Sunday, November 7, 2010

ఆ దారిలో...రెండు చరిత్ర చిహ్నాలు

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకోవద్దు. ఆ నిలువెత్తు విగ్రహం గురించి మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు కాని దాని దగ్గరకు వెళ్లే దారిలోని రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి మాత్రం చదివి ఉండకపోవచ్చు. ఒకటి ఎల్లీస్ దీవి- 400 ఏళ్ల క్రితం యూరప్ నుండి వలస వచ్చిన లక్షలాది మందిని అమెరికన్ గడ్డ మీదికి ఆహ్వానించిన ప్రదేశం. రెండోది 'సెంట్రల్ రైల్ రోడ్ న్యూజెర్సీ(సీఆర్ఆర్ఎన్‌జీ) టర్మినల్' అలా వచ్చిన వారిని అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన స్టేషన్..

అమెరికా అనగానే వెంటనే గుర్తుకొచ్చేది 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'. ఈ విగ్రహం వద్దకు వెళ్లాలంటే ముందు 'లిబర్టీ పార్కు'కి వెళ్లాలి. అధిక జనసాంద్రత కలిగిన న్యూజెర్సీ ప్రాంతంలో అది ఒక ఒయాసిస్. అంటే ఎడారి మ«ధ్యలో ఉండే పచ్చని ప్రదేశము. ఆ పార్కు 1212 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. అందులోని 'సి.ఆర్.ఆర్.ఎన్.జె. టర్మినల్' వద్దే లిబర్టీ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు టిక్కెట్ కొనాలి. ఫెర్రీ ద్వారా లిబర్టీ ద్వీపానికి, ఎల్లీస్ ద్వీపానికి హడ్సన్ నది గుండా ప్రయాణించాలి. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా 12 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నా, శ్రీవారి వృత్తి రీత్యా వెసులుబాటు కాక ఈ సంవత్సరము జులైలో అక్కడికి వెళ్లడం జరిగింది. మా అబ్బాయి ఉండే న్యూజెర్సీలోని చెష్టర్ ఫీల్డు ప్రాంతం నుంచి లిబర్టీ పార్కుకు ఒక గంట డ్రైవ్. లిబర్టీ పార్కులోని సి.ఆర్.ఆర్.ఎన్.జె. టెర్మినల్ నుంచి ప్రతి అరగంటకి ఫెర్రీలు ఉంటాయి. మొదటి ఫెర్రీ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది.

మేము టిక్కెట్ కొని లోపలికి వెళ్లి లైనులో నిలుచున్నాము. అక్కడ మగవాళ్లంతా సాక్సు, షూస్, బెల్టు, పెన్, సెల్ మొదలైన వస్తువులు తీసి ఒక ట్రేలో పెట్టాలి. ఆడవారు సాక్సు, షూస్‌తో పాటు హెయిర్ క్లిప్స్, చేతికున్న గాజులు కూడ తీసి ట్రేలో పెట్టాలి. తరవాత మెటల్ డిటెక్టర్‌తో మగవారిని మగవారు, ఆడవారిని ఆడవారు జాగ్రత్తగా పరిశీలిస్తారు. తరవాత ట్రేలో ఉన్న వస్తువులను స్కాన్ చేసి ఇచ్చేస్తారు. ఎవరి వస్తువులు వాళ్లకి వచ్చాక ఫెర్రీ ఎక్కేందుకు మళ్లీ లైన్లో నిలుచోవాలి. ఫెర్రీలో కిందా, పైనా సీట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎల్లీస్ ద్వీపానికి పది నిమిషాల ప్రయాణం.

ఎల్లీస్ ద్వీపం

ఈ ద్వీపం హడ్సన్ నదిలో ఒక ఇసుక దిబ్బ. మన్‌హట్టన్‌కి సరిగ్గా దక్షిణ వైపు ఉంది. ఇక్కడ ఒకనాడు 'మెహెగన్ ఇండియన్‌లు' ఉండేవారు. అప్పట్లో ఇది 'కి యెష్కు ఐలాండ్'గా పిలువబడేది. యు.ఎస్.ఎ ఏర్పడ్డాక 'ఎల్లీస్ శామ్యూల్' అనే వ్యాపారవేత్త ఈ ద్వీపాన్ని కొని తన పేరు పెట్టుకున్నాడు.
ఉత్తర, పశ్చిమ యూరప్ దేశాల నుంచి జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. యుద్ధాల వల్ల కావచ్చు, మతవైషమ్యాల వల్ల కావచ్చు, కరువుకాటకాల వల్ల కావచ్చు... కారణము ఏదైౖనా కానీ వాళ్లందరూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి అట్లాంటిక్ సముద్రం దాటి తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ఈ ద్వీపాన్ని చేరేవారు.

ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్

ఎల్లీస్ ద్వీపంలో ప్రభుత్వం వారు రెండు గృహాలను నిర్మించి వాటిలో అంటువ్యాధుల వారిని, మానసిక రోగులను ఉంచేవారు. ఆరోగ్యపరంగానూ, చట్టపరంగానూ అర్హత కలిగిన వారికే వీసా ఇచ్చి అమెరికాలోకి ప్రవేశం కల్పించేవారు. ఆ విధంగా 1892లో 'ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్' ప్రారంభించడం జరిగింది. వలస వచ్చిన వారు తమతో తీసుకొచ్చి వదిలేసిన తట్టలు, చెక్కసామాను, ఇనుప పెట్టెలు మొదలైన వాటిని సందర్శకుల కోసం ఒక పెద్ద హాలులో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 1900- 1914 మధ్యకాలంలో వలసల సంఖ్య రోజుకి 5000 నుంచి 10000 వరకు ఉండేదట.
వలసలు తగ్గుముఖం పట్టడం, వలసల సంఖ్య పరిమితం చేయడం వలన కూడా 1954లో ఇమిగ్రేషన్ స్టేషన్‌ని మూసేశారు. ఎల్లీస్ ద్వీపానికి వలస వచ్చినవారి వివరాలతో, సంతకాలతో ఒక పట్టిక అందుబాటులో ఉంది. ఇప్పటికీ అనేక మంది తమ తమ పూర్వీకుల వివరాలు తెలుసుకునేందుకు ఎల్లీస్ ద్వీపానికి వెళ్తుంటారు. 1960 ప్రాంతాల్లో ఆసియా నుంచి అమెరికాకి వలస వెళ్లిన వారి సంఖ్య మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అక్కడున్న ఒక పట్టిక తెలియజేస్తుంది.

ఎల్లీస్ ద్వీపంలో వీటిని చూసిన తరవాత మరల ఫెర్రీ ఎక్కాము. అదే టిక్కెట్‌తో ఫెర్రీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి ప్రయాణం చేయవచ్చు. రకరకాల దేశాలవారితో, రకరకాల మనుష్యులతో ఆ ప్రయాణం భలే సరదాగా సాగిపోయింది. పదిపదిహేను నిమిషాల్లో లిబర్టీ ద్వీపము చేరాము. అక్కడ నుంచి చూస్తే విగ్రహం వెనక మన్‌హట్టన్, బ్రాక్‌లిన్ బ్రిడ్జీ కనిపిస్తాయి.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

సంప్రదాయబద్ధమైన పొడవైన వస్త్రాన్ని నిండుగా ధరించిన స్త్రీమూర్తి విగ్రహం అది. కుడిచేతిలో పైకి ఎత్తి చూపుతున్న 42 అడుగుల పొడవున్న జ్యోతి, ఎడమ చేతిలో అమెరికాకి స్వాతంత్య్రం ప్రకటించిన 4 జూలై 1776 వ తేదీతో రాయబడిన రాతి శాసనం, మెడలో విరిగిన హారము (ఇది బానిసత్వపు వలస పరిపాలనా శృంఖలాల నుంచి విముక్తికి సూచన) తలపై మిరిమిట్లు గొలుపుతూ మొనదేలిన ఏడు కిరణాలతో (ఈ ఏడు కిరణాలు సప్త సముద్రాలకు, సప్త ఖండాలకు సూచన) మెరిసే కిరీటంతో మూర్తీభవించిన స్త్రీమూర్తి విగ్రహం అది.

నాలుగు స్టీలు స్తంభాలపై నిర్మించిన ఇనుప చట్రం, దానిపైన రాగి కవచము. ఈ విగ్రహాన్ని నిర్మించాలన్న ఆలోచన 1865లో ఫ్రెంచ్ లా ప్రొఫెసర్, రాజకీయనాయకుడైన 'డెలిబొలె'కి రాగా, శిల్పకారుడైన 'బర్తోల్టి' అతని ఆలోచనకు ఉత్తేజితుడై కార్యరూపం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించిన చీఫ్ ఇంజనీరు 'గస్టవే ఈఫిల్'యే ఈ లిబర్టీ విగ్రహాన్ని కూడా నిర్మించాడు. ఫ్రాన్స్, అమెరికా దేశాల ఉమ్మడి కృషిగా తయారైంది ఇది. విగ్రహం నిలుచున్న దిమ్మ నిర్మాణం అమెరికా చేపట్టగా, విగ్రహాన్ని ఫ్రెంచివారు తయారు చేశారు. అమెరికన్ విప్లవంలో మరణించిన సైనికుల స్మృతి చిహ్నంగా ఫ్రాన్స్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించుకునేందుకు 1886 అక్టోబర్ 28 వ తేదీన దీన్ని అమెరికా ప్రజలకు కానుకగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని 350 భాగాలుగా 214 పెట్టెల్లో ఉంచి ఫ్రాన్స్ నుంచి న్యూయార్క్ హార్బర్‌కు నౌకలో పంపారు. న్యూయార్క్ హార్బర్‌లో ఈ విడిభాగాలను తిరిగి ఏక విగ్రహముగా అమర్చారు. దీని ఎత్తు 151 అడుగులు, విగ్రహం పెట్టిన దిమ్మె ఎత్తు 154 అడుగులు. మొత్తం కలిపి 305 అడుగులు. దిమ్మె 11 కోణాలు కలిగిన నక్షత్రం ఆకారంలో ఉండగా, గోడలు గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. దిమ్మె చుట్టూ ఇనుప కంచె ఉంటుంది. దిమ్మె ద్వారము నుంచి పైన కిరీటం వద్దగల అబ్జర్వేటరీ వరకు వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. పై వరకు వెళ్లాలంటే విడిగా టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

- 1912లో ఫ్రెడరిక్ అనే అతను విగ్రహం జ్యోతి వద్ద గల అబ్జర్వేటరీ ఫ్లాట్‌ఫామ్ నుంచి 75 అడుగుల పొడవున్న పారాచ్యూట్ ద్వారా దిగ్విజయంగా క్రిందికి దూకాడు.
- 1929లో రాల్ఫ్ గ్లేసన్ అనే వ్యక్తి విగ్రహం కిరీటం వద్దనున్న కిటికీలోంచి బయటకు చూసి తిరిగి వస్తున్నప్పుడు కాలుజారి కిందపడి మరణించాడు.
- 1982లో ఒక గర్భవతి విగ్రహం పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా పురిటినొప్పులు వచ్చి అక్కడే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలా విగ్రహానికి సంబంధించి సంతోషకరమైన, విచారించదగ్గ సంఘటనలు చాలా ఉన్నాయట. ఈ విగ్రహాన్ని చూసిన తరవాత లిబర్టీ హౌస్ రెస్టారెంట్‌కి వెళ్లాము. ఆ దేశంలో ఏదైనా ముఖ్యమైన ప్రదర్శనా స్థలానికి వెళ్లినప్పుడు బయటికి వచ్చే మార్గంలో గిఫ్టు షాపింగ్ ఉంటుంది. అది వారి సంప్రదాయ. రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న వారికి లిబర్టీ బొమ్మల కొనుగోలులో కొంత రాయితీ ఇస్తారు. ఇవన్నీ వ్యాపార మెళకువలు.
దారిలో బర్తోల్టి, ఈఫిల్, పులిట్జర్, కొలంబస్, జెఫర్‌సన్, జార్జి వాషింగ్టన్ మొదలైన ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

డబ్ల్యుటిసి చూడలేకపోయాం

ఫెర్రీ ఎక్కేందుకు రెండు క్యూలు ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ వైపు వెళ్లేందుకు, రెండోది న్యూజెర్సీ వైపు వెళ్లేందుకు. మేము న్యూజెర్సీ వైపు వెళ్లే ఫెర్రీ ఎక్కాము. అమెరికాలో మే, జూన్, జులై నెలల్లో విపరీతమైన ఎండలు. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి, చురుకుదనం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త వారికి తప్పకుండా తలనొప్పి వస్తుంది. లిబర్టీ ద్వీపమంతా ఎండలో తిరిగిన కారణంగా, ఫెర్రీ బయలుదేరగానే హడ్సన్ నది నుంచి వచ్చే చల్లటిగాలి తనువును తాకి సేదతీరినట్టయింది. హడ్సన్ నది పరవళ్లు, ఫెర్రీ శబ్దం రెండూ కలిసి విచిత్రంగా అనిపించింది. సహజంగానే పిల్లలకి నీళ్లంటే ఇష్టం కదా. ఆ సమయంలో మా మనవడి సంతోషానికి అవధులు లేవు.

నదిలో ప్రయాణించే ఆ ఇరవై నిమిషాలూ ప్రకృతి దృశ్యాలను చూస్తూ మంత్రముగ్దులయిపోతాము. అలా వెళ్తుంటే న్యూయార్కు వైపు మన్‌హటన్‌లోని పెద్దపెద్ద భవనాలు ఆకాశహర్మ్యాలను తలపింపజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంత ఎత్తైన భవన సముదాయాల మధ్యే 2001 సెప్టెంబర్ 11న ముష్కరుల చేతిలో ధ్వంసమైన 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' ఉండేది గదా, దాన్ని చూడలేకపోయామే అని ఒకింత నిరాశ కలిగింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలన్న ఆతృతలో సి.ఆర్.ఆర్.ఎన్.జె. అంటే ఏమిటనిగానీ, అక్కడ రైలు పట్టాలు ముళ్లపొదలతో, పిచ్చి మొ క్కలతో నిండివుండడం గాని గమనించలేదు. 'ఈ రైలు పట్టాలు ఏమిటని' తిరిగి వచ్చేటప్పుడు మా అబ్బాయిని అడిగాను.

"ఇది 'సెంట్రల్ రైల్ రోడ్డు న్యూజెర్సీ టెర్మినల్'. 1600 సంవత్సరంలో యూరప్ దేశాల నుంచి మూకుమ్మడిగా వలసలు వచ్చిన తరుణంలో దీని కార్యకలాపాలు అధికంగా ఉండేవి. న్యూయార్క్ హార్బరు ప్రధాన రవాణా కేంద్రంగా ముఖ్య భూమిక వహించింది. క్రమంగా ఇతర దేశాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక విప్లవం ఉధృతం కావడం, నగరాల్లో రోడ్డు మార్గాలు, ఆనకట్టలు అభివృద్ధి చెందడం మూలంగా 1950 నాటికి సి.ఆర్.ఆర్.యన్.జె. టెర్మినల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి 1967 నాటికి పూర్తిగా ఆగిపోయాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను గత చరిత్ర స్మృతి చిహ్నంగా ఉంచేందుకు 1968లో జెర్సీసిటీ 156 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 1976 జూన్ 14న న్యూజెర్సీ ప్రభుత్వం లిబర్టీ పార్కుని ద్విశతాబ్ది కానుకగా జాతికి అంకితమిచ్చింది'' అని చెప్పుకొచ్చాడు.

న్యూయార్క్ హార్బరు లిబర్టీ పార్కుకి ఉత్తర దిశగా ఉంది. అప్పటి సేవలకు గుర్తుగా ఒక రైలు ఇంజను, కొన్ని పెట్టెలు లిబర్టీ పార్కులో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు.
ఎంతోమంది దేశవిదేశీయులను ఆకర్షిస్తూ ప్రపంచంలోని వింతలలో ఒకటైన లిబర్టీ విగ్రహాన్ని దర్శించడం గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయింది నా మనస్సులో శాశ్వతంగా.

- అవ్వా విజయలక్ష్మి, బచ్చుపేట, మచిలీపట్నం

No comments: