Sunday, October 3, 2010

మట్టిలో మెరిసిన ఐడియాలు ..... మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా!

మట్టీ నేషనల్ కంపెనీ 'మిట్టీకూల్'

ఫ్రిజ్‌లొచ్చాక కుండలు పోయాయి. కుక్కర్లొచ్చాక మట్టిపాత్రలు కనిపించనే కనిపించడం లేదు. ఇక, వీటిని తయారుచేసే కుమ్మర్లు కనుమరుగవ్వక మరేమవుతారు..? ఆ మాటేదో కుమ్మరి కుటుంబానికే చెందిన మన్‌సుక్‌బాయ్‌కి చెప్పండి. అరికాలి మీద లేచొస్తాడు. ఐడియా తట్టాలేకానీ, మట్టి కలిపే చేతులతోనే మల్టీ నేషనల్ కంపెనీలను కొట్టొచ్చంటాడు.

ఆ కంపెనీలకన్నా భిన్నంగా ఆలోచిస్తే, పాత వృత్తులన్నీ మళ్లీ బట్టకడతాయని కుండబద్దలుకొట్టి మరీ చెబుతాడు. 'మిట్టీకూల్' కంపెనీ పెట్టి ఆ పనే చేశాడీయన. మట్టి ఫ్రిజ్, మట్టి కుక్కర్, మట్టి వాటర్ ఫిల్టర్‌లను తయారుచేస్తూ పెద్ద పెద్ద కంపెనీలకే ముచ్చెమటలు పట్టిస్తున్న మన్‌సుక్‌బాయ్‌ది... గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లా మోర్బి..

"నువ్వయ్యా, అసలైన శాస్త్రవేత్తవంటే..!'' అబ్దుల్ కలాం అంతటాయన భుజంతట్టి మరీ చెప్పాడు.
"నీ ఆలోచన వల్ల ఎంతోమంది ఆరోగ్యంగా ఉంటారు..'' రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ సైతం మెచ్చుకున్నారు.

పదో తరగతే గట్టెక్కలేని మన్‌సుక్‌బాయ్ ఇంతకూ ఏమంత గొప్ప పని చేశాడు..? ఆయన చేసిందల్లా ఒట్టి మట్టిపని. మల్టీ నేషనల్ కంపెనీలకు సైతం తట్టని ఎకోఫ్రెండ్లీ ఐడియా! నిజంగానే ఆ ఐడియా మన్‌సుక్‌బాయ్ జీవితాన్నే మార్చేసింది.

ఆయన గురించి తెలుసుకున్నాక ఈ మాటను మనం సులువుగా అనేయవచ్చు. కానీ, మన్‌సుక్‌బాయ్ మాత్రం అంత ఈజీగా ఒప్పుకోడు. 'మట్టి ఐడియా' వెనుక తను ఎన్ని తిప్పలు పడిందీ తెలుసుకోవాలంటాడు. అప్పుడే- ఐడియా తన జీవితాన్ని మార్చిందా..? లేక తన పేదరికమే తనకు ఆ ఐడియాను ఇచ్చిందా..? అర్థమవుతుందంటాడు.

గాడి తప్పిన చదువు...
"ఏందిరా వెధవా, పదోతరగతి ఫెయిలయ్యావు. చదువు బొత్తిగా రాదు. ఇంకేం పని చేస్తావ్..? ఎట్ల బతుకుతావ్...?'' ఏ తల్లిదండ్రులైనా ఇంతకంటే ఇంకేమంటారు. ఫెయిలైనందుకు కాదు. అందరూ ఎత్తిపొడుస్తుంటే మన్‌సుక్‌బాయ్ మనసు చివుక్కుమంది.

'ఇప్పుడు ఏం చేయాలి' చిట్టి బుర్ర చేయని ఆలోచన లేదు. కొన్నాళ్లకు ఇంట్లోవాళ్లు కూడా పట్టించుకోవడం మానేశారు. ముందు నుంచి కుమ్మరి వృత్తిని నమ్ముకొని బతికే కుటుంబం వాళ్లది. సంప్రదాయబద్ధంగా కుండలు, కూజాలు, ప్రమిదలు చేసి అమ్ముకొనేవారు. వచ్చిన కాసింత డబ్బుతోనే కుటుంబాన్ని నెట్టుకొచ్చేవారు.

మన్‌సుక్‌బాయ్ కూడా మట్టి తవ్వుకురావడం, సారెతిప్పి కుండలు చేయడం, ఎండిన కుండలను కాల్చడం..అన్ని పనుల్నీ అవలీలగా చేసేవాడు. దేశంలో కొన్ని ప్రాంతాలలోనే దొరికే ఒక రకం ఎర్రమట్టి గుజరాత్‌లో కూడా దొరుకుతుంది. ఆ మట్టితో కుండచేస్తే ఉక్కుబిందెలాంటి గట్టిదనం వస్తుంది. ఇవన్నీ కుండలు చేసిన అనుభవంతోనే గమనించాడు మన్‌సుక్‌బాయ్. ఆయన తల్లిదండ్రులు మాత్రం 'ఒరే, కొన్ని తరాలుగా కుండలు చేస్తున్నా మన కుటుంబాలు బాగుపడింది ఏమీ లేదు.

నువ్వు ఈ వృత్తిని నమ్ముకోకు. ఎక్కడన్నా చిన్న ప్రైవేటు ఉద్యోగమేదైనా చూసుకొని బతుకు'' అనేవాళ్లు. ఇంట్లోవాళ్ల మాట కాదనలేక ఇటుకల బట్టీల్లో పని చేశాడు. భవననిర్మాణాల్లో రాళ్లు ఎత్తాడు. బండచాకిరీ చేస్తున్నా పైసా మిగల్లేదు. అందుకే- ఓ రోజున 'ఇది కాదు నా జీవితం... ఎక్కడ పోగొట్టుకున్నానో అక్కడే వెతుక్కోవాలి..' అనుకొని సొంతూరు తిరిగొచ్చాడు మన్‌సుక్‌బాయ్.

మట్టిలో మెరిసిన ఐడియాలు...
మారుతున్న కాలానికి తగ్గట్టు కుమ్మరి వృత్తికూడా ఎందుకు మారడం లేదు..? తనలోతాను పరి విధాలుగా ఆలోచించాడు. చాలామంది పేదోళ్లు వాటర్‌ఫిల్టర్‌లు కొనలేరు. ఫ్రిజ్‌లు కొనలేరు. కుక్కర్లు కొనలేరు. పాన్‌లు కూడా కొనలేరు. ఇప్పటికే ఫ్రిజ్‌లు ఉన్నవాళ్లకు కరెంటు బిల్లులు భారమై కూర్చుంటున్నాయి. ఫ్రిజ్‌లో పెట్టిన కూరగాయలు వండుకు తింటుంటే రుచీపచి లేదంటున్నారు మరికొందరు.

సరిగ్గా ఇక్కడే ఐడియా పండింది. ఆ ఐడియాను మట్టిలో ముంచితీశాడు మన్‌సుక్‌బాయ్. మట్టి వాటర్ ఫిల్టర్ కనిపించింది. మట్టి ఫ్రిజ్ మెరిసింది. మట్టి కుక్కరు, మట్టి పాన్ అదరహో అనిపించాయి. ఇంకేముంది..? కుమ్మరి చేతుల్లో మట్టిపడితే ఏ రూపమైనా ప్రాణం పోసుకోదూ..! అదే జరిగింది. ఎర్రమట్టితో వాటర్ ఫిల్టర్ తయారుచేశాడు. అదే మట్టితో అచ్చుగుద్దినట్లు ఫ్రిజ్ చేశాడు.

ఆయన వాలకం చూసి 'నీకేమన్నా పిచ్చారా భయ్, ఈ రోజుల్లో పెద్ద పెద్ద కంపెనీల ఫ్రిజ్‌లు మార్కెట్‌లో తక్కువరేటుకే దొరుకుతుంటే, బోడి నీ మట్టిఫ్రిజ్ ఎవ్వడు కొంటాడు..' అన్నారు ఇరుగుపొరుగు వాళ్లు. అవేమీ పట్టించుకోలేదు అతను. చేస్తున్న పని కొనసాగిస్తూ.. మట్టితో కుక్కర్, పాన్ చేశాడు. అంతాబాగుంది కానీ, మార్కెట్ ఎలా చేయాలో అర్థం కాలేదు. చేతిలో చిల్లిగవ్వలేదు. బ్యాంకోళ్లను బతిమాలి బామాలి రూ.30 వేలు లోన్ తీసుకున్నాడు. చిన్న ఫ్యాక్టరీ 'మిట్టీకూల్' బోర్డు పెట్టాక మన్‌సుక్‌బాయ్ కళ్లు వెలిగిపోయాయి.

తొలి విజయం...
మట్టి ఫ్రిజ్‌లో కూరగాయలు, పండ్లు, నీళ్లు ఎనిమిది రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు. ఇవన్నీ సహజత్వాన్ని ఏమాత్రం కోల్పోవు. రుచి కూడా తగ్గదు. అందులోనూ కరెంటు అవసరమే లేదు. మట్టి వాటర్ ఫిల్టర్ కూడా అంతే. అందులో పోసిన నీళ్లు శుభ్రంగా, చల్లగా ఉంటాయి. మట్టికుక్కరు, మట్టిపాన్ మీద వంట చేయమని భార్యకు చెప్పాడు మన్‌సుక్‌బాయ్.

ఎంతో సౌకర్యంగా ఉందని చెప్పింది ఆవిడ. అంతటితో ఊరుకోకుండా ముంబయిలోని 'టాటా కెమికల్స్' వాళ్ల చేత పరీక్ష చేయించాడు. వాళ్లు ఓకే అన్నారు. అంతలో ఓ రోజు నైరోబి దేశస్థుడు మిట్టీకూల్‌ను సందర్శించి, అక్కడికక్కడే 500 మట్టి వాటర్‌ఫిల్టర్లు కావాలని ఆర్డర్ ఇచ్చేశాడు. అదే మన్‌సుక్‌బాయ్‌కి తొలి విజయం. తనమీద తనకు విశ్వాసం కలిగించిన అమ్మకం. ఒక్కో ఫిల్టర్ రూ.400 చొప్పున అమ్మేశాడు.

ఆ వార్త గుజరాత్ పత్రికల్లో పడింది. మిట్టీకూల్‌కు పెద్ద అడ్వర్‌టైజ్‌మెంట్‌నే తెచ్చిపెట్టింది. దాన్ని చూసి ముంబయి, పాట్నా, పూణెల నుంచి కుప్పలుతెప్పలు ఆర్డర్లు వచ్చాయి. డిమాండ్ ఎంత వరకూ వెళ్లిందంటే 50 వేల మట్టిపాన్‌లు అమ్మే వరకూ వెళ్లింది. మట్టిఫ్రిజ్ రూ.2,500 ధరపెట్టినా చాలామంది ఉత్సాహంగా కొనుక్కెళ్లారు. ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్‌లు చేసి తెప్పించుకున్నారు. మిట్టీకూల్ మన్‌సుక్‌బాయ్ పేరు గుజరాత్ అంతటా మార్మోగింది.

నడిచొచ్చిన సంస్థలు..
ఎల క్ట్రానిక్, ప్లాస్టిక్ వస్తువులతో పర్యావరణానికి హాని పెరుగుతున్న ఈ రోజుల్లో 'ఎకో ఫ్రెండ్లీ' వస్తువులను తయారుచేయడం మన్‌సుక్‌బాయ్‌కి కలిసొచ్చింది. పెద్ద పెద్ద సంస్థలు సాయం చేసేందుకు ముందుకొచ్చాయి. 'గుజరాత్ గ్రాస్‌రూట్ ఇన్నొవేషన్ నెట్‌వర్క్', 'నేషనల్ ఇన్నొవేషన్ ఫౌండేషన్' మన్‌సుక్‌బాయ్ కనిపెట్టిన వస్తువులకు పేటెంట్ ఇప్పించాయి.

అహ్మదాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) ప్రొఫెసర్లు కార్పొరేట్ మార్కెటింగ్, ప్యాకింగ్, టెస్టింగ్‌లలో సలహాలు ఇచ్చారు. గుజరాత్ ఎగ్జిబిషన్, న్యూఢిల్లీలో జరిగిన 'ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫెయిర్' వాళ్ల నుంచి ఆహ్వానాలు అందాయి. మిట్టీకూల్ ఉత్పత్తులను అక్కడ ప్రదర్శనకు పెట్టి అంతర్జాతీయ శాస్త్రవేత్తలను సైతం ఆకర్షించాడు మన్‌సుక్‌బాయ్. అంతర్జాతీయ సంస్థలైన బోస్, సీమెన్స్‌లాంటి కంపెనీలు ఆసక్తి చూపాయి.

'సెంటర్ ఫర్ ఇండియా అండ్ గ్లోబల్ బిజినెస్ స్కూల్', యూకేలోని 'యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్' కాన్ఫరెన్సులకు కూడా పిలిచారు. అక్కడ తన ఎకోఫ్రెండ్లీ ఉత్పత్తుల గురించి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు మన్‌సుక్‌బాయ్. ఇప్పుడు మిట్టీకూల్ గుజరాత్ గల్లీ కంపెనీ కాదు. ఇంటర్నేషనల్ లోకల్ కంపెనీ. మన్‌సుక్‌బాయ్ యానికి ముచ్చటపడిన మల్లికా సారాబాయ్ మిట్టీకూల్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రచారం చేస్తానంది.

ఇంత చేసింది పదోతరగతి ఫెయిలైన మన్‌సుక్‌బాయ్. తనకు ఎలాగూ చదువుకొనే అదృష్టం లేదు. అందుకే కొడుకును సిరామిక్ ఇంజినీరింగ్ చదివిస్తున్నాడు. హ్యాట్సాఫ్ మన్‌సుక్‌బాయ్.

No comments: