Saturday, September 11, 2010

షేక్స్‌పియర్‌తో ఒక పూట

మా యూరప్ పర్యటనలో చివరి మజిలీ ఇంగ్లాండ్. ఆ రోజు ఆగస్టు 15. స్వాతంత్య్ర దినం. అందుకే బస్సులో అడుగుపెట్టగానే అందరం వందేమాతరం పాడుకుని బానెట్ మీద గుచ్చిన జాతీయ జెండాకు వందనం చేసి బయల్దేరాం. కదిలే బస్సులో జనగణమన పాడకూడదని దాన్ని రాత్రికి వాయిదా వేశాం.

రోమునుండి పారిస్ దాకా తన బస్సులో దేశదేశాలు సురక్షితంగా ప్రయాణం చేయించిన డ్రైవరునుండి వీడ్కోలు తీసుకొని పారిస్‌లో యూరోస్టార్ ఎక్కాం. ప్రపంచంలో అతివేగంగా వెళ్లే రైళ్లలో అది రెండవదట. ఇంగ్లాండు, ఫ్రాన్సు దేశాల మధ్యవున్న ఇంగ్లీష్ ఛానల్‌లో మానవ నిర్మితమైన టన్నెల్ గుండా ప్రయాణించడమొక వింత అనుభూతి. రైలు సముద్రగర్భంలో ప్రయాణిస్తున్నప్పుడు భీషణమైన శబ్దం. ఆ శబ్దం, ఆ వేగం కలిసి మనలను వూపేస్తాయి. కేవలం రెండున్నర గంటలలో st.pancreas అంతర్జాతీయ రైల్వేస్టేషన్ చేరాము.

మన వజ్రాన్ని చూడ్డానికి మనచేతే ...

అక్కడ నుండి లండన్ లోని రంగోలీ హోటల్‌కు వెళ్లి భోం చేసాం. లంచ్ తరువాత బస్సులో కూర్చొనే ట్రఫాల్గర్ స్క్వేర్, పికడెల్లీ, హైడ్ పార్క్ వగైరా చూసాం. హైడ్ పార్కు ఎంత విశాలంగా ఉందో! ఆ తరువాత «థేమ్స్ నది ఒడ్డునున్న లండన్ ఐ చేరుకొన్నాం. అదొక రంగుల రాట్నంలాగుంది. ఒక్కొక్క గదిలో పదిమందిదాక కూర్చొనీ, నిలబడీ ఊరుమొత్తం చూడొచ్చు. నెమ్మదిగా రొటేటవుతుంటుంది. మనకేమాత్రం భయం వేయదు. అక్కడి నుండే బిగ్బెన్ గడియారాన్ని , వెస్ట్‌మిన్‌స్టర్ ఆబేని చూశాం. ఆ రాత్రికక్కడే పడుకొని, మర్నాడుదయం ప్రిన్స్ ఆల్బర్ట్ హాల్‌ని బయటినుండే చూసి లండన్ టవర్ చేరుకున్నాము. ఒకనాడది క్రూరత్వానికి, కఠినత్వానికి పేరుపడిన చెరసాల, భయంకరమైన వధ్యశాల. కాని దాన్ని చూడడానికి మాకు కేటాయించిన సమయం చాలా తక్కువ. అంచేత టూరు మానేజరు సలహాను అనుసరించి ఆభరణాల విభాగాన్ని మాత్రం చూశాం. దానికి కూడా చేంతాడంత క్యూ ఉండింది.

చీకటి గుయ్యారాలలాగున్న ఆ టన్నెల్స్‌లో మేము చూసి తరించింది మన కోహినూరు వజ్రాన్ని మాత్రమే. రాణి కిరీటంలో పొదిగి ఉంటుంది అది. ప్రపంచంలోని వజ్రాలలో అతి స్వచ్ఛమైనది కోహినూరు వజ్రమట. అది గోల్కొండ గనులలో దొరికిందని మనందరికీ తెలుసు. మా దేశపు సంపదను కొల్లగొట్టి మాచేతే టికెట్టు కొనిపించి మరీ చూపెడుతున్నారే ఎంత చతురులు ఈ ఇంగ్లీషు వాళ్లు అనిపించింది.

షేక్‌స్పియరును చూడకుండానా!

స్వామి నారాయణ్ ఆలయం చూసి ఆ మర్నాడు ఉదయం తిరుగు ప్రయాణం అవాలి మేము. కాని మేమిద్దరం మాత్రం ప్రోగ్రాం మార్చుకున్నాం. అంత దూరం వెళ్లి షేక్స్‌పియరు పుట్టిన ఊరు చూడకపోవడమా! అసలు యూరప్ టూరు వేయడమే దానికోసమైతేను. మధ్యాహ్నం భోజనాల తరువాత మా గ్రూపులోని చిన్న, పెద్ద అందరికీ వీడ్కోలు పలికి, వాళ్లు షాపింగ్‌కి మేము బస్టాండుకి బయల్దేరాము. నేరుగా విక్టోరియా బస్‌స్టేషన్ చేరుకొని బస్సెక్కి ననీటన్‌కి రాత్రి 8.45కి చేరాము. మా ఆయన క్లాస్‌మేట్ డా.కృష్ణప్రసాద్ వచ్చి మమ్మల్ని వాళ్లింటికి తీసుకొని వెళ్లారు. ఆయన భార్య రాజీ వండి వడ్డించిన కమ్మటి భోజనం తిని హాయిగా నిద్రపోయాము.

40 ఏళ్ల కలవరింత

మర్నాడు ఉదయమే నేను ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న స్ట్రాట్‌ఫర్డ్ అపాన్ - యావన్‌కి (షేక్స్‌పియరు జన్మస్థలానికి) బయలుదేరి వెళ్లాం. డా. కృష్ణప్రసాద్, వాళ్లమ్మాయి డా. అజిత మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్లారు. ముందుగా స్ట్రాట్‌ఫర్డ్ నదిని చూశాం. దాని ఒడ్డునే మూడు థియేటర్లు -Royal Shake speare theatre, The Swan theatre, The Courtyard theatre కనబడ్డాయి. రాయల్ షేక్స్‌పియర్ కంపెనీకి చెందిన మొదటి థియేటర్ రెండేళ్లుగా రినొవేషన్‌లో ఉంది. ఇంకో రెండేళ్లు పడుతుందన్నారు. ఎలిజబత్ స్టయిల్‌లో కట్టిన స్వాన్ «థియేటరు మూసివుంది. కోర్టుయార్డు థియేటరు కూడా అదే స్టయిల్‌లో కట్టిందే. దాని లోపలి భాగం చూసి ఉప్పొంగి పోయాను. అచ్చంగా నేను స్టూడెంట్‌గా ఉన్నప్పుడు చదువుకున్నట్లే ఉంది. డా.అజిత సాయంతో సావనీర్లెన్నో కొన్నాం.

గతమంతా లీలగా కదలాడింది

ఆ తరువాత షేక్స్‌పియర్ పుట్టిన ఇంటికి వెళ్లాం. ఆ పదహారవ శతాబ్దపు ఇంటిని చెక్కు చెదరకుండా కాపాడుతున్నారు. ఆయన పుట్టిన గదిలో మంచం, ఉయ్యాల తదితర సామాగ్రి యధాతథంగా వుంచారు. ఒక గదిలో ఏదో సీరియస్‌గా రాసుకొంటున్న షేక్స్పియరు అధాటున కనపడేసరికి ఉక్కిరిబిక్కిరయ్యాను. లైఫ్ సైజులో ఉన్న ఆ విగ్రహాన్ని చూడగానే మహదానం దం కలిగింది. షేక్ స్పియర్ - నేను దాదాపు నలభై ఏళ్లు చేసిన నామస్మరణ. కాలేజీలో బోధించిన, ఆడించిన ఆయన నాటకాలు, ఆ సజీవమైన పాత్రలు, వాటి శక్తివంతమైన డైలాగులు, అనన్య సామాన్యమైన కవిత్వం, ఆ ప్రకృతి వర్ణన అన్నీ లీలగా కనపడీ, వినపడీ మాయమయ్యాయి. కిటికీ బయట కొందరు యువతీ యువకులేదో నాటకాన్ని ప్రాక్టీస్ చేస్తున్నారు.

దేన్నీ వదలకుండా చూశాం

అన్నట్లు మరిచాను. ఈ మిలెనియం అతిగొప్ప రచయితెవరు అని ఓటింగ్ పెడితే మిలియన్ల కొద్దీ ప్రజలు పాల్గొని అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించింది షేక్స్‌పియరునే. అదీ ఈనాటికీ ఆయనకున్న ప్రజాదరణ. ఇంటికవతలున్న మ్యూజియంలో ఆయన రాసిన వీలునామా, వాడిన వస్తువులు వగైరా ఉన్నాయి. వీలునామా గురించొక మాట చెప్పాలి. ఆ కాలంలో మంచం కలిగి ఉండడాన్ని హోదాకు చిహ్నంగా భావించేవారట. తన పెద్దకూతురికొక మంచం, చిన్న కూతురికొక మంచం వీలునామాలో ప్రత్యేకంగా రాసాడాయన. పనిలో పనిగా కాటేజి లేన్‌లోనున్న అతడి భార్య ఆనీ హాత్‌వే ఇంటిని, తల్లి మేరీ ఆర్డెన్ పుట్టింటినీ, అమెరికాలో హార్వర్డు విశ్వవిద్యాలయం స్థాపించిన జాన్ హార్వర్డు ఇంటినీ, ఆఖరికి షేక్స్‌పియరు చదివిన గ్రామరు స్కూల్నీ, అతడి సమాధిని దేన్నీ వదలకుండా చూశాం.

పదహారు రోజుల ముగింపు పండగ

ఏప్రిల్ 23, 1564లో పుట్టిన ఆయన అదే తారీఖున 1616న మరణించాడు. ఆయన మరణానంతరం ఆయన భార్య బస్టు సైజు విగ్రహాన్ని తయారు చేయించి ఆయన సమాధికెదురుగా చర్చి గోడలో స్థాపింప చేసింది. అదే లేకుంటే షేక్స్‌పియరనే జీనియసెలా వుండేవాడో లోకానికి తెలిసేది కాదు. చర్చిలో ఆయన బాప్టిజం చేసిన తేదీ, మరణించిన తేదీ రాసిన రిజిస్టరుని కూడా మనం చూడొచ్చు. ఆ విధంగా ఆ రోజంతా ఆ వీధులలో తిరుగుతూ, ఆ గాలి పీలుస్తూ, సెల్‌ఫోను సైజులో ప్రింట్ చేసిన ఆయన నాటకాల కాపీలు, నాటకాల పాత్రల బొమ్మలు ముద్రించిన పింగాణీ కప్పులు, డివీడీలు వగైరాలను కొని మురిసిపోతూ ఎంతో తృప్తిని, ఆనందాన్ని మూటగట్టుకొన్నాను.
కృష్ణప్రసాద్, అజితలు డాక్టర్లయినప్పటికీ గొప్ప సాహిత్య ప్రియులు. ఓపికగా అన్నీ చూపించారు. కొనిపించారు. ఇంటికొచ్చి షేక్స్‌పియర్ కార్నర్ తయా రు చేసేదాకా నా మనసు ఊరుకోలేదు.
నాకు ఎంతో ఇష్టమైన రచయిత జన్మస్థల సందర్శనతో మా 16 రోజుల యూరప్ పర్యాటక పండగ ముగియడం నాకెంతో సంతోషాన్నిచ్చింది.

- డా. కొత్తింటి సునంద
94410 96231

No comments: