Sunday, October 31, 2010

కొండ రహస్యం

భూమి, సూర్యుడు ఒకప్పుడు భార్యాభర్తలట.
కొన్ని లక్షల సంవత్సరాల పాటు వాళ్లిద్దరే కబుర్లాడుకుంటూ తాము సృష్టించిన లోకాన్ని కన్నుల పండుగగా చూసుకుంటూ ఎంతో ఆనందంగా బతికేసారట.
ఒకానొక అపురూప క్షణంలో వాళ్లు ఒక బిడ్డను కనాలనుకున్నారు. భూమి, సూర్యుడు తలచుకుంటే నెరవేరనిది ఉంటుందా? వెంటనే వాళ్లకు ఓ అందమైన అబ్బాయి పుట్టాడు. మిగతా సృష్టి బాధ్యతనంతా ఆ పిల్లవాడికి వదిలేసి వాళ్లిద్దరూ విశ్రాంత జీవితం గడపసాగారట.
ఆ పిల్లవాడు చెట్టూ చేమా పక్షీ పశువూ ... అలా ఒకటొకటీ సృష్టించుకుంటూ వాటి కోసం సముద్రం నుంచి కొంత కొంత భూమిని తీసుకుంటూ వచ్చాడట.
సముద్రం ఊరుకుంటుందా? అది ఆ అబ్బాయితో పెద్ద కొట్లాట పెట్టుకుందట. సముద్రానికీ పిల్లవాడికీ మధ్య జరిగిన యుద్ధంలో పిల్లవాడి కాలు విరిగిందట.
తల్లి మనస్సు చూస్తూ ఊరుకుంటుందా? వెంటనే నలుగురు మహాకాయుల్ని సృష్టించి తన పిల్లవాడి సృష్టికి నాలుగు దిక్కులా కాపలా పెట్టిందట.

అయినా సముద్రం ఆగలేదు. సముద్రానికి, ఆ మహాకాయులకు మధ్య అనేకసార్లు యుద్ధాలు జరిగాయి. సముద్రం ధాటికి తట్టుకోలేక అవి ఒక్కొక్కటీ మరణించాయి. అయితే మరణించే ముందు తమను కొండలుగా మార్చమని అవి భూమాతను కోరాయట. చచ్చిపోయినా సరే ఈ సృష్టిని కాపలా కాసే బాధ్యతను వదిలి పెట్టబోమనీ, అలా చిరకాలం బతికే వరం ఇవ్వమనీ అవి ఆమెను ప్రార్థించాయట. ఆమె ఒప్పుకుంది.
అప్పటికే ఖండఖండాలుగా నరకబడ్డ ఆ భారీకాయులు భూగోళమంతటా చిన్నా పెద్దా కొండలుగా అవతరించి అప్పటినుంచీ సృష్టిని జాగ్రత్తగా కంటికి రెప్పలా కాపాడుకుంటూ వస్తున్నాయట.
కొండల పుట్టుక వెనుక ఆఫ్రికా వాళ్లు చెప్పుకునే కథ ఇది. మన పురాణాల్లోనూ వెతికితే ఇలాంటి కథలు బోలెడు దొరకొచ్చు కాని ఏం లాభం? వినేవాళ్లెవరు? నమ్మేవాళ్లెవరు? ఒక్క కరీంనగర్‌లోనే 560 గుట్టల్ని తవ్వి పడేస్తుంటే మాట్లాడేవాళ్లేరీ ... భూమాతతో సహా.

No comments: