిని ప్రభాకర్‌కు ఇస్తే, ఆయన దాంతో రోజుకు ఐదొందల చపాతీలను తయారు చేస్తున్నారు. ఆ సంస్థే 'వేగన్' అనే పేరుతో వాటిని సూపర్‌మార్కెట్లలో అమ్ముతోంది. సుమారు ఆరులక్షల రూపాయల దాకా పెట్టుబడి అవసరమయ్యే ఈ వ్యాపారాన్ని రాష్ట్రంలోని ఇతర ప్రదేశాల్లో ప్రారంభించాలనుకునే ఉత్సాహం ఉన్నవారికి తాను స్వయంగా శిక్షణనిస్తానంటున్నారు ప్రభాకర్.

ఈ మాత్రం ఊతమిస్తే ఔత్సాహిక వ్యాపారవేత్తలు ఇక ఆగుతారా? ఇకముందు చాలాచోట్ల రెడీ టు కుక్ చపాతీలు, పూరీలూ దర్శనమిస్తాయేమో!   (ప్రభాకర్ సెల్ నెంబర్ : 98480 72133)
- అరుణ పప్పు

Thursday, September 23, 2010

ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న నైజీరియా * ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. * మన వాళ్లకూ ఆశలూరిస్తోంది. * భారతీయులకు నైజీరియా బంగారు బాతు.

ఎప్పుడూ అంతర్యుద్ధాలతో ..బయటి ప్రపంచానికి అశాంతి దేశంగా కనిపిస్తుంది.. కాని ఇక్కడ ల్యాండ్ అయితే గాని తేలీదు విదేశీయులుండటానికి ఇది ఎంత అనువైనదని. తమ శ్రమను దోచుకునే వారంటే ఈ దేశీయులకు చెప్పరాని అసహ్యం. అయినా వాళ్ల పద్ధతులను గౌరవిస్తారు. వాళ్ల అలవాట్లకు మర్యాదిస్తారు. ఫుట్‌బాల్ అంటే అమిత ఇష్టం. చేసే ప్రతి పనిలో కళాత్మకతను చూపిస్తారు. అదే...ప్రకృతి వనరులు సమృద్ధిగా ఉన్న నైజీరియా. ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది. మన వాళ్లకూ ఆశలూరిస్తోంది. ఓఎస్ఐ కన్సల్టింగ్ కంపెనీలో డెలివరీ మేనేజర్ (ఒరాకిల్ అప్లికేషన్)గా పనిచేస్తున్న రాచుమల్ల అనీల్ కుమార్ కొంతకాలంగా ఈ దేశంలోనే ఉంటున్నారు. 
ఆయన దృష్టిలో నైజీరియా...
 
నా వృత్తిలో భాగంగా ప్రాజెక్ట్ పనుల మీద ప్రపంచ దేశాలన్నీ తిరుగుతుంటాను. ఇప్పటి వరకు యుఎస్, యుకె, బెల్జియం, చైనా, మలేషియా, మారిషస్, సౌదీ, దుబాయ్ వంటి 11 దేశాలు తిరిగాను. ఇప్పుడు నైజీరియాలో ఉంటున్నాను. ఇక్కడికొచ్చి సంవత్సరమవుతోంది. నేను చూసిన అన్ని దేశాల కంటే నాకు బాగా నచ్చింది నైజీరియానే.

గో స్లో
నేనుండేది నైజీరియా పాత రాజధాని లెగోస్‌లో (కొత్త రాజధాని అబుజా). ఇక్కడా వారానికి ఐదు రోజులే పనిదినాలు. ఉదయం ఏడింటికల్లా లేచి టిఫిన్, వంట చేసుకుని టిఫిన్ తిని, లంచ్ బాక్స్ తీసుకెళ్తాను. నేనుండే గెస్ట్ హౌస్ ఆఫీస్‌కు దగ్గరే కాబట్టి తొమ్మిదికి బయలుదేరి వెళ్తాను. కాని స్థానికులు మాత్రం ఏడున్నరకే వస్తారు. ఎందుకంటే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఎక్కువ . మూడేసి గంటలు కూడా జామ్ అవుతుంటుంది. ట్రాఫిక్ జామ్‌ను వాళ్లు 'గో స్లో' అంటారు. ఉదయం ఎనిమిది నుంచి పదకొండు దాకా, సాయంత్రం ఐదు నుంచి ఎనిమిదాకా ఎక్కువుంటుంది. ట్రాఫిక్ జామ్ అయినప్పుడు రోడ్లమీదే షాపింగ్ చేసుకుంటారు.

దీన్ని గో స్లో షాపింగ్ అంటారిక్కడ. గుండు పిన్నుల దగ్గర్నుంచి తినే వస్తువుల దాకా అన్నీ మన దగ్గరకొచ్చి అమ్ముతుంటారు. ఇంకా వంట చేసుకోలేదే అన్న బెంగ కూడా అక్కర్లేదు. చాలామంది ఆ ట్రాఫిక్ జామ్‌లోనే టిఫిన్లు, కాఫీలు లాగిస్తుంటారు. మళ్లీ ట్రాఫిక్ సిగ్నల్స్‌ను, రూల్స్‌ను చాలా కచ్చితంగా పాటిస్తారు. ఎవరూ నిర్దేశించిన గీత దాటరు. ఫోర్ వీలర్ టాక్సీలున్నట్టే ఇక్కడ టూ వీలర్ టాక్సీలూ ఉంటాయి. వీటిని వొకాడా(ఠిౌజ్చుఛ్చీ) అంటారు. మన ఆటోలు, బజాజ్ బాక్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయి.

టాప్ మేనేజ్‌మెంట్‌కి 12 గంటలు
నైజీరియన్లు చాలా పంక్చువల్‌గా ఉంటారు. ఉదయం ఏడున్నరకొచ్చి నాలుగున్నర ఐదుకల్లా వెళ్లిపోతారు. టాప్ మేనేజ్‌మెంట్ మాత్రం పన్నెండు గంటలు పనిచేస్తుంది. అందుకే మేము పని ముగించుకుని మా గెస్ట్ హౌస్‌కు వెళ్లేసరికి పది అవుతుంది. మధ్యాహ్నం లంచ్ బాక్స్ తీసుకెళ్తానని చెప్పాను కదా..అది తినేస్తాను. లేదంటే క్యాంటీన్ లాంటిది ఉంటుంది. రైస్ తెచ్చుకుని కర్రీస్ క్యాంటీన్‌లో తీసుకుంటాం. వీళ్ల వంటలు ఇండియా వంటల్లాగే ఉంటాయి. కూరలన్నీ ఇంచుమించు మన కూరల్లాగే ఉంటాయి, కాకపోతే కారానికి బదులు మిరియాలు వాడతారు. స్పైసీ కూరల్నే ఎక్కువ ఇష్టపడతారు.

నైజీరియాలో నెలకోసారి ఊరు క్లీనింగ్ డే


క్లీనింగ్ డే, నో మోబైల్స్ డే
అదంతా బాగానే ఉంటుంది గానీ లెగోస్‌లో సగం జీవితం ప్రయాణంలోనే గడిచిపోతుంది. ఎక్కడికి వెళ్లాలన్నా కనీసం 50 కిలోమీటర్లు ప్రయాణించాలి. ఆఫీస్ దగ్గర్లో ఇల్లు దొరకడమనేది పెద్ద లగ్జరీ. ట్రాఫిక్‌లోనే సగం రోజు గడిచిపోతుంది. అందుకని మిగిలిన రోజుల్లో హడావుడిగా గడిపిన వాళ్లంతా శనివారం తీరిగ్గా ఇంటిపనుల్లో పడతారు. అందుకే శనివారాన్ని క్లీనింగ్ డే అంటారు. ప్రతి నెల రెండో శనివారం అయితే ఊరుని బాగు చేసే పనిలో ఉంటారు. పేద, ధనిక అనే తేడాల్లేకుండా అందరూ పాలు పంచుకుంటారు. రోడ్ల దగ్గర్నించి టాయ్‌లెట్స్ దాకా అన్నీ శుభ్రం చేస్తారు.

ఆ రోజు ఉదయం ఫ్లైట్స్‌కూడా ఎగరవు. అలాగని వీకెండ్స్ జాలీగా గడపరని అనుకోడానికి వీల్లేదు. శుక్రవారం రాత్రి నుంచే క్లబ్బులు, పబ్బులు పాటలు, డ్యాన్సులతో హోరెత్తుతుంటాయి. శనివారం నాకైనా క్లీనింగ్ డేనే. ఆదివారాన్ని రిలిజియస్ డేగా పాటిస్తారు. ఆ రోజు మొబైల్స్ కూడా పనిచేయవు. ముస్లింలు, క్రైస్తవులు అందరూ ప్రార్థనల్లో మునిగిపోతారు. ప్రతి చర్చికి స్వంత చానెల్, హెలికాప్టర్ ఉంటుంది.

పెట్రోలు బాగా చవక
అఫ్రికా అంతటినీ ఫ్రెంచ్ వాళ్లు పరిపాలిస్తే నైజీరియా, ఘనాలను మాత్రం బ్రిటిషర్లు పాలించారు. అందుకే ఈ రెండు దేశాల్లో బ్రిటిష్ వాళ్ల ప్రభావం చాలా ఉంటుంది. సాంస్కృతికంగా ఎంతో సుసంపన్నమైన దేశం నైజీరియా. పూర్తిగా వైరుధ్యమున్న రెండు తరగతులు కనిపిస్తాయి ఇక్కడ. చదువుకుని కాలానికనుగుణంగా మారి బాగా బతుకుతున్నవాళ్లు ఒక వర్గం, చదువులేక పేదరికంలో మగ్గుతున్నవాళ్లు రెండో వర్గం(ఉత్తర నైజీరియా వనరుల పరంగా...దక్షిణ నైజీరియా విద్యాపరంగా సంపన్నమైంది). చిత్రమైన విషయమేమిటంటే...ఎంత చదువుకున్న వారికైనా వాళ్ల తెగను సూచించే గాట్లుంటాయి వాళ్ల మొహాల్లో. లెగోస్ ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల నగరాల్లో ఐదోది.

ఆఫ్రికాలోనైతే మొదటిది. ఏనుగు దంతాలు, పులిగోర్లు.....వీటితో చేసిన కళాఖండాలు రోడ్లమీదే అమ్ముతుంటారు. దీన్ని జాకుండే మార్కెట్ అంటారు. ముడిచమురు దండిగా దొరుకుతుంది. అందుకే పెట్రోల్ చాలా చవక. స్థానికంగా యురోబా, హౌసా వంటి భాషలున్నా ఇంగ్లీషే అధికార భాష.ఈ భాషలకు లిపి లేదు. ఇంగ్లీషులోనే రాస్తారు.

సొంతంగా జనరేటర్లు
అద్భుతమైన ప్రకృతి వనరులున్నప్పటికీ ఇక్కడ పవర్ ప్లాంట్లు లేక ఎవరికి వారే ఇంట్లో కరెంట్‌ను ఉత్పత్తి చేసుకుంటారు. ఇల్లు కట్టుకునేప్పుడే జనరేటర్ కోసం ప్రత్యేకించి కొంత స్థలాన్ని కేటాయించుకుంటారు. కరెంట్ లేక మిగిలిన అభివృద్ధి ఆగిపోయినా మౌలిక సదుపాయాలు మాత్రం బాగానే ఉన్నాయి. పెద్ద పెద్ద రోడ్లు....రింగ్ రోడ్లు...ఫ్లై ఓవర్లు ఎప్పుడో డెభ్భైల్లోనే కట్టుకున్నారు. బస్సులే ముఖ్యమైన రవాణా సౌకర్యం. బిఆర్‌టిఎస్ అంటే బస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్ట్‌మ్ అది ఎప్పుడో డెవలప్ అయిందిక్కడ. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకోకుండా బస్సులకు సపరేట్ లైన్ ఉంటుంది. ఆ దారిలోనే వెళ్తుంటాయి. దాదాపు ప్రతి వాళ్లకు స్వంత ఫోర్ వీలర్ ఉంటుంది.

షాపులకు తాళాలుండవు
ఒక్క బియ్యం తప్ప ఇండియాలో దొరికే ప్రతీదీ దొరుకుతుంది. వీళ్లు బాసుమతి బియ్యం ఎక్కువగా తింటారు. ఇండియన్ రెస్టారెంట్లు, షాపులు అన్నీ ఉంటాయి. వీళ్లు బీఫ్, టర్కీ, జింక మాంసం ఎక్కువగా తింటారు. మనం అన్నం తిన్నట్టుగా వీళ్లు బంగాళా దుంపను పోలిన..గుమ్మడికాయ సైజులో ఉండే యామి అనే దుంపను ఉడికించి ముద్ద చేసుకుని కూరలతో తింటారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ప్రతి వీథికి ఎలాగైతే ఉంటాయో... అలాగే నైజీరియన్ల సంప్రదాయ ఆహారానికి సంబంధించిన ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు కూడా ఉంటాయి. మనకు కావాల్సింది ఆర్డరిస్తే ఐదు నిమిషాల్లో రెడీ చేసిస్తారు. గమ్మత్తయిన విషయం ఏంటంటే...రాత్రిళ్లు షాపులకు తాళాలే వేయరు. బంగారం షాపులకు క్కూడా. దొంగతనాలు అసలు జరగవు. కాని మోసాలు ఉంటాయి. మాటలతో గారడీ చేస్తుంటారు. ఆ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే.

మనవాళ్లు ఎక్కువగా వ్యాపారస్తులు
సింధీలు, గుజరాతీలు ఎక్కువగా ఉంటారు. వ్యాపారరంగంలో మన సింధీలదే పైచేయి. చోళా రామ్స్, భోజ్ రాజ్ అని ఇండియలో రిలయన్స్ ఎంత పెద్ద కంపెనీయో ఇక్కడ ఇవి ఇంచుమించు ఆ స్థానంలో ఉన్నాయి. తెలుగు వాళ్లు దాదాపు 15 వేల మంది ఉన్నారు. 'ఇల్లుపేజ్' అనే చోట ఎక్కువగా కనిపిస్తారు. ఇండియన్ ఎంబసీ స్కూల్ కూడా ఇక్కడే ఉంది. వెంకటేశ్వర స్వామి దేవాలయం కట్టారు. తిరుపతిలో ఎలా జరుగుతాయో ఇక్కడా అలాగే జరుగుతాయి కార్యక్రమాలన్నీ. ప్రతి పండక్కి అందరూ కలుస్తారు. నైజీరియాలో ఎక్కువగా కనిపించేది లెబనీయులు, చైనీయులే.

దేశభక్తి ఎక్కువ
సింధీలు రక్తం పీలుస్తారనే అభిప్రాయం ఉంది వారిలో. సింధీల వల్ల ఇండియన్లంటేనే నైజీరియన్లకు కోపం ఉన్నా.. బాగా చదువుకున్న వారని, తెలివైనవాళ్లనే గౌరవం కూడా ఉంది. ఏదైనా రెస్టారెంట్‌కి భారతీయులు వెళితే బీఫ్‌ను వాళ్ల దరిదాపుల్లోకి కూడా రానీయరు. అంత మర్యాదిస్తారు మనకు.. గొడ్డు చాకిరీ చేయడంలో వాళ్లకు మించిన వాళ్లు ఎవరూ లేరేమో..! దేశ భక్తి ఎక్కువ.

ప్రతి కారులో వాళ్ల దేశం జెండా ఉంటుంది. మంచి క్రీడా ప్రియులు. ఫుట్ బాల్ అంటే ప్రాణం. మొన్న ఫుట్ బాల్ గేమ్స్ అప్పుడైతే నైజీరియా టీమ్ ఆడే రోజున రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రతి వాళ్లకు తప్పకుండా ఓ అభిమాన ఆటగాడుంటాడు. కాఫీ మగ్గుల మీద, టీ షర్టుల మీద, ఒంటి మీద టాటూస్ రూపంలో ఈ ఆటగాళ్లు దర్శనమిస్తుంటారు. ఇంటిని అలంకరించుకోవడం దగ్గర్నుంచి వీళ్లు చేసే ప్రతి పనిలోనూ కళాత్మకత ఉట్టి పడుతుంది.

కాస్ట్ ఆఫ్ లివింగ్...
ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువే. 2 వేల డాలర్లు పెడితే గాని ఇల్లు దొరకదు అద్దెకు. కాని సివిల్ ఇంజనీరింగ్, మెడిసిన్ చదివిన వాళ్లకు ప్రపంచంలోనే అథ్యధిక వేతనం చెల్లిస్తున్న దేశం ఇదే. 8 వేల డాలర్లతో పాటు ఇల్లు, కారు ఇస్తారు. ఇందులో 6 వేల డాలర్లు మన పేరు మీద మన దేశ బ్యాంకులో వేసి మిగిలిన డబ్బును ఇక్కడి కరెన్సీ నైరోల్లో ఇస్తారు. దేనికీ లోటు లేదు.

వాతావరణం కూడా మన వైజాగ్ వాతావరణాన్ని పోలి ఉంటుంది. కిడ్నాప్‌లు, మర్డర్లతో భయంకరంగా ఉంటుంది నైజీరియా అంటారు చాలామంది కాని అది అబద్ధం. ఉత్తర నైజీరియాలో కొన్ని ప్రాంతాల్లో డబ్బుల కోసం కిడ్నాప్‌లు చేస్తారు కాని మర్డర్లు చేస్తారనడంలో వాస్తవం లేదు. అయితే ఎప్పుడూ తెగల మధ్య జరిగే అంతః కలహాల వల్ల సైనిక చర్యలు ఉంటుంటాయి. నాకు తెలిసినంత వరకు ప్రొఫెషనల్ కోర్సులు చేసి వేరే దేశం వెళ్లాలనుకునే భారతీయులకు నైజీరియా బంగారు బాతు.

Friday, September 17, 2010

సృజనాత్మక వ్యాపకం...!

treeకళాకారుడు ప్రకృతిని తయారు చేయలేడు. కానీ తన సృజనను ఉపయోగించి దానికి ప్రతిరూపాన్ని తయారు చేస్తాడు. బోన్సాయ్‌ మొక్కలు కూడా కళాకారుని నీడలో ప్రకృతిపరంగానే ఎదుగుతాయి. నిజానికి ఈ మరుగుజ్జు మొక్కల పెంపకం ఒక ఖరీదైన వ్యాపకం. ధనవంతులకు ఒక హాబీ. నిజానికి బోన్సాయ్‌ మొక్కల పెంపకం ఒక కళ. జపాన్‌ దేశ సంస్కృతి, విశ్వాసాల నుంచి విస్తరించిన ఈ కళ ఆసక్తికరమైనది. పెంపుడు జంతువులను పెంచుకున్నట్లే బోన్సాయ్‌ మొక్కలనూ పెంచుకోవచ్చు. హాబీగా బోన్సాయ్‌ మొక్కలను పెంచడానికి నిర్దిష్టమైన సూత్రాలు ఎమీ లేవు. మొక్కలను పెంచడానికి వ్యక్తిగతమైన ఇష్టం ఆసక్తి, ఓర్పు, సహనం ఉండాలి.

tree1బోన్సాయ్‌ మొక్కల తయారీ అంటే జన్యుపరంగా పెరిగే చిన్న మొక్కలు కాదు. అలాగే బలవంతంగా కూడా మొక్కలను చిన్న చిన్నవిగా మార్చలేము. మామూలు చెట్లలానే సరైైన నీరు గాలీ వెలుతురు, పోషకాలు అందజేస్తూ బోన్సాయ్‌ మొక్కగా తీర్చిదిద్దితే... అది మరుగుజ్జు మొక్కగా ఎదుగుతుంది. ఇవి మొదటగా వేయి సంవత్సరాల క్రితం చాలా కొద్ది సంఖ్యలో చైనా దేశంలో ఉండేవి. ఇప్పటికీ చైనాలో ఈ బోన్సాయ్‌ మొక్కల పెంపకం మనకు కనిపిస్తుంది. దీనిని వారు పున్‌ - సాయ్‌ అంటారు. ‚ఇవి అన్నిటిలాగే సాధారణమైన మొక్కలే. బయట మనకు చుట్టు పక్క కనిపించే ఏ మొక్కనైనా బోన్సాయ్‌ మొక్కగా పెంచుకోవచ్చు. కానీ చిన్న ఆకులు ఉన్న మొక్కలు మాత్రమే ఎంచుకో వాలి.

ఎందుకంటే ఇవి మరింత అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఎంతగా అంటే వచ్చిన అతిధులు అలా చూస్తునే ఉండిపోయేటంతగాఈ మొక్కలు ఇరవై సెంటీ మీటర్లనుండి ఒక మీటరు ఎత్తు వరకు పెరుగుతాయి. జపనీయులకు ్త బోన్సాయ్‌ వారి సంస్కృతిలో ఒక భాగం. జెన్‌ - బౌద్ధవిధానంలో పవిత్రమైనది. బోన్సాయ్‌ మొక్కను రక్షిస్తే కొన్ని తరాలు జీవిస్తుంది. ఓ మొక్కగా కాకుండా మీ స్నేహితునిగా మీ కుటుంబంలో భాగమైపోతుంది. మీ ఇంట్లోని పెద్దవారి జ్ఞాపకంగా పెంచుకున్న మొక్కను ఓసారి ఊహించుకోండి ఎంత హాయి గా ఉంటుందో..! అలాంటి బహుమతులు పొందడం మధురాతి మధురంగా ఉంటుంది. బోన్సాయ్‌ మొక్కలు అందంగా ఉంటాయి. ఏళ్ళ తరబడి జాగ్రత్తగా పెంచినందు వలన ఆరోగ్యంగా ఉంటాయి. ఈ మొక్కలు మనసుకు ఆనందాన్ని కలిగిస్తాయి. చూడగానే అందరి మనస్సును ఆకట్టుకునే విధంగా ఉంటాయి. బోన్సాయ్‌ మొక్కలు ఇంటిి, ఇంటిలో ఉన్న తోటకు అందం చేకూర్చుతాయి.

bonsai పెంపకం ద్వారా సమకూరే విజ్ఞానం అనంతం. కొత్త వాటిని తయారుచేసినప్పుడు మెదడు చైతన్యవంతమవుతుంది. ఇంటిదగ్గర ఉండే గృిహణులు వీటి పెంపకం ద్వారా ప్రకృతిని అర్థం చేసుకునేందుకు మరింత అవకాశం కలుగుతుంది. విత్తనాల ద్వారా, చిన్నమొక్కలను పెంచుకోవడం ద్వారా బోన్సాయ్‌లను తయారుచేయవచ్చు. మొక్కల వేర్లు, రెమ్మలు, కొమ్మలు జాగ్రత్తగా కత్తిరించడం ద్వారా, వైరింగ్‌ చేయడం ద్వారా ్త బోన్సాయ్‌ మొక్కలను కావలసిన ఆకారంలో తయారు చేసుకోవచ్చు. ఇవి చూడటానికి కూడా చిన్నవిగా ఉండి మనకు నచ్చిన ఆకారంలో ఎంతో ముచ్చటగా ఉంటాయి. ఇది సృష్టికి సంబంధించినది. విశ్వవ్యాపితమయిన ప్రాణదాన ప్రక్రియ. ఇందులో కళాకారుడు వృక్షమూ ఇరువురూ భాగస్తులే. ఇద్దరూ కూడా ఒకరినొకరు విడిపోలేనంత మంచి స్నేహితుల లాంటి వారన్నమాట. ్త బోన్సాయ్‌ మొక్కలను ఆరుబయట తోటలో పెంచుతారు. బోన్సాయ్‌ మొక్కలను పెంచడానికి ముఖ్యమైనది మనం ఎంచుకునే పాత్ర. దీనిపైనే బోన్సాయ్‌ ఎదుగుదల కూడా ఆధారపడి ఉంటుంది.

అనువుగాని పాత్రలో పెంచిన మొక్కలు చివరకు చనిపోతాయి. వీటిని పెంచడానికి ప్రత్యేకమైన పాత్రలు స్టాండ్స్‌ వంటివి దొరుకుతాయి. మొక్కలను పెంచడానిి, ఎక్కువైన నీరు బయటికి వెళ్ళడానికి అవకాశమున్న పాత్రలు లేక కుండీలనే ఎంచుకోవాలి. నేలపైన కొంత ఎత్తులో బోన్సాయ్‌ మొక్కలు ఉంచాలి. ఏ రూపం కావాలో ఆరూపానికి అనుగుణంగా ఆ మొక్క ను పెంచడం,చెట్టును ఎదుగుతుండగా కత్తిరించడం ఓ పద్దతి. వైరుతో మొక్క ఆకారాన్ని, రూపా న్ని మార్చడం వైర్లతో మొక్కను కావలసినట్లు వంచి కట్టడం చేయాలి. ప్రతి కొమ్మ మనం అనుకున్నట్లు రావడానికి నిరంతరం ప్రయత్నించాలి. అప్పుడే బోన్సాయ్‌ మొక్క అందంగా కనిపిస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు మీరు కూడా బోన్సా య్‌ మొక్కను తయారు చేయండి. ఇది ఒక అందమైన హాబీయే కాదు వచ్చిన అతిథులను ఆకట్టుకునే తారక మంత్రం కూడా ఇందులో దాగివుంది. ఇంటీరియల్‌ డెకరేషన్‌కు ఇప్పుడు బోన్సాయ్‌ మొక్కలు ఎంతగానో తోడ్పడుతున్నాయి.

Thursday, September 16, 2010

పశువులకాపరి నుంచి కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ దాకా.....

"ఊర్లో పశువులు కాసే వాళ్లకు అడవే ప్రపంచం. ఊర్లో ఏం జరిగినా మాకు తెలిసేది కాదు. ఎవ్వరితోనూ మాట్లాడే అవకాశం ఉండేది కాదు. పొద్దున్నే మేతకు పశువుల్ని తీసుకెళ్లడం, సాయంత్రం ఇంటికొచ్చాక తిని పడుకోవడం. నాతోటి పిల్లలందరూ బడికి వెళుతుంటే చాలా బాధ కలిగేది. ఏం చేయాలో దిక్కుతోచేది కాదు. మా అమ్మానాన్నలకు అక్షరం ముక్క రాదు. చదువంటే వారికి ఏమీ తెలీదు.

కృష్ణా జిల్లా విజయవాడకు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎ.కొండూరు మండలంలో కంభంపాడు అనే గిరిజన తండా మాది. తల్లిదండ్రులు చిట్టిపోతుల నాగయ్య, ముత్తమ్మలు. పండుగలప్పుడు తప్ప మిగిలిన రోజుల్లో కొర్రన్నం తినేవాళ్లం. పూట గడవాలంటే కూలికి వెళ్లాలి. ఉన్న కాస్తోకూస్తో పొలంలో పండినవే తిండిగింజలు. ఇలాంటి కుటుంబంలో పుట్టిన నాకు చదువుకునే భాగ్యం పదకొండేళ్ల వయస్సులో కలిగింది.

అమ్మ చేర్పించింది..
విస్సన్నపేటకు చెందిన కోటేశ్వరరావు అనే విద్యార్థి రోజూ మా ఇంటిదగ్గరికి స్నానానికి వచ్చేవాడు. ఒకరోజు వాణ్ణి చూసి 'ఒరే నువ్వు కూడా ఎలాగైనా చదువుకోవాలి..' అంటూ అమ్మ గట్టిగా చెప్పింది. వెంటనే తీసికెళ్లి బళ్లో ఒకటో తరగతిలో చేర్చింది. తర్వాతి సంవత్సరం 2, 3, 4 తరగతులు ఒకేసారి పూర్తి చేశాను. మా ఊర్లోనే ఉన్న మూర్తి మాస్టారు ట్యూషన్ చెప్పి, నన్ను బాగా ప్రోత్సహించారు.

ఆరో తరగతికి వచ్చేలోగా తోటి విద్యార్థులతో సమానంగా చదివేవాణ్ణి. ఏడోతరగతిలో పబ్లిక్ పరీక్షరాసి జిల్లాలోనే ప్రథమస్థానంలో నిలిచాను. గవర్నర్ చేతులమీదుగా అవార్డు అందుకోవడం గొప్ప అనుభవం. అప్పటికే నా చదువు కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడేవారు. వాళ్లను చూసి నాలో పట్టుదల పెరిగింది. పదోతరగతి అయ్యాక ఇంటర్‌కు ఏపీ రెసిడెన్షియల్‌లో సీటు సంపాదించాలనుకున్నాను. రిజల్టు అలాగే వచ్చింది. పులిగడ్డ ఏపీ రెసిడెన్షియల్‌లో ఇంటర్‌లో చేరి 83 శాతం మార్కులతో పాసయ్యాను.

ఆంధ్రాయూనివర్శిటీలో ఎంటెక్ పూర్తిచేసేసరికి, మా అమ్మానాన్న నా కోసం 25 పశువుల్ని అమ్ముకోవాల్సి వచ్చింది. మాకున్న ఒకేఒక్క ఆధారం పశువులే. నా చదువుకు అవసరమైనప్పుడల్లా కొన్ని పశువులను అమ్మేసి నాకు డబ్బులు పంపించేవారు. నా కష్టానికి ఫలితం అన్నట్లు పాండిచ్చేరిలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లో సైంటిస్టుగా ఉద్యోగం వచ్చింది. అక్కడ ఏడాదిపాటు చేశాను.

పనికొచ్చే పరిశోధనతో...
ఉద్యోగం ఏదైనా సమాజం కోసం పనికొచ్చే పరిశోధన చేయాలన్న లక్ష్యం రోజురోజుకూ బలపడింది. అదే సమయంలో కాకినాడలోని జెఎన్‌టియులో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం వచ్చింది. పీహెచ్‌డీ చేసే సమయంలోనే 'హ్యూమన్ ఫేస్ రికగ్నైజేషన్' సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశా. యూనివర్శిటీలో చేరాక అదే కొనసాగించాను. ఒక వ్యక్తి లక్షమందిలో ఉన్నా గుర్తుపట్టే సాఫ్ట్‌వేర్ అది.

చిన్న ఫోటో ఆధారంగా ఈ సాఫ్ట్‌వేర్‌తో సులువుగా, నిమిషాల్లో గుర్తుపట్టవచ్చు. డీఆర్‌డీవో సైంటిస్టుల సహాయం తీసుకొని దీన్ని రూపొందించాను. ఈ సాఫ్ట్‌వేర్ సామాజిక భద్రతకు పనికొస్తుంది. నేరస్తులను పట్టుకొనేందుకు తోడ్పడుతుంది. వాయిస్ రికగ్నైజేషన్, స్పీచ్ రికగ్నైజేషన్ కూడా దీనికి జోడిస్తున్నాం. ఇప్పటికే పోలీసులు ఈ సాఫ్ట్‌వేర్‌ను వారికి ఇవ్వమని అడిగారు. పూర్తిస్థాయి అభివృద్ధి తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తాం.

ప్రస్తుతం నాకు సహాయపడిన డీఆర్‌డీవో సైంటిస్టులు నా దగ్గరే పీహెచ్‌డీ చేస్తున్నారు. ఇప్పుడు కాకినాడ జెఎన్‌టియులోనే కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా పనిచేస్తున్నాను. నా దగ్గర ఇప్పుడు 35 మంది పీహెచ్‌డీలు చేస్తున్నారు. 'పదకొండేళ్ల వయసులో బడికి వెళ్లి ఏం సాధించగలనని..' భావించి ఉంటే ఇప్పటికీ పశువులకాపరిగానే అడవులు పట్టుకు తిరుగుతుండేవాణ్ణి.

- వై.రమేష్‌బాబు

పాలవెల్లి కోసం వాల్‌మార్ట్‌లో వెతికాం

(అమెరికాలో ఉంటున్న ఇందు వినాయక చవితి జరుపుకునేందుకు చాలా కష్టాలు పడిందట. అవేంటో తన బ్లాగ్‌లో రాసుకుంది మీరూ చదవండి) చిన్నప్పటి నుంచి మేం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకునేవాళ్లం. అటువంటిది ఈ దేశం కాని దేశంలో మొదటిసారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ ఇది. రెండు రోజుల ముందు నుంచే చందుని హింసించడం మొదలుపెట్టాను..

పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా? ఉండ్రాళ్లకి బియ్యపు రవ్వ ఎక్కడ కొనాలి? మరి పాలవెల్లి సంగతేంటి? వ్రత కథ పుస్తకం ఎలా? బంతిపూల మాలలు దొరకవు కదా? ఇలా విసిగించాను. పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్ అన్నీ తిరిగాం. కానీ దొరకలేదు. అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా? దానికి పసుపురాసి కుంకుమ పెటి ్ట గోడకి కట్టి దానికి ఆపిల్, దానిమ్మ కాయలు, వెలక్కాయలు, మొక్కజొన్నలు, అరటి పిలకలు, మామిడాకులు, బంతి, కలువ పువ్వులన్నింటితో అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది? ఇంటికి వచ్చాక ఇంటర్‌నెట్‌లో గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు. సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్‌లో 'పాలవెల్లిని నేనే తయారు చేసుకున్నా' అని ఓ పోస్ట్ కనిపించింది.

నేనూ అలాగే తయారు చేసుకుందామని చెక్కముక్కల కోసం వాల్‌మార్ట్‌కి వె ళ్లాను. దొరకలేదు. మిగతా సరుకులైనా కొందామని 'క్రోగర్'లో పూల బొకేలు, అరటి పళ్లు తీసుకున్నాం. 'నమస్తే'కి వెళ్లి కొబ్బరికాయలు కొన్నాం. పండగ సందర్భంగా వారు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు, రెండు అరటిపళ్లు, ఇంకా నాలుగు రకాల పళ్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఉంటేనే కదా పండగ కళ.

ఇక మట్టి వినాయకుని వెతకడమే మిగిలింది. ఏ షాపులో చూసినా రంగు రంగుల వినాయకులే. నాకేమో మట్టి వినాయకుడే కావాలి. చివరికి ఒక షాపులో బుజ్జి వినాయకుడు దొరికాడు. చిన్న గొడుగు కింద సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. తర్వాత తమలపాకులు, వక్కలు, చందనం, చిన్న దీపపు ప్రమిదలు కొన్నాం. పాలవెల్లి ఇంకా మిగిలే ఉంది. చెక్కల కోసం 'హోమ్ డిపో'కి వెళ్లాం. కష్టపడి మాకు కావాల్సిన చెక్కముక్కలు కొన్నాం. ఇంటికి రాగానే చందు పాలవెల్లిని తయారు చేసే పనిలో మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా. పాలవెల్లి రెడీ అయింది కాని దాన్ని ఎలా వేలాడదీయాలి? గోడకి మేకులు కొడితే ఓనర్స్ ఒప్పుకోరు.

అందుకే మా సైడ్ టేబుల్‌ని పూజామందిరంగా మార్చేశా. కింద పైన అద్దాలు ఉండే సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు. పైన పాలవెల్లి పెట్టొచ్చు అనుకున్నాం. అమ్మయ్య! మనసు కుదుటపడింది. చవితి రోజున పొద్దున్నే లేచి వంట కానిచ్చి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం. పాలవెల్లిని అలంకరించుకుని లాప్‌టాప్‌లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేశాం. ఆ రోజు మా ఇంటికి అతిథిగా వాచ్చిన నాని గారు మా వినాయకుణ్ణి చూసి 'ఇండియాని గుర్తు చేశారండి' అన్నారు. నాకు చాలా సంతోషమేసింది.

watermelons ...... eggs!

These are truly incredible.
You'll love the watermelons,

but you'll be blown away
by the eggs!













These egg shells
were cut with a high intensity precision Laser Beam. This gives a very good idea of what can be achieved with a Laser Beam. This gives you an idea what laser surgery performed on one's eye is all about. Is it any wonder how one's vision can be improved in just a few moments? Science is sometimes wonderful, and it's still on the frontier of gaining new knowledge. Incredible what can be done with an eggshell and a laser beam.









Wednesday, September 15, 2010

"గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే...''

7 to 35 లక్షలు..అంతే

బ్లాక్ మెటల్ రోడ్... చుట్టూ పర్వతాలు... పచ్చని పొలాలు.. వెనకాల గర్ల్ ఫ్రెండ్ లేదా బోయ్ ఫ్రెండ్ వెనకాల మీరు.. 120 మైళ్ల స్పీడులో దూసుకుపోతున్న బైక్.. ఒక్కసారి కళ్లు మూసుకుని ఊహించుకోండి. ఎలా ఉంది? "గాల్లో తేలినట్లుందే.. గుండె జారినట్లుందే...'' అన్నట్లుంది కదా ఆ సీన్. కానీ అసలు మజా ఆ బైక్‌తో కాదు, ఇలాంటి బైక్‌పై వెళ్తేనే ఉంటుంది. ఇలాంటి అంటే..

డైనా, సాఫ్టెయిల్
డైనా సిరీస్‌లో ఎఫ్ఎక్స్‌డిబి స్ట్రీట్ బోబ్, ఎఫ్ఎక్స్‌డిసి సూపర్ కస్టమ్ మోడళ్లు, సాఫ్టెయిల్‌లో ఎఫ్ఎల్ఎస్‌టిఎఫ్ ఫ్యాట్ బోయ్, ఎఫ్ఎల్ఎస్‌టిసి హెరిటేజ్ సాఫ్టెయిల్ క్లాసిక్ మోడళ్లు ఉన్నాయి. డైనా, సాఫ్టెయిల్ బైకుల పొడవు సుమారు 2400 మీ.మీ. ఎత్తు 1130 నుంచి 1175 వరకు.

బరువు 305 కిలోల నుంచి 400 కిలోల వరకు. డైనా మోడల్స్ బైకుల ఫ్యూయల్ కెపాసిటీ 17.3 లీటర్లు ఉంటే సాఫ్టెయిల్‌లో 19.7 లీటర్లు. అన్ని మోడల్స్‌లో ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. డైనాలో ట్విన్ క్యామ్ 96 ఉంటే, సాఫ్టెయిల్‌లో 96బి ఉంటుంది. అన్ని బైకులు 1584 సిసిని, మైల్డ్ స్టీల్ ట్యూబులర్ ఫ్రేమ్‌లని కలిగి ఉంటాయి. పవర్ 117 ఎన్ఎమ్‌ల నుంచి 123 ఎన్ఎమ్‌లు. కాస్ట్‌లీ బైక్స్
వి రాడ్ స్టయిల్‌లో విఆర్ఎస్‌సిడిఎక్స్ నైట్ రోడ్ స్పెషల్ మోడల్, టోరింగ్‌లో ఎఫ్ఎల్‌హెచ్ఎక్స్ స్ట్రీట్ గ్లిడ్, ఎఫ్ఎల్‌హెచ్ఆర్ రోడ్ కింగ్ పేరుతో రెండు మోడళ్లు, సివిఒలో ఎఫ్ఎల్‌హెచ్‌టి కూజ్ సివిఒ ఆల్ట్రా క్లాసిక్ మోడళ్లు ఉన్నాయి. ఈ బైకుల పొడవు సుమారు 2500 మి.మీ. బరువు 307 కిలోల నుంచి 430 కీలోలు.

వి రాడ్ ఫ్యూయల్ కెపాసిటీ 18.9 లీటర్లు ఉంటే మిగిలిన మూడు మోడళ్లలో 22.7 లీటర్ల కెపాసిటీ ఉంటుంది. వి రాడ్‌లో లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటే మిగిలిన మూడు మోడళ్లలో ఎయిర్ కూల్డ్, ట్విన్ క్యామ్ ఇంజిన్ ఉంటుంది. అన్ని బైకులూ మైల్డ్ స్టీల్, ట్య్రూబులర్ ఫ్రేమ్‌లను కలిగి ఉంటాయి. 111 ఎన్ఎమ్‌ల నుంచి 150 ఎన్ఎమ్‌ల పవర్ ఈ బైక్‌ల సొంతం.

స్పోర్ట్‌స్టర్ స్టయిల్
స్పోర్ట్‌స్టర్ స్టయిల్స్‌లో ఎక్స్ఎల్ 883ఎల్ స్పోర్ట్‌స్టర్, ఎక్స్ఎల్ 1200ఎన్ నైట్‌స్టర్, ఎక్స్ఎల్ 883ఆర్ రోడ్‌స్టర్, ఎక్స్ఆర్ 1200ఎక్స్ పేరుతో నాలుగు మోడళ్లు దొరుకుతున్నాయి. వీటి ఫీచర్లన్నీ సుమారు ఒకే మాదిరిగా ఉంటాయి. పొడవు 2.225 నుంచి 2,250 మి. మీ ఉంటే ఎత్తు 1,155 మి.మీ. నుంచి 1,160 మి.మీ వరకు ఉన్నాయి.

బరువు అన్నింటిది 260 కిలోలే. మొదటి మూడింటి ఫ్యూయల్ కెపాసిటి 12.5 లీటర్లు ఉంటే చివరి మోడల్‌ది మాత్రం 13.3 లీటర్లు. నాలుగు మోడళ్లూ ఎయిర్ కూల్డ్, ఎవెల్యూషన్‌ని కలిగి ఉన్నాయి. వాటి సిసి ఆ బైకు మోడల్ పేరులోనే ఉంది. అన్ని బైకులూ మైల్డ్ స్టీల్, ట్యూబులర్ ఫ్రేమ్‌లను కలిగి ఉన్నాయి. 70 ఎన్ఎమ్ నుంచి 100 ఎన్ఎమ్ పవర్ ఈ రేంజ్ బైకులలో ఉంటుంది.

హార్లీ డేవిడ్‌సన్.. ఆ పేరులోనే చూడండి ఎంత కిక్ ఉందో! హెచ్‌డీ(హార్లీ డేవిడ్‌సన్) అమెరికాకు చెందిన మోటార్ బైకుల బ్రాండెడ్ కంపెనీ. ఈ హెవీ బైకులకు మనదేశంలోనే కాదు అన్ని దేశాల్లోనూ మస్త్ క్రేజ్ ఉంది. మొన్నటి వరకు మనదేశంలో ఎవరైనా హై ఫై గైయ్స్ ఈ బైక్ కొనాలంటే ఏ దుబాయ్ నుంచో, అమెరికా నుంచో తెప్పించుకునేవారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న 'లవ్ ఆజ్ కల్' రీమేక్ సినిమా కోసం ఆయన జూలైలో ఒక హెచ్‌డి బైక్ దుబాయ్ నుంచే తెప్పించుకున్నారట. కానీ అదే నెలలో మన హైదరాబాద్‌లో బంజారా హెచ్‌డి షోరూమ్ ప్రారంభమైంది. బెంగళూరు, ఢిల్లీలలో కూడా ఇప్పుడు మొదలయ్యాయి.

హైదరాబాద్‌లో బుకింగ్స్ మొదలైన 60 రోజుల్లోనే 25 బైకులు అమ్ముడుపోయాయి. అందులో పెద్ద గొప్పేం ఉందంటారా? నిజమే ధర వేల రూపాయల్లో ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు కాని లక్షల్లో ఉంటే ముక్కున వేలు వేసుకోవాల్సిందే కదా.

ఆల్‌టైమ్ హాట్
హార్లీ డేవిడ్‌సన్ నిన్నమొన్న వచ్చిన బైక్ కాదు. 107 సంవత్సరాలుగా ఆల్‌టైమ్ హాట్ ఫేవరెట్‌గా ఉంటున్న బైక్. దాని ఇంజిన్, సాంకేతిక పరిజ్ఞానం, ఆకట్టుకునే మోడల్స్ ఈ బైకులకు అంతటి క్రేజ్‌ని తెచ్చిపెట్టాయి. హెచ్‌డీ బైకుల ఇంజిన్ కెపాసిటీ ఎంతో తెలుసా? 883 సిసి నుంచి 1800 సిసి వరకు. వీటి ధర 7 లక్షల రూపాయల నుంచి 35 లక్షల వరకు ఉంటుంది.

ఇప్పుడు హెచ్‌డీ బైక్స్‌లో స్పోర్ట్‌స్టర్, డైనా, సాఫ్టెయిల్, వి రాడ్, టోరింగ్, సివిఒ తదితర ఐదు స్టయిళ్లలో 12 మోడళ్లు దొరుకుతున్నాయి. బ్లాక్, రెడ్ హాట్ సన్‌గ్లో, క్రిమ్‌సన్ మిస్ట్ బ్లాక్, డార్క్ స్లేట్, ఫ్లేమ్ గ్రాఫిక్ రంగుల్లో ఈ బైకులు లభ్యమవుతున్నాయి.

బంజారా హెచ్‌డీని జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభించారు. స్వయంగా ఎంతో ఇష్టపడి ఒక బైక్ కొన్నారని చాలామంది సినిమావాళ్లు చెబుతుంటారు. అల్లు అర్జున్, అక్కినేని నాగచైతన్యతో పాటు హీరోయిన్ అనుష్క, ముమైత్ ఖాన్‌లు కూడా ఈ బైక్‌లు కొన్నవారి లిస్ట్‌లో ఉన్నారని ఫిల్మ్‌నగర్ టాక్.

షోరూమ్ డిజిఎమ్ దైవిక్ భాస్కర్ ఎందుకో ఈ విషయంలో సైలెంట్ అయిపోయారు. బాలీవుడ్‌లో సంజయ్‌దత్, దర్శకుడు సంజయ్ గుప్తా, క్రికెటర్సలో ధోని దగ్గర కూడా ఈ హెచ్‌డీ బైక్‌లు ఉన్నాయట.