Showing posts with label New York. Show all posts
Showing posts with label New York. Show all posts

Tuesday, June 14, 2011

వీడ్కోలు * టీవీ తెరపై తిరుగులేని తార ఓప్రా విన్‌ఫ్రే



తానెంతగానో అభిమానించి ఆరాధించే టీవీ యాంకర్‌ని చూడడానికి శ్రియ పిల్గోంకర్ అనే ఇరవైరెండేళ్ల యువతి ముంబయి నుంచి అమెరికా వెళ్లింది. ఆ యాం కర్ నిర్వహించే టీవీ షో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం దొరికినపుడు ఆమె పడిన సంతోషం అంతా ఇంతా కాదు. సినీ తారలు, పాప్ సింగర్లంటే పడిచచ్చేవాళ్లని చూశాం కాని టీవీ యాంకర్లకి కూడా అభిమానులుంటారా అని ఆశ్చర్యపోతున్నారా. ఆ టీవీ యాంకర్ అంటే ప్రపంచానికున్న అభిమానం మరే తారకీ లేదు. ఆమే పాతికేళ్లపాటు టీవీషో నిర్వహించి ప్రపంచ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అమెరికాని 'ఓప్రాఫికేషన్' చేసిన ఒక నల్లజాతి అమెరికన్ మహిళ.. ఓప్రా విన్‌ఫ్రే.

25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.
అమెరికాలోనే కాదు, ఆమె షో ప్రసారమైన అన్ని దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. అలాగని ఓప్రా టీవీషో నిర్వహించిన మొదటి వ్యక్తేమీ కాదు. ఆమె రాకకి ముందునుంచే టీవీ టాక్‌షోలు నడుస్తున్నాయి. అయితే ఆమె మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులనుంచి సమాధానాలు రాబట్టే నేర్పరితనంతో తనదైన శైలిలో యాంకరింగ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందామె. అందుకు ఆమె వ్యక్తిత్వంతోపాటు జీవితం నేర్పిన పాఠాలూ దోహదపడ్డాయి. ఒక్క టీవీషో ద్వారా అమెరికన్ జీవితాల్లోకి అన్ని కోణాలనుంచి చొచ్చుకుపోగలిగింది. టాక్‌షోలలో సెలబ్రిటీలపై వచ్చే గాసిప్‌లను, బ్యూరోక్రాటిక్‌గా సాగే చర్చలను కాదని సామాన్య ప్రజల జీవితాలే కేంద్రంగా టీవీషో కొనసాగించింది. జనం బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాల గురించి తన షోలో చర్చిస్తూ వాటిని అమెరికన్ సమాజమంతా బహిరంగంగా చర్చించుకునేలా చేసింది ఓప్రా. అందుకే అమెరికన్లకి ఆమె అంటే అంత అభిమానం.

తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..
తల్లి తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ తనషోకి వచ్చిన అతిథుల మదిలోయల్లోకి చొచ్చుకుపోతుంది ఓప్రా. అందుకేనేమో ఆమె అడిగితే చాలు ఎంతటి వారైనా తమ మనసులో ఉన్నదాన్నంతా బయట పెట్టేవాళ్లు. ఒక్కోసారి భోరున ఏడ్చేసేవాళ్లు, ఒక్కోసారి పట్టలేని సంతోషంతో పిచ్చిగంతులేసేవారు... ఆత్మన్యూనతని పక్కన పెట్టి సగర్వంగా తమ గురించి చెప్పుకునేవాళ్లు. ఎవరి గురించి వాళ్లు చెబుతూ ఉంటే తన జీవితంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటర్వ్యూలని పరిపూర్ణం చేసేది ఆమె. అందుకే వారం వారం ప్రసారమయ్యే ఆమె షో కోసం అమెరికా పడిగాపులు కాసేది. ఆ అభిమానమే ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతురాలైన నల్లజాతి వ్యక్తిగా నిలిపింది. కడుపేదరికంలో పుట్టిన ఓప్రా అంత అభిమానాన్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించే దిశగా చేసిన పయనంలో ఎన్నో కష్టనషాల్ని చవిచూసింది.


పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో
1986, సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమైంది. అప్పటికి నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షోని కొన్ని వారాల్లోనే పక్కకి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీవీ షోలలో తెల్లజాతి మగవాళ్ల హవా నడుస్తున్న సమయంలో ఒక నల్లజాతి స్త్రీ వాళ్లని వెనక్కి నెట్టి తిరుగులేని యాంకర్‌గా వార్తల్లోకెక్కింది. క్రమంగా శాటిలైట్ టెలివిజన్ అంతర్జాతీయంగా విస్తరించడంతో ఆమె షో కూడా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పటికీ ఆ షోకి పోటీ వచ్చిన షో మరోటి లేదంటే ఆమె ఎంచుకున్న అంశాలు అలాంటివి. స్థానిక సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా, గుండెజబ్బు నుంచి ఎయిడ్స్ దాకా, స్వలింగ సంపర్కులపై వివక్ష నుంచి ఆధ్యాత్మిక చింతన దాకా ఆమె స్పృశించని అంశం లేదు. 1993లో ఓప్రా విన్‌ఫ్రే మైకెల్ జాక్సన్‌ని తన షోకి ఆహ్వానించింది.

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.


2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.


పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.
బుక్ క్లబ్‌లో చేరిన పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. ఒక్క రోజులోనే లక్షల కాపీలు అమ్ముడు పోయేవి. లైబ్రరీలన్నీ ఆ పుస్తకాలు తప్పక తెప్పించి పెట్టేవి. ఓప్రా క్లబ్‌లో చేరిన పుస్తకాల సెక్షన్లు షాపుల్లో ప్రత్యేకంగా ఉండేవి. ఓప్రాఫికేషన్ అనే కొత్త పదం ఇంగ్లీషు డిక్షనరీలో చేరింది. బహిరంగంగా నిజాన్ని ఒప్పుకునే అలవాటు అమెరికన్లలో పెంపొందడానికి ఓప్రా షోయే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కొనియాడింది. ఆమె ప్రభావంతో పాశ్చాత్య ప్రపంచంలో మెమోయిర్‌లు రాయడం పెరిగింది కూడా ఓప్రాఫికేషన్ వల్లే.

అంత్యంత ప్రభావశీల మహిళ
సిఎన్ఎన్, టైమ్ మ్యాగజైన్ రెండూ ఓప్రాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మహిళగా పేర్కొన్నాయి. అలాంటి మరెన్నో జాబితాల్లో ప్రభావశీలమైన వ్యక్తిగా ఎన్నికవ్వడం ఆమెకి సర్వసాధారణమైపోయింది. చివరికి బరాక్ ఒబామా కూడా ఓప్రా 'ఓప్రా అమెరికాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి కావచ్చేమో' అని పేర్కొన్నాడు. నిజమే.. ఆడతనమంటే అది ఓప్రాలా ఉండాలని అమెరికన్ అమ్మాయిలన్నారంటే ఆమెపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.

కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.

Monday, December 6, 2010

న్యూయార్క్‌లో దోశల బండి

కొబ్బరి చట్నీ వేసుకొని కరకరలాడే దోశలను తినేయాలని ఎవరికుండదు చెప్పండి..? మనకు దోశ తినాలనిపిస్తే ఇంటి పక్కనే ఉన్న ఏ చిన్న గల్లీలోనైనా దొరుకుతుంది. అదే అమెరికాలో అయితే అక్కడి భారతీయులందరూ దోశ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లి, అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్లలో దోశలను తినేవారు. కానీ, ఇప్పుడు తిరుకుమార్ కందస్వామి అమెరికా వెళ్లాక... ఆయన చుట్టూ తిరుగుతున్నారు దోశల ప్రియులు. ఎందుకంటే అతను న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్‌లో ఓ చిన్న దోశల బండి పెట్టాడు. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి దోశలను వేసి అబ్బురపరుస్తున్నాడు. భారతీయులే కాదు, అమెరికన్లు కూడా కందస్వామి దోశలను ఆవురావురుమంటూ తినేస్తున్నారట.

శ్రీలంక నుంచి న్యూయార్క్‌కు..
కందస్వామి అమెరికాలో దోశల బండి పెట్టడం దోశలు తిన్నంత సులభంగా జరిగిపోలేదు. ఆయన తమిళనాడువాసి. కుటుంబం శ్రీలంకలో స్థిరపడింది. అమ్మా, చెల్లెలు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఒకప్పుడు శ్రీలంకలో బైక్ రేసుల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేసిన కందస్వామికి.. అమెరికా వెళ్లాక దోశలతో దశ తిరిగిపోయింది. కొన్నాళ్లు క్వీన్స్‌లోని సౌత్ ఇండియన్ హోటళ్లలో పనిచేశాడు. చెప్పుకోడు కానీ మరిన్ని చిన్నాచితక పనులు చాలానే చేశాడు. ఎలాగో కష్టపడి గ్రీన్‌కార్డు సంపాదించుకున్నాడు.

మన దేశంలో రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇడ్లీలు, దోశలు అమ్మాలంటే ఏమంత కష్టమైన పని కాదు. అప్పుడప్పుడు తగిలే పోలీసులు, మున్సిపాలిటీ వాళ్లకు అంతోఇంతో చేతిలో పెడుతుంటే ఎన్నాళ్లయినా నడిచిపోతుంది. కానీ, అమెరికాలో అలా నడవదు. రోడ్ల పక్కన ఎక్కడా చిన్న తోపుడుబండి కూడా కనిపించదు. ఒకవేళ ఉన్నా దానికి బోలెడు పర్మిషన్లు ఉండాలి. అందుకే కందస్వామి కూడా మూడున్నరేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి లైసెన్సు తెచ్చుకున్నాడు.

లైసెన్సు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, దోశల బండిని తయారు చేయించడం మరో ఎత్తు. ఎందుకంటే న్యూయార్క్ నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారమే బండిని చేయించాలి. దీని కోసం కందస్వామి మరో ఆరు మాసాలు కుస్తీపట్టాడు. "నాకు ముందు నుంచి అందరూ చేసే పనినే గుడ్డిగా అనుసరించడం ఇష్టముండదు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఇడ్లీ, దోశల బండ్లు కనిపిస్తాయి. అదే అమెరికాలో అయితే ఈ సౌకర్యం ఉండదు.

అయినా మన వాళ్లు ఎక్కడ కలిసినా దోశలు, ఇడ్లీల గురించే చర్చలు. పెద్ద హోటళ్లలో తింటే సంతృప్తి తక్కువ, బిల్ ఎక్కువ. అదే రోడ్డు పక్కన నిల్చుని, అటూఇటూ వెళ్లే మనుషుల్ని, వాహనాల్ని చూస్తూ.. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఆ మజానే వేరు. ఆ తినేదేదో అమెరికా వీధుల్లో తింటే ఇంకెంత బాగుంటుందో కదా..! అందుకే పెడితే ఇక్కడే దోశల బండి పెట్టాలనుకున్నా.

ఎంతోమందిని కలిసి, అమెరికా ప్రభుత్వ నిబంధనలను అధ్యయనం చేసి... ఈ దోశలబండిని ఈ చెట్ల కింద పెట్టాను. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా... నేను వేసిన మసాలా దోశ ఈ అమెరికాలో ఎవ్వడు వేస్తాడో చూపించండి...'' అంటూ గర్వంగా మీసాలు మెలేస్తూ.. చిరునవ్వుతో చెప్పుకొచ్చే కందస్వామిని చూసి అమెరికన్లు కూడా శభాష్ అనక తప్పడం లేదు.

మాంద్యంలో హాట్‌కేకులు
ఆర్థికమాంద్యంతో అమెరికా ఎంత నష్టపోతున్నదో కానీ, కందస్వామి మాత్రం బాగా వెనకేస్తున్నాడు. అమెరికాలోని యువతీయువకులు ఉద్యోగాలు లేక వీధుల్లో తిరుగుతున్నారు. రెస్టారెంట్‌లలో తిండి తినాలంటే కనీసం యాభై డాలర్లను వదిలించుకుంటే కానీ కడుపు నిండదు. అదే కందస్వామి దగ్గరికి వెళితే కేవలం ఆరు డాలర్లకే రుచికరమైన వేడి వేడి దోశ వేసిస్తాడు. రవ్వదోశ, మసాలదోశ, ప్లెయిన్ దోశ, పాండిచ్చేరి దోశతోపాటు ఊతప్పం, వడ... ఇలా ఎవరికి ఏం కావాలంటే అది క్షణాల్లో తయారు చేసిస్తున్నాడు.

'నాకే ఆశ్చర్యం వేస్తుంది. రోడ్ల మీద వెళ్లే వాహనాలు నా దోశ వాసన తగలగానే ఆగిపోతున్నాయి. అందులో భారతీయులకంటే అమెరికన్లే ఎక్కువ మంది ఉన్నారు. నేను దోశ వేశానంటే అదిరిపోవాలంతే. ఎప్పుడో మా అవ్వ నేర్పింది కొబ్బరి చట్నీ చేయడం. అది ఇప్పుడు పనికొచ్చింది. కొబ్బరి చట్నీతో లొట్టలేసుకుంటూ దోశలు తినేస్తున్నారు అందరూ. నాకు 45 దేశాల కస్టమర్లు ఉన్నారు. హోటళ్లు ప్రచురించే గైడ్ బుక్‌లో నా దోశల బండికీ స్థానం దక్కింది. ఫేస్‌బుక్, ఈ మెయిల్ ద్వారా కూడా దోశలు పంపమని ఆర్డర్లు వస్తుంటాయి. ఒక రోజు అమెరికాలో ఫైనాన్షియల్ టైమ్స్‌లో నా గురించి స్టోరీ పడింది.

దాన్ని చూసి లండన్‌కు చెందిన ఒకాయన నా బండి దగ్గరకొచ్చి దోశ తిని, నన్ను అభినందనలతో ముంచెత్తి మరీ వెళ్లాడు. నాకు చాలా సంతోషమేసింది. న్యూయార్క్ యూనివర్శిటీ స్టూడెంట్స్ కూడా నాకు రెగ్యులర్ కస్టమర్లు..'' అన్నాడు దోశల కందస్వామి. న్యూయార్క్‌లో ఏటా వీధి వ్యాపారులకు ఇచ్చే'వెండీ' అవార్డును (వెండర్లకిచ్చే అవార్డు) సైతం ఆయన గెలుచుకోవడం విశేషం. దోశలతో వేడి వేడిగా సంపాదిస్తున్న కందస్వామి ఇప్పుడు అమెరికాలోనే రెండో దోశల బండి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దోశల సంపాదనతోనే తన ముద్దుల కూతురును కొలంబియా యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి..? భారతీయ దోశల ఘుమఘుమలతో న్యూయార్క్ వీధులను నింపేస్తున్న కందస్వామికి మనం కూడా దోశలు సారీ, చేతులు జోడించి అభినందనలు చెబుదాం.

Thursday, September 16, 2010

పాలవెల్లి కోసం వాల్‌మార్ట్‌లో వెతికాం

(అమెరికాలో ఉంటున్న ఇందు వినాయక చవితి జరుపుకునేందుకు చాలా కష్టాలు పడిందట. అవేంటో తన బ్లాగ్‌లో రాసుకుంది మీరూ చదవండి) చిన్నప్పటి నుంచి మేం వినాయక చవితి చాలా ఘనంగా జరుపుకునేవాళ్లం. అటువంటిది ఈ దేశం కాని దేశంలో మొదటిసారి ఇంటికి దూరంగా ఉండి జరుపుకుంటున్న పండుగ ఇది. రెండు రోజుల ముందు నుంచే చందుని హింసించడం మొదలుపెట్టాను..

పత్రి ఎలా? మట్టి వినాయకుడు దొరుకుతాడా? ఉండ్రాళ్లకి బియ్యపు రవ్వ ఎక్కడ కొనాలి? మరి పాలవెల్లి సంగతేంటి? వ్రత కథ పుస్తకం ఎలా? బంతిపూల మాలలు దొరకవు కదా? ఇలా విసిగించాను. పాలవెల్లి కోసం దగ్గరలో ఉన్న ఇండియన్ స్టోర్స్ అన్నీ తిరిగాం. కానీ దొరకలేదు. అసలు పాలవెల్లి లేకుండా వినాయకచవితి ఊహించుకోవడం ఎలా? దానికి పసుపురాసి కుంకుమ పెటి ్ట గోడకి కట్టి దానికి ఆపిల్, దానిమ్మ కాయలు, వెలక్కాయలు, మొక్కజొన్నలు, అరటి పిలకలు, మామిడాకులు, బంతి, కలువ పువ్వులన్నింటితో అలంకరణ చేస్తేనే కదా పండగ కళ వచ్చేది? ఇంటికి వచ్చాక ఇంటర్‌నెట్‌లో గూగుల్ మీద పడి వెతకడం మొదలుపెట్టాను. ఎక్కడా పాలవెల్లి జాడ కనిపించలేదు. సరిగ్గా రేపు పండగ అనగా ఒక సైట్‌లో 'పాలవెల్లిని నేనే తయారు చేసుకున్నా' అని ఓ పోస్ట్ కనిపించింది.

నేనూ అలాగే తయారు చేసుకుందామని చెక్కముక్కల కోసం వాల్‌మార్ట్‌కి వె ళ్లాను. దొరకలేదు. మిగతా సరుకులైనా కొందామని 'క్రోగర్'లో పూల బొకేలు, అరటి పళ్లు తీసుకున్నాం. 'నమస్తే'కి వెళ్లి కొబ్బరికాయలు కొన్నాం. పండగ సందర్భంగా వారు మామిడాకులు, చెరకుగడ, తమలపాకులు, రెండు అరటిపళ్లు, ఇంకా నాలుగు రకాల పళ్లు కూడా ఇచ్చారు. అవన్నీ ఉంటేనే కదా పండగ కళ.

ఇక మట్టి వినాయకుని వెతకడమే మిగిలింది. ఏ షాపులో చూసినా రంగు రంగుల వినాయకులే. నాకేమో మట్టి వినాయకుడే కావాలి. చివరికి ఒక షాపులో బుజ్జి వినాయకుడు దొరికాడు. చిన్న గొడుగు కింద సింహాసనం మీద ఠీవిగా కూర్చున్నాడు. తర్వాత తమలపాకులు, వక్కలు, చందనం, చిన్న దీపపు ప్రమిదలు కొన్నాం. పాలవెల్లి ఇంకా మిగిలే ఉంది. చెక్కల కోసం 'హోమ్ డిపో'కి వెళ్లాం. కష్టపడి మాకు కావాల్సిన చెక్కముక్కలు కొన్నాం. ఇంటికి రాగానే చందు పాలవెల్లిని తయారు చేసే పనిలో మునిగిపోతే, రేపు వంటకి కావాల్సిన ఏర్పాట్లలో నేను ఉండిపోయా. పాలవెల్లి రెడీ అయింది కాని దాన్ని ఎలా వేలాడదీయాలి? గోడకి మేకులు కొడితే ఓనర్స్ ఒప్పుకోరు.

అందుకే మా సైడ్ టేబుల్‌ని పూజామందిరంగా మార్చేశా. కింద పైన అద్దాలు ఉండే సైడ్ టేబుల్ అది. కింద గ్లాస్ మీద వినాయకుడిని పెట్టొచ్చు. పైన పాలవెల్లి పెట్టొచ్చు అనుకున్నాం. అమ్మయ్య! మనసు కుదుటపడింది. చవితి రోజున పొద్దున్నే లేచి వంట కానిచ్చి ఇద్దరం పూజ ముందు కూర్చున్నాం. పాలవెల్లిని అలంకరించుకుని లాప్‌టాప్‌లో వినాయక వ్రతం డౌన్లోడ్ చేసి, దానికి అనుగుణంగా పూజ చేశాం. ఆ రోజు మా ఇంటికి అతిథిగా వాచ్చిన నాని గారు మా వినాయకుణ్ణి చూసి 'ఇండియాని గుర్తు చేశారండి' అన్నారు. నాకు చాలా సంతోషమేసింది.

Saturday, September 11, 2010

న్యూయార్క్‌లో మన ‘తినుబండి’!

మనవాళ్లు వట్టి వెధవాయిలోయ్..అని వెనకటికి ఎవరో పెద్దాయిన అంటే అని వుండొచ్చు కానీ, విదేశాల్లో మాత్రం మనవాళ్లు చాలా గట్టివాళ్లనిపించుకుంటున్నారు. అక్కడికి వెళ్లగానే ఎక్కడ లేని తెలివితేటలు ‘వంట’పట్టించేసుకుంటున్నారు. కేవలం ఉద్యోగాలతో సరిపెట్టేసుకోకుండా, కట్టెలమ్మే చోట కట్టెలు, పూలమ్మే చోట పూలు విక్రయిస్తూ, కావాల్సినన్ని కాసులు జమచేసుకుంటున్నారు.
న్యూయార్క్‌లో ఇండియన్ రెస్టారెంట్‌లకు కానీ, ఫుడ్‌కోర్టులకు కానీ కొదవలేదు. ముఖ్యంగా డౌన్‌టౌన్ మన్‌హట్టన్‌లోని న్యూయార్క్ యూనివర్సిటీ కాంపస్‌లో. ఇక్కడ కొంతమంది దేశీ ఫుడ్ కౌంటర్లు ప్రారంభించి, కాస్త జిహ్వచాపల్యం వున్న వారిని ఇట్టే ఆకట్టుకుంటున్నాయి.Alamgeer Elahiమరి కొంఛెం ముందుకు వెళ్లి కాస్త భిన్నంగా ఏమన్నా చేయాలనుకున్నాడు. అక్కడి ఫిఫ్త్ ఎవెన్యూలోని 27వ వీధిలో ఇప్పుడు ఓ పచ్చటి వ్యాన్‌లో అతడు మోటల్ లేదా సంచార హోటల్ నడుపుతున్నాడు. అటుగా వెళ్లేవారెవరూ దాన్ని చూడకుండా వుండడం అసాధ్యం. పచ్చటి బ్యాక్‌గ్రౌండ్‌పై పాకిస్తానీ ట్రైబల్ ఆర్ట్‌తో డెకరేట్ చేసి, ఎంబ్రాయిడరీ కర్టెన్లు అమర్చి, డెకరేట్ చేసారా వ్యాన్‌ను.
చక్కగా వేడి వేడి లచ్చాపరాటాలను ఇట్టే ఆరగించవచ్చు అక్కడ. అలాగే కాస్త దాల్, రైస్, ఇంకా కావాలంటే కాస్త బిరియానీ కూడా తినొచ్చు. రేట్లేమీ అమెరికా లెవెల్లో వుండవు. ఆ బిరియానీలో కూడా రకాలెన్నో. కలకత్తా బిర్యానీ, షాన్‌దార్ బిర్యానీ ఇలా. ఇంకా ఇండియన్ వెరైటీలెన్నో లభిస్తాయి. చిత్రమేమిటంటే ఇండియనే్స కాదు.. నాన్ ఇండియన్స్ కూడా ఈ ‘తిండి బండి’ దగ్గరకు చేరి, లొట్టలు వేస్తూ ‘మన తిండి’ని లాగించేస్తున్నారు. నెల రోజుల క్రితం ప్రారంభమైన ఈ వ్యాపారం అనుకున్న దాని కన్నా బాగా సాగుతోందని యజమాని ఇలాహీ ఆనందంగా చెబుతున్నాడు. ‘ఇక్కడ తినడం చాలా బాగుంది. పైగా అన్నీ రెడీగా క్షణాల్లో అందిస్తున్నారు’ అని కస్టమర్లు సర్ట్ఫికెట్లు ఇస్తున్నారు. నిజానికి ఇలాహీకి ఈ ఐడియా కొత్తగా రాలేదు. ఇంతకు ముందే సిక్స్త్ ఎవెన్యూలోని 40వ స్ట్రీట్‌లో ఓ ‘తిండి బండి’ వుంది. అది హిట్ కావడంతో, మరొకటి ప్రారంభించాడు. ‘చాలా మంది జనానికి తీరుబడిగా కూర్చుని తినేంత సమయం లేదు. ఉరకలు..పరుగుల జీవి తం సాగుతోంది. అందుకనే ఇక్కడకు వచ్చినవారికి క్షణాల్లో కావాల్సినవి త్వరగా తయారుచేసి వండిస్తున్నాం’ అని ఇలాహీ తన విజయరహస్యాన్ని వివరించాడు. అతడి తల్లితండ్రులు పాకిస్తాన్ పంజాబ్ నుంచి భారత్‌లోని కలకత్తాకు వలస వస్తే, ఇతడు అక్కడి నుంచి న్యూయార్క్‌లో తేలాడు. గత పద్దెనిమిదేళ్లుగా అక్కడే మొబైళ్ల వ్యాపారం, ఆ తరువాత రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి, ఆఖరికి ఈ తిండి వ్యాపారంలో స్థిరపడ్డాడు. వీలయినంత తక్కువ ధరలకు ఆహారపదార్ధాలు అందివ్వడం, సెలవు అన్నదే లేకుండా నిర్వహించడం చేస్తున్నాడు. కొన్నాళ్లయితే ధరలు పెంచాలన్నది అతడి ఆలోచన. వారాంతాల్లో ఉదయం ఆరుకే ‘తిండిబండి’ని ప్రారంభిస్తాడు. వీలయినంతవరకు నాణ్యమైన బటర్, నెయ్యి వాడతాడు. దాల్, రైస్, చపాతీ, రోటీలతో పాటు మన స్టయిల్ పచ్చళ్లు కూడా వడ్డిస్తాడు. అన్నట్లు పచ్చి ఉల్లిపాయి ఇవ్వడం మర్చిపోడు. వారాంతాల్లో హైదరాబాద్ బిరియానీ ఘుమఘుమలాడుతూ , ఇల్లాహ్‌కు డబ్బులు బానే రప్పిస్తోంది. ఎవరన్నారు మనవాళ్లు వట్టి వెధవాయిలనీ..?

-వి.ఎస్.ఎన్