Showing posts with label America. Show all posts
Showing posts with label America. Show all posts

Tuesday, June 14, 2011

వీడ్కోలు * టీవీ తెరపై తిరుగులేని తార ఓప్రా విన్‌ఫ్రే



తానెంతగానో అభిమానించి ఆరాధించే టీవీ యాంకర్‌ని చూడడానికి శ్రియ పిల్గోంకర్ అనే ఇరవైరెండేళ్ల యువతి ముంబయి నుంచి అమెరికా వెళ్లింది. ఆ యాం కర్ నిర్వహించే టీవీ షో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చునే అవకాశం దొరికినపుడు ఆమె పడిన సంతోషం అంతా ఇంతా కాదు. సినీ తారలు, పాప్ సింగర్లంటే పడిచచ్చేవాళ్లని చూశాం కాని టీవీ యాంకర్లకి కూడా అభిమానులుంటారా అని ఆశ్చర్యపోతున్నారా. ఆ టీవీ యాంకర్ అంటే ప్రపంచానికున్న అభిమానం మరే తారకీ లేదు. ఆమే పాతికేళ్లపాటు టీవీషో నిర్వహించి ప్రపంచ టెలివిజన్ చరిత్రలో తనకంటూ ప్రత్యేకస్థానాన్ని సంపాదించుకోవడమే కాకుండా అమెరికాని 'ఓప్రాఫికేషన్' చేసిన ఒక నల్లజాతి అమెరికన్ మహిళ.. ఓప్రా విన్‌ఫ్రే.

25, మే 2011.. ప్రపంచ టెలివిజన్ చరిత్రలో ఒక అధ్యాయానికి తెరపడింది. 1986 మొదలై 145కి పైగా దేశాల్లో ప్రసారమవుతూ వస్తున్న 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' ఆ రోజుతో ముగిసింది. పాతికేళ్లుగా అమెరికాలో ఇంటిల్లిపాదికీ సుపరిచితమైన ఓప్రా విన్‌ఫ్రే చివరిసారి టీవీలో కనిపించే ఎపిసోడ్‌ని ఆ దేశంలో సినిమా థియేటర్లలో కూడా లైవ్‌గా ప్రదర్శించారు. దేశవ్యాప్తంగా బార్లు, పబ్‌లలో ఓప్రా అభిమానులు చేరి టీవీషో చూస్తూ వీడ్కోల పండుగ జరుపుకున్నారు. ఆమెరికా ఆమెని అంతగా ఆరాధించడానికి కారణమేమిటి? ఓప్రా విన్‌ఫ్రే కేవలం టీవీ యాంకర్ మాత్రమే కావచ్చు. అమెరికన్ సంస్కృతిని పాతికేళ్లుగా మరెవరూ చేయలేనంతగా ప్రభావితం చేసిందని సామాజిక శాస్త్రవేత్తల పరిశోధనలు నిరూపించాయి.
అమెరికాలోనే కాదు, ఆమె షో ప్రసారమైన అన్ని దేశాల్లోనూ ఆమెకి అభిమానులున్నారు. అలాగని ఓప్రా టీవీషో నిర్వహించిన మొదటి వ్యక్తేమీ కాదు. ఆమె రాకకి ముందునుంచే టీవీ టాక్‌షోలు నడుస్తున్నాయి. అయితే ఆమె మాట్లాడే విధానం, ఎదుటి వ్యక్తులనుంచి సమాధానాలు రాబట్టే నేర్పరితనంతో తనదైన శైలిలో యాంకరింగ్‌లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిందామె. అందుకు ఆమె వ్యక్తిత్వంతోపాటు జీవితం నేర్పిన పాఠాలూ దోహదపడ్డాయి. ఒక్క టీవీషో ద్వారా అమెరికన్ జీవితాల్లోకి అన్ని కోణాలనుంచి చొచ్చుకుపోగలిగింది. టాక్‌షోలలో సెలబ్రిటీలపై వచ్చే గాసిప్‌లను, బ్యూరోక్రాటిక్‌గా సాగే చర్చలను కాదని సామాన్య ప్రజల జీవితాలే కేంద్రంగా టీవీషో కొనసాగించింది. జనం బయటకు చెప్పుకోలేని ఎన్నో విషయాల గురించి తన షోలో చర్చిస్తూ వాటిని అమెరికన్ సమాజమంతా బహిరంగంగా చర్చించుకునేలా చేసింది ఓప్రా. అందుకే అమెరికన్లకి ఆమె అంటే అంత అభిమానం.

తల్లి పిల్లలతో మాట్లాడినట్లే..
తల్లి తన పిల్లలతో మాట్లాడినట్టు మాట్లాడుతూ తనషోకి వచ్చిన అతిథుల మదిలోయల్లోకి చొచ్చుకుపోతుంది ఓప్రా. అందుకేనేమో ఆమె అడిగితే చాలు ఎంతటి వారైనా తమ మనసులో ఉన్నదాన్నంతా బయట పెట్టేవాళ్లు. ఒక్కోసారి భోరున ఏడ్చేసేవాళ్లు, ఒక్కోసారి పట్టలేని సంతోషంతో పిచ్చిగంతులేసేవారు... ఆత్మన్యూనతని పక్కన పెట్టి సగర్వంగా తమ గురించి చెప్పుకునేవాళ్లు. ఎవరి గురించి వాళ్లు చెబుతూ ఉంటే తన జీవితంలో జరిగిన సంఘటనల్ని ప్రస్తావిస్తూ ఆ ఇంటర్వ్యూలని పరిపూర్ణం చేసేది ఆమె. అందుకే వారం వారం ప్రసారమయ్యే ఆమె షో కోసం అమెరికా పడిగాపులు కాసేది. ఆ అభిమానమే ఆమెని 20వ శతాబ్దంలో అత్యంత ధనవంతురాలైన నల్లజాతి వ్యక్తిగా నిలిపింది. కడుపేదరికంలో పుట్టిన ఓప్రా అంత అభిమానాన్ని ఆస్తిపాస్తుల్ని సంపాదించే దిశగా చేసిన పయనంలో ఎన్నో కష్టనషాల్ని చవిచూసింది.


పేదరికం నుంచి..
ఓప్రా విన్‌ఫ్రే 1954 జనవరి 29న మిసిసిపీలో ఒక టీనేజి పెళ్లికాని అమ్మాయికి జన్మించింది. ఆమె తల్లి ఇళ్లల్లో పనిచేసేది. ఓప్రా అసలు పేరు ఓర్పా గెయిల్ విన్‌ఫ్రే. ఓర్పా కాస్తా వాడుకలో ఓప్రా అయిపోయింది. తొమ్మిదేళ్ల వయసులో అత్యాచారానికి గురయ్యానని ఒకసారి తన షోలో చెప్పింది ఓప్రా. ఏళ్లపాటు అత్యాచారానికి గురైన ఆమె 13 ఏళ్లవయసులో ఇల్లొదిలి పారిపోయింది. పద్నాలుగేళ్ల వయసులో మగబిడ్డకి జన్మనిచ్చింది. అయితే ఆ బిడ్డ పురిట్లోనే చనిపోయాడు. అప్పట్నించి నేటికీ ఆమె పెళ్లి చేసుకోలేదు. స్కూల్లో చదువుకుంటున్న రోజుల్లో వక్తృత్వపోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు సాధించింది. ఆ పోటీల్లో గెలుపుతో యూనివర్శిటీ చదువుకి ఫెలోషిప్ సంపాదించి నల్లజాతి విద్యార్థులకు పెట్టింది పేరైన టెన్నెస్ స్టేట్ యూనివర్శిటీలో చేరింది.

ఓ పక్క చదువుకుంటూనే స్థానిక రేడియో స్టేషన్లో వార్తలు కూడా చదివిన ఆమె ఆ రేడియోలో పనిచేసిన పిన్నవయస్కురాలే కాదు, మొట్టమొదటి నల్లజాతి యాంకర్ కూడా ఆమే. రేడియో యాంకర్‌గా తనకంటూ ప్రత్యేకత సాధించుకున్న ఓప్రా 1983లో టెన్నెస్ నుంచి చికాగోకి మకాం మార్చింది. ఓ రేడియో స్టేషన్‌లో ఉదయం వార్తా కార్యక్రమాన్ని నిర్వహించడం మొదలుపెట్టింది. ఓప్రా రంగ ప్రవేశంతో కొన్ని నెలల్లోనే రేటింగ్‌లో ఎక్కడో చిట్టచివరి స్థానంలో ఉన్న ఆ కార్యక్రమం మొట్టమొదటి స్థానానికి ఎగబాకింది. ఓప్రా ఇంటర్వ్యూ చేసే తీరు, ఆమె నైపుణ్యాన్ని గమనించిన సినీ విమర్శకుడొకరు ఆమెని టెలివిజన్ షో చెయ్యమని సలహా ఇచ్చాడు. కార్యక్రమాన్ని దేశమంతటా టీవీ చానళ్లకు అమ్మవచ్చని, ఖచ్చితంగా జనాన్ని ఆకర్షించగలుగుతుందని చెప్పాడు. ఆయన సలహాతోటే 'ది ఓప్రా విన్‌ఫ్రే షో' అనే పేరుతో ఆమె సొంతగా టెలివిజన్ షో నిర్మించే పనిలో పడింది.

ది ఓప్రా విన్‌ఫ్రే షో
1986, సెప్టెంబర్ 8న దేశవ్యాప్తంగా ఓప్రా విన్‌ఫ్రే షో ప్రసారమైంది. అప్పటికి నెంబర్‌వన్ స్థానంలో ఉన్న షోని కొన్ని వారాల్లోనే పక్కకి నెట్టి మొదటి స్థానాన్ని ఆక్రమించింది. టీవీ షోలలో తెల్లజాతి మగవాళ్ల హవా నడుస్తున్న సమయంలో ఒక నల్లజాతి స్త్రీ వాళ్లని వెనక్కి నెట్టి తిరుగులేని యాంకర్‌గా వార్తల్లోకెక్కింది. క్రమంగా శాటిలైట్ టెలివిజన్ అంతర్జాతీయంగా విస్తరించడంతో ఆమె షో కూడా ప్రపంచవ్యాప్తమైంది. ఇప్పటికీ ఆ షోకి పోటీ వచ్చిన షో మరోటి లేదంటే ఆమె ఎంచుకున్న అంశాలు అలాంటివి. స్థానిక సమస్యల నుంచి ప్రపంచ రాజకీయాల దాకా, గుండెజబ్బు నుంచి ఎయిడ్స్ దాకా, స్వలింగ సంపర్కులపై వివక్ష నుంచి ఆధ్యాత్మిక చింతన దాకా ఆమె స్పృశించని అంశం లేదు. 1993లో ఓప్రా విన్‌ఫ్రే మైకెల్ జాక్సన్‌ని తన షోకి ఆహ్వానించింది.

ఇద్దరు నల్లజాతి తారల్ని ఓ చోట చేర్చిన ఆ కార్యక్రమం అమెరికన్ టెలివిజన్ చరిత్రలోనే అతి ఎక్కువమంది వీక్షించినదిగా రికార్డులకెక్కింది. నోబెల్ గ్రహీత, అమెరికన్ నల్లజాతి రచయిత్రి టోని మారిసన్ రచించిన 'బిలవెడ్'ని వెండితెరపై నిర్మించి నటించింది. మరో నల్లజాతి రచయిత్రి ఆలిస్ వాకర్ రచించిన 'ది కలర్ పర్పుల్'ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మిస్తే, దాన్లో నటించి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ నామినేషన్ కూడా సాధించింది. ఒక విజయం మరిన్ని విజయాలకు బాట వేస్తుందనేది ఓప్రా విషయంలో ముమ్మాటికీ నిజమైంది.


2000 సంవత్సరంలో ఆమె ప్రారంభించిన 'ఒ-ది ఓప్రా మ్యాగజైన్' మాసపత్రిక 27 లక్షల కాపీల సర్క్యులేషన్‌తో నడుస్తోంది. ఆ మ్యాగజైన్ దక్షిణాఫ్రికా ఎడిషన్ కూడా అంతే స్థాయిలో ఆదరణ పొందింది. ఓప్రాకి ఉన్న ఆదరణని గమనించిన డిస్కవరీ కమ్యూనికేషన్స్ సంస్థ ఆమెతో సంయుక్తంగా ఒక చానల్ నడపడానికి ముందుకొచ్చింది. ఈ సంవత్సరం జనవరిలో 'ఓప్రా విన్‌ఫ్రే నెట్‌వర్క్' పేరుతో ఆ టీవీ చానల్ మొదలైంది.


పుస్తక ప్రచురణపై ఓప్రా మార్కు
ఓప్రా విన్‌ఫ్రే ఐదు పుస్తకాలకు సహరచయిత కూడా. 2005లో ఆమె తన వ్యక్తిగత ట్రెయినర్ బాబ్ గ్రీన్‌తో కలిసి బరువు తగ్గడంపై పుస్తకం రాసింది. ఆ పుస్తకానికి వచ్చిన పారితోషకం కూడా ఒక రికార్డే. ప్రపంచంలో ఏ రచయితకీ చెల్లించనంత ఎక్కువ మొత్తాన్ని ఆమెకి చెల్లించారని వార్తలొచ్చాయి. అప్పటి దాకా అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జీవితచరిత్రకి లభించిందే అతి ఎక్కువ మొత్తం. పుస్తకాలు రాయడమే కాదు ఓప్రా తన షోలో పుస్తకాల గురించి కూడా చర్చించేది. దానికి ఓప్రా బుక్ క్లబ్ అనే పేరు పెట్టిందామె. ఏదైనా పుస్తకం ఆ క్లబ్‌లో స్థానం సంపాదించడమంటే ఒక పెద్ద అంతర్జాతీయ అవార్డు రావడంతో సమానం.
బుక్ క్లబ్‌లో చేరిన పుస్తకాల అమ్మకాలు అమాంతం పెరిగిపోయేవి. ఒక్క రోజులోనే లక్షల కాపీలు అమ్ముడు పోయేవి. లైబ్రరీలన్నీ ఆ పుస్తకాలు తప్పక తెప్పించి పెట్టేవి. ఓప్రా క్లబ్‌లో చేరిన పుస్తకాల సెక్షన్లు షాపుల్లో ప్రత్యేకంగా ఉండేవి. ఓప్రాఫికేషన్ అనే కొత్త పదం ఇంగ్లీషు డిక్షనరీలో చేరింది. బహిరంగంగా నిజాన్ని ఒప్పుకునే అలవాటు అమెరికన్లలో పెంపొందడానికి ఓప్రా షోయే కారణమని వాల్ స్ట్రీట్ జర్నల్ కొనియాడింది. ఆమె ప్రభావంతో పాశ్చాత్య ప్రపంచంలో మెమోయిర్‌లు రాయడం పెరిగింది కూడా ఓప్రాఫికేషన్ వల్లే.

అంత్యంత ప్రభావశీల మహిళ
సిఎన్ఎన్, టైమ్ మ్యాగజైన్ రెండూ ఓప్రాని ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీల మహిళగా పేర్కొన్నాయి. అలాంటి మరెన్నో జాబితాల్లో ప్రభావశీలమైన వ్యక్తిగా ఎన్నికవ్వడం ఆమెకి సర్వసాధారణమైపోయింది. చివరికి బరాక్ ఒబామా కూడా ఓప్రా 'ఓప్రా అమెరికాలో అత్యంత ప్రభావశీల వ్యక్తి కావచ్చేమో' అని పేర్కొన్నాడు. నిజమే.. ఆడతనమంటే అది ఓప్రాలా ఉండాలని అమెరికన్ అమ్మాయిలన్నారంటే ఆమెపై వారికున్న అభిమానం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు.

కాలిఫోర్నియాలోని 'ది ప్రామిస్డ్ ల్యాండ్' అనే 42 ఎకరాల సువిశాల ఎస్టేట్‌లో ఉన్న విలాస భవనం ఆమె ప్రస్తుత నివాసం. ఇంకా చాలా నగరాల్లో ఆమెకి ఇళ్లున్నాయి. ప్రఖ్యాత నల్లజాతి అమెరికన్ రచయిత్రి మాయా ఎంజెలూ అంటే ఓప్రాకి ఎనలేని ప్రేమ, గౌరవం. 'ఆమే నాకు అక్క, తల్లి, స్నేహితురాలు' అని పేర్కొన్నదోసారి. పేదరికంలో పుట్టి పెరిగిన ఓప్రా 32 ఏళ్లకే మిలియనీరైంది. 41 ఏళ్లు వచ్చేనాటికి ఫోర్బ్స్ 400 మంది ధనవంతుల జాబితాలో ఉన్న ఏకైక నల్లజాతి వ్యక్తి అయింది. ఆమె ఆస్తి అప్పటికి 340 మిలియన్ డాలర్లు. 20వ శతాబ్దానికి గాను అత్యంత ధనవంతురాలైన ఆఫ్రికన్ అమెరికన్ ఆవిడే.

కేవలం సంపాదించడమే కాదు, దాన్నెలా ఖర్చు చేయాలో కూడా తెలుసు ఓప్రాకి. అందుకే 1998లో ఓప్రాస్ ఏంజెల్స్ నెట్‌వర్క్ పేరుతో ఒక సేవాసంస్థను స్థాపించి ఎనిమిది కోట్ల డాలర్లు విరాళాలు సేకరించి సేవాకార్యక్రమాలు నిర్వహించింది. అమెరికాలో మరే ఇతర సెలబ్రిటీ దానం చేయనంత డబ్బుని దానం చేసింది. ఒక్క 2007లోనే 303 మిలియన్ డాలర్లు విరాళంగా ఇచ్చిన ఆమె దక్షిణాఫ్రికాలో వీధి బాలల కోసం స్కూల్ కూడా నడుపుతోంది.

Thursday, December 9, 2010

34 మిలియన్ ఫ్రెండ్స్

దీనికి ప్రత్యక్ష నిదర్శనం జేన్ రాబర్ట్స్, లూయిస్ అబ్రహాం. జేన్ రాబర్ట్స్ పుట్టింది పెరిగింది కాలిఫోర్నియాలో. రెడ్‌ల్యాండ్స్ అనే ప్రాంతంలోని ఒక స్కూల్లో ఫ్రెంచ్ ఉపాధ్యాయురాలు. అందరికీ మంచి చేయాలనే ఆలోచన తప్పితే- ఉద్యమాల పట్ల అంత ఆసక్తి లేదు. అలాగని తన చుట్టూ జరిగే అన్యాయాలు, అక్రమాలను ఎదిరించాలనే భావన పట్ల విముఖత కూడ లేదు. పిల్లలను మంచి వ్యక్తిత్వం ఉన్నవారిగా తీర్చిదిద్దాలనే కోరికే ఆమెను ఉపాధ్యాయవృత్తిని ఎంచుకొనేలా చేసింది. ఆ కోరికే ఆమెను రిటైరయ్యే దాకా అదే ఉద్యోగంలో కొనసాగేలా చేసింది.

లూయిస్ అబ్రహాం ఒక మామూలు మధ్యతరగతి మహిళ. కుటుంబమే సర్వస్వం, ఇంటి పనే దైవం అనుకొనే వ్యక్తి. కాని అవసరమైనప్పుడు ఎంతకైనా తెగించి పోరాడడం ఆమె నైజం.

జేన్‌కు ఒక రోజు అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ చేసిన ప్రకటన కనబడింది. పత్రికలకు అది చాలా అప్రధాన వార్త. చాలా మంది పాఠకులకూ అది అప్రధాన వార్తే. "యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్‌కు అమెరికా ప్రభుత్వం 3.4 కోట్ల డాలర్ల నిధులను సమకూరుస్తానని గతంలో ప్రకటించింది. అయితే ఈ సంస్థ పనితీరును గమనించిన తర్వాత.. మారిన ప్రాధమ్యాల నేపధ్యంలో- ఈ నిధులను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించాం..'' అనేది ఆ ప్రకటన సారాంశం. ఉదయాన్నే చాలామంది లాగానే జేన్ కూడా ఆ వార్త చదివింది. ఈ నిధులు ఇవ్వకపోతే అమెరికా ప్రభుత్వంపై ఎవరూ ఒత్తిడి పెట్టరు.

ప్రపంచ దేశాల నేతలెవరూ పట్టించుకోరు. ఐక్యరాజ్యసమితిలో ఈ విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించరు. కాలమిస్ట్‌లు కూడా తమ వ్యాసాల్లో ఈ విషయానికి ప్రాధాన్యం ఇవ్వరు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇలాంటి నిర్ణయాలు ఎవరికి పట్టవు. కాని అమెరికా ఇచ్చే ఆ మూడు కోట్ల డాలర్లు- అఫ్గానిస్థాన్, అంగోలా, దక్షిణాఫ్రికా, ఇథియోపియా- ఇలా అనేక వర్థమాన దేశాల్లో ఉన్న మహిళల జీవితాల్లో మార్పు తెస్తాయి.

అంగోలాలో ఉన్న ఒక పల్లెటూరులోని ఆసుపత్రికి కొత్త ఇన్‌క్యుబేటర్ రావచ్చు. ఆఫ్ఘనిస్థాన్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో గర్భిణిలకు పౌష్టికాహారం అందొచ్చు. ఈ భావన జేన్‌లో కొత్త ఆలోచనలను రేపింది. కాని ఏం చేయాలి? పదవీ విరమణ చేసిన ఒక సాధారణ ఉపాధ్యాయురాలు ఏం చేయగలుగుతుంది? ప్రపంచంలోనే అతి శక్తిమంతమైన అమెరికా ప్రభుత్వం నిర్ణయాన్ని ఎలా మార్చగలుగుతుంది? జేన్‌కు రెండు మూడు రోజులు ఆలోచనలు తెగలేదు. కాని ఏదో చేయాలనే భావన మాత్రం పోవటం లేదు.

చివరకు తనలాంటి వారిని కలుపుకొని పోవాలని నిర్ణయించింది. తొలి అడుగుగా- తన అభిప్రాయాలను అందరితోను పంచుకోవటం మొదలుపెట్టింది. దీనికి సాధనం మీడియా. స్థానిక పత్రికయిన శాన్ బెన్‌నార్డినో సన్‌కు ఒక ఉత్తరం రాసింది.. "ప్రతి ఏడాది ఉగ్రవాద కార్యకలాపాల వల్ల ఎంతమంది మరణిస్తారో.. అంత కన్నా ఎక్కువ మంది మహిళలు కాన్పులలో మరణిస్తున్నారు. సరైన వైద్య పరికరాలు లేక అంత కన్నా ఎక్కువ మంది దుర్భరమైన బాధను అనుభవిస్తున్నారు.

కిలుము పట్టిన కత్తులతో ప్రపంచవ్యాప్తంగా అనేక చోట్ల ఆపరేషన్లు జరిగిపోతున్నాయి. మన ప్రజాస్వామ్యంలో ఒక తప్పు జరిగింది. దానిని సరిచేయాలి. దాని కోసం ఒకో డాలర్ చొప్పున యుఎన్ఎఫ్‌పీఏకి పంపుదాం. 3.4 కోట్ల మంది ఒకో డాలర్ చొప్పున విరాళం ఇస్తే - 3.4 కోట్ల డాలర్లు సమకూరుతాయి..జరిగిన తప్పుకు ప్రాయశ్చితం జరుగుతుంది'' అనేది ఆ ఉత్తర సారాంశం.

జేన్ ఉత్తరం యూఎన్ఎఫ్‌పీఏ అధికారుల దృష్టికి వచ్చింది కాని దానిని వారు పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కాని సరిగ్గా అదే సమయంలో న్యూమెక్సికోకు చెందిన లూయిస్ అబ్రహాం కూడా ఈ వార్తను చదివింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మహిళలపై బుష్ నిర్ణయం చూపే ప్రభావం ఆమెకు అర్థమయింది. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చేలా చేయాలంటే ఏం చేయాలా అని ఆలోచించింది. లూయిస్ కూడా జేన్ మాదిరిగా విరాళాలు సేకరించటం వల్ల కొంత ప్రయోజనం ఉంటుందని భావించింది. దీని కోసం ఒక మెయిల్‌ను తయారుచేసి తన స్నేహితులందరికి పంపింది.

"మహిళలకు ఆరోగ్య సేవలు అందించాలనేది మానవతా దృష్టితో తీసుకోవాల్సిన నిర్ణయం. అది రాజకీయ నిర్ణయం కాదు... అందుకే దయచేసి మీరందరూ ఒక కాగితాన్ని తీసుకొని- దానిలో ఒక డాలర్ పెట్టి చుట్టండి. ఒక కవర్ మీద "34మిలియన్ ఫ్రెండ్స్..'' అని రాసి వెంటనే యూఎన్ఎఫ్‌పీఏకు పంపించండి.

మరో ముఖ్యమైన విషయం- ఈ మెయిల్‌ను కనీసం పది మందికి పంపండి.. ఎంత మందికి పంపగలిగితే అంత మంచిది'' అనేది ఆ ఉత్తర సారాంశం.
మొదటి వారం కొన్ని ఉత్తరాలు వచ్చాయి. రెండో వారానికి అవి మరింతగా పెరిగాయి. మొదట యూఎన్ఎఫ్‌పీఏ సిబ్బంది-తమ ఖాళీ సమయంలో ఉత్తరాలను విప్పి- వాటిలో ఉన్న డాలర్ నోట్లను జాగ్రత్త చేసేవారు. మూడో వారానికి పెద్ద పెద్ద మూటల నిండా ఉత్తరాలు రావటం మొదలుపెట్టాయి. మగవారు కూడా విరాళాలు పంపటం మొదలుపెట్టారు. కొందరు ఐదుడాలర్లు, మరి కొందరు పది డాలర్లు- ఇలా విరాళాల సంఖ్య పెరగటం మొదలుపెట్టింది. కొందరు ఉత్తరాలు కూడా రాసేవారు.

"ఈ ఐదు డాలర్లు నా జీవితాన్ని సుసంపన్నం చేసిన మహిళలు: మా అమ్మ, నా భార్య, నా ఇద్దరు కూతుళ్లు, నా మనమరాలు-లకు గుర్తుగా పంపుతున్నా'' అని ఒకాయన విరాళం పంపుతూ రాశాడు. ఇవన్నీ చూశాక యూఎన్ఎఫ్‌పీఏ లూయిస్, జేన్‌ల ఉద్యమ ప్రాధాన్యాన్ని గుర్తించింది. వారిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేసింది. వారిద్దరూ కలిసి - 34 మిలియన్ ఫ్రెండ్స్. ఒఆర్‌జిని స్థాపించారు. వివిధ దేశాలు తిరిగి ఉద్యమ ప్రాధాన్యం గురించి చెప్పటం మొదలుపెట్టారు.

"ఒక డాలర్ ఇవ్వలేనని ఎవరూ అనలేరు. కాలేజీ విద్యార్థులు కూడా విరాళం ఇవ్వటానికి ముందుకు వస్తున్నారు. సోడాకి పెట్టే ఖర్చుతో ఈ ప్రపంచంలో ఎక్కడో ఉన్న ఒక మహిళ జీవితం బాగుపడుతుందంటే అంత కన్నా ఏం కావాలి?'' అంటుంది జేన్. అయితే ఒబామా అధ్యక్ష పదవిని స్వీకరించిన తర్వాత 2009లో- యుఎన్ఎఫ్‌పీఏకు(బుష్ ఆపిన) 34 మిలియన్ డాలర్ల నిధులూ సమకూరుస్తామని ప్రకటించాడు. కాని అప్పటికే జేన్, లూయిస్‌ల ఉద్యమ ఫలితంగా నాలుగు మిలియన్ డాలర్లు సమకూరాయి.

అమెరికా ప్రభుత్వం ఇస్తానని ప్రకటించింది కాబట్టి- ఇక 34 మిలియన్ డాలర్ ఫ్రెండ్స్ అవసరం లేదా? అనే విషయమైతీవ్రమైన చర్చ జరిగింది. అమెరికా ప్రభుత్వం ఇచ్చే నిధులను అదనపు విరాళాలుగా భావించి వాటిని కూడా మహిళా ఆరోగ్య కార్యక్రమాలకు ఖర్చు చేయాలని లూయిస్, జేన్ నిర్ణయించారు. ఇప్పటికీ 34 మిలియన్ ఫ్రెండ్స్ కొనసాగుతూనే ఉంది.

అనేక వేల మంది విరాళాలు ఇస్తూనే ఉన్నారు. వాటి ద్వారా కొన్ని వేల మందికి సాయం అందుతోంది. ప్రతి మంచి పనికి ఎవరో ఒకరు ఇలా పూనుకుంటే ఎంత బాగుండు! 
(హాఫ్ ద స్కై.. హౌ టు చేంజ్ ద వరల్డ్ ఆధారంగా)

Monday, December 6, 2010

న్యూయార్క్‌లో దోశల బండి

కొబ్బరి చట్నీ వేసుకొని కరకరలాడే దోశలను తినేయాలని ఎవరికుండదు చెప్పండి..? మనకు దోశ తినాలనిపిస్తే ఇంటి పక్కనే ఉన్న ఏ చిన్న గల్లీలోనైనా దొరుకుతుంది. అదే అమెరికాలో అయితే అక్కడి భారతీయులందరూ దోశ కోసం మైళ్లకు మైళ్లు వెళ్లి, అక్కడున్న ఇండియన్ రెస్టారెంట్లలో దోశలను తినేవారు. కానీ, ఇప్పుడు తిరుకుమార్ కందస్వామి అమెరికా వెళ్లాక... ఆయన చుట్టూ తిరుగుతున్నారు దోశల ప్రియులు. ఎందుకంటే అతను న్యూయార్క్‌లోని వాషింగ్టన్ స్క్వేర్‌లో ఓ చిన్న దోశల బండి పెట్టాడు. ఎవరికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడివేడి దోశలను వేసి అబ్బురపరుస్తున్నాడు. భారతీయులే కాదు, అమెరికన్లు కూడా కందస్వామి దోశలను ఆవురావురుమంటూ తినేస్తున్నారట.

శ్రీలంక నుంచి న్యూయార్క్‌కు..
కందస్వామి అమెరికాలో దోశల బండి పెట్టడం దోశలు తిన్నంత సులభంగా జరిగిపోలేదు. ఆయన తమిళనాడువాసి. కుటుంబం శ్రీలంకలో స్థిరపడింది. అమ్మా, చెల్లెలు ఇప్పుడు అక్కడే ఉంటున్నారు. ఒకప్పుడు శ్రీలంకలో బైక్ రేసుల్లో పాల్గొంటూ ఎంజాయ్ చేసిన కందస్వామికి.. అమెరికా వెళ్లాక దోశలతో దశ తిరిగిపోయింది. కొన్నాళ్లు క్వీన్స్‌లోని సౌత్ ఇండియన్ హోటళ్లలో పనిచేశాడు. చెప్పుకోడు కానీ మరిన్ని చిన్నాచితక పనులు చాలానే చేశాడు. ఎలాగో కష్టపడి గ్రీన్‌కార్డు సంపాదించుకున్నాడు.

మన దేశంలో రోడ్డు పక్కన బండి పెట్టుకొని ఇడ్లీలు, దోశలు అమ్మాలంటే ఏమంత కష్టమైన పని కాదు. అప్పుడప్పుడు తగిలే పోలీసులు, మున్సిపాలిటీ వాళ్లకు అంతోఇంతో చేతిలో పెడుతుంటే ఎన్నాళ్లయినా నడిచిపోతుంది. కానీ, అమెరికాలో అలా నడవదు. రోడ్ల పక్కన ఎక్కడా చిన్న తోపుడుబండి కూడా కనిపించదు. ఒకవేళ ఉన్నా దానికి బోలెడు పర్మిషన్లు ఉండాలి. అందుకే కందస్వామి కూడా మూడున్నరేళ్లు ఆఫీసుల చుట్టూ తిరిగి తిరిగి లైసెన్సు తెచ్చుకున్నాడు.

లైసెన్సు తెచ్చుకోవడం ఒక ఎత్తయితే, దోశల బండిని తయారు చేయించడం మరో ఎత్తు. ఎందుకంటే న్యూయార్క్ నగరపాలక సంస్థ నిబంధనల ప్రకారమే బండిని చేయించాలి. దీని కోసం కందస్వామి మరో ఆరు మాసాలు కుస్తీపట్టాడు. "నాకు ముందు నుంచి అందరూ చేసే పనినే గుడ్డిగా అనుసరించడం ఇష్టముండదు. మన దేశంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ తిరిగాను. ఎక్కడ చూసినా రోడ్డు పక్కన ఇడ్లీ, దోశల బండ్లు కనిపిస్తాయి. అదే అమెరికాలో అయితే ఈ సౌకర్యం ఉండదు.

అయినా మన వాళ్లు ఎక్కడ కలిసినా దోశలు, ఇడ్లీల గురించే చర్చలు. పెద్ద హోటళ్లలో తింటే సంతృప్తి తక్కువ, బిల్ ఎక్కువ. అదే రోడ్డు పక్కన నిల్చుని, అటూఇటూ వెళ్లే మనుషుల్ని, వాహనాల్ని చూస్తూ.. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తూ తింటే ఆ మజానే వేరు. ఆ తినేదేదో అమెరికా వీధుల్లో తింటే ఇంకెంత బాగుంటుందో కదా..! అందుకే పెడితే ఇక్కడే దోశల బండి పెట్టాలనుకున్నా.

ఎంతోమందిని కలిసి, అమెరికా ప్రభుత్వ నిబంధనలను అధ్యయనం చేసి... ఈ దోశలబండిని ఈ చెట్ల కింద పెట్టాను. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా... నేను వేసిన మసాలా దోశ ఈ అమెరికాలో ఎవ్వడు వేస్తాడో చూపించండి...'' అంటూ గర్వంగా మీసాలు మెలేస్తూ.. చిరునవ్వుతో చెప్పుకొచ్చే కందస్వామిని చూసి అమెరికన్లు కూడా శభాష్ అనక తప్పడం లేదు.

మాంద్యంలో హాట్‌కేకులు
ఆర్థికమాంద్యంతో అమెరికా ఎంత నష్టపోతున్నదో కానీ, కందస్వామి మాత్రం బాగా వెనకేస్తున్నాడు. అమెరికాలోని యువతీయువకులు ఉద్యోగాలు లేక వీధుల్లో తిరుగుతున్నారు. రెస్టారెంట్‌లలో తిండి తినాలంటే కనీసం యాభై డాలర్లను వదిలించుకుంటే కానీ కడుపు నిండదు. అదే కందస్వామి దగ్గరికి వెళితే కేవలం ఆరు డాలర్లకే రుచికరమైన వేడి వేడి దోశ వేసిస్తాడు. రవ్వదోశ, మసాలదోశ, ప్లెయిన్ దోశ, పాండిచ్చేరి దోశతోపాటు ఊతప్పం, వడ... ఇలా ఎవరికి ఏం కావాలంటే అది క్షణాల్లో తయారు చేసిస్తున్నాడు.

'నాకే ఆశ్చర్యం వేస్తుంది. రోడ్ల మీద వెళ్లే వాహనాలు నా దోశ వాసన తగలగానే ఆగిపోతున్నాయి. అందులో భారతీయులకంటే అమెరికన్లే ఎక్కువ మంది ఉన్నారు. నేను దోశ వేశానంటే అదిరిపోవాలంతే. ఎప్పుడో మా అవ్వ నేర్పింది కొబ్బరి చట్నీ చేయడం. అది ఇప్పుడు పనికొచ్చింది. కొబ్బరి చట్నీతో లొట్టలేసుకుంటూ దోశలు తినేస్తున్నారు అందరూ. నాకు 45 దేశాల కస్టమర్లు ఉన్నారు. హోటళ్లు ప్రచురించే గైడ్ బుక్‌లో నా దోశల బండికీ స్థానం దక్కింది. ఫేస్‌బుక్, ఈ మెయిల్ ద్వారా కూడా దోశలు పంపమని ఆర్డర్లు వస్తుంటాయి. ఒక రోజు అమెరికాలో ఫైనాన్షియల్ టైమ్స్‌లో నా గురించి స్టోరీ పడింది.

దాన్ని చూసి లండన్‌కు చెందిన ఒకాయన నా బండి దగ్గరకొచ్చి దోశ తిని, నన్ను అభినందనలతో ముంచెత్తి మరీ వెళ్లాడు. నాకు చాలా సంతోషమేసింది. న్యూయార్క్ యూనివర్శిటీ స్టూడెంట్స్ కూడా నాకు రెగ్యులర్ కస్టమర్లు..'' అన్నాడు దోశల కందస్వామి. న్యూయార్క్‌లో ఏటా వీధి వ్యాపారులకు ఇచ్చే'వెండీ' అవార్డును (వెండర్లకిచ్చే అవార్డు) సైతం ఆయన గెలుచుకోవడం విశేషం. దోశలతో వేడి వేడిగా సంపాదిస్తున్న కందస్వామి ఇప్పుడు అమెరికాలోనే రెండో దోశల బండి పెట్టేందుకు సిద్ధమవుతున్నాడు.

దోశల సంపాదనతోనే తన ముద్దుల కూతురును కొలంబియా యూనివర్శిటీలో చదివిస్తున్నాడు. ఇంతకంటే ఏం కావాలి..? భారతీయ దోశల ఘుమఘుమలతో న్యూయార్క్ వీధులను నింపేస్తున్న కందస్వామికి మనం కూడా దోశలు సారీ, చేతులు జోడించి అభినందనలు చెబుదాం.

Sunday, November 7, 2010

ఆ దారిలో...రెండు చరిత్ర చిహ్నాలు

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గురించి కొత్తగా తెలుసుకునేది ఏముంది అనుకోవద్దు. ఆ నిలువెత్తు విగ్రహం గురించి మీరు ఎన్నోసార్లు చదివి ఉండొచ్చు కాని దాని దగ్గరకు వెళ్లే దారిలోని రెండు ముఖ్యమైన ప్రదేశాల గురించి మాత్రం చదివి ఉండకపోవచ్చు. ఒకటి ఎల్లీస్ దీవి- 400 ఏళ్ల క్రితం యూరప్ నుండి వలస వచ్చిన లక్షలాది మందిని అమెరికన్ గడ్డ మీదికి ఆహ్వానించిన ప్రదేశం. రెండోది 'సెంట్రల్ రైల్ రోడ్ న్యూజెర్సీ(సీఆర్ఆర్ఎన్‌జీ) టర్మినల్' అలా వచ్చిన వారిని అమెరికాలోని వివిధ ప్రాంతాలకు చేరవేసిన స్టేషన్..

అమెరికా అనగానే వెంటనే గుర్తుకొచ్చేది 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'. ఈ విగ్రహం వద్దకు వెళ్లాలంటే ముందు 'లిబర్టీ పార్కు'కి వెళ్లాలి. అధిక జనసాంద్రత కలిగిన న్యూజెర్సీ ప్రాంతంలో అది ఒక ఒయాసిస్. అంటే ఎడారి మ«ధ్యలో ఉండే పచ్చని ప్రదేశము. ఆ పార్కు 1212 ఎకరాల విస్తీర్ణం కలిగి ఉంది. అందులోని 'సి.ఆర్.ఆర్.ఎన్.జె. టర్మినల్' వద్దే లిబర్టీ విగ్రహం దగ్గరకు వెళ్లేందుకు టిక్కెట్ కొనాలి. ఫెర్రీ ద్వారా లిబర్టీ ద్వీపానికి, ఎల్లీస్ ద్వీపానికి హడ్సన్ నది గుండా ప్రయాణించాలి. మా అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజనీరుగా 12 సంవత్సరాల నుంచి అమెరికాలో ఉంటున్నా, శ్రీవారి వృత్తి రీత్యా వెసులుబాటు కాక ఈ సంవత్సరము జులైలో అక్కడికి వెళ్లడం జరిగింది. మా అబ్బాయి ఉండే న్యూజెర్సీలోని చెష్టర్ ఫీల్డు ప్రాంతం నుంచి లిబర్టీ పార్కుకు ఒక గంట డ్రైవ్. లిబర్టీ పార్కులోని సి.ఆర్.ఆర్.ఎన్.జె. టెర్మినల్ నుంచి ప్రతి అరగంటకి ఫెర్రీలు ఉంటాయి. మొదటి ఫెర్రీ ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరుతుంది.

మేము టిక్కెట్ కొని లోపలికి వెళ్లి లైనులో నిలుచున్నాము. అక్కడ మగవాళ్లంతా సాక్సు, షూస్, బెల్టు, పెన్, సెల్ మొదలైన వస్తువులు తీసి ఒక ట్రేలో పెట్టాలి. ఆడవారు సాక్సు, షూస్‌తో పాటు హెయిర్ క్లిప్స్, చేతికున్న గాజులు కూడ తీసి ట్రేలో పెట్టాలి. తరవాత మెటల్ డిటెక్టర్‌తో మగవారిని మగవారు, ఆడవారిని ఆడవారు జాగ్రత్తగా పరిశీలిస్తారు. తరవాత ట్రేలో ఉన్న వస్తువులను స్కాన్ చేసి ఇచ్చేస్తారు. ఎవరి వస్తువులు వాళ్లకి వచ్చాక ఫెర్రీ ఎక్కేందుకు మళ్లీ లైన్లో నిలుచోవాలి. ఫెర్రీలో కిందా, పైనా సీట్లు ఉంటాయి. అక్కడి నుంచి ఎల్లీస్ ద్వీపానికి పది నిమిషాల ప్రయాణం.

ఎల్లీస్ ద్వీపం

ఈ ద్వీపం హడ్సన్ నదిలో ఒక ఇసుక దిబ్బ. మన్‌హట్టన్‌కి సరిగ్గా దక్షిణ వైపు ఉంది. ఇక్కడ ఒకనాడు 'మెహెగన్ ఇండియన్‌లు' ఉండేవారు. అప్పట్లో ఇది 'కి యెష్కు ఐలాండ్'గా పిలువబడేది. యు.ఎస్.ఎ ఏర్పడ్డాక 'ఎల్లీస్ శామ్యూల్' అనే వ్యాపారవేత్త ఈ ద్వీపాన్ని కొని తన పేరు పెట్టుకున్నాడు.
ఉత్తర, పశ్చిమ యూరప్ దేశాల నుంచి జర్మనీ, ఐర్లాండ్, బ్రిటన్ దేశాల నుంచి ప్రజలు ఇక్కడికి పెద్ద ఎత్తున వలసలు వచ్చారు. యుద్ధాల వల్ల కావచ్చు, మతవైషమ్యాల వల్ల కావచ్చు, కరువుకాటకాల వల్ల కావచ్చు... కారణము ఏదైౖనా కానీ వాళ్లందరూ ఎన్నో వ్యయప్రయాసాలకోర్చి అట్లాంటిక్ సముద్రం దాటి తమ అదృష్టాన్ని వెతుక్కుంటూ కొత్త ప్రపంచాన్ని నిర్మించుకునేందుకు ఈ ద్వీపాన్ని చేరేవారు.

ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్

ఎల్లీస్ ద్వీపంలో ప్రభుత్వం వారు రెండు గృహాలను నిర్మించి వాటిలో అంటువ్యాధుల వారిని, మానసిక రోగులను ఉంచేవారు. ఆరోగ్యపరంగానూ, చట్టపరంగానూ అర్హత కలిగిన వారికే వీసా ఇచ్చి అమెరికాలోకి ప్రవేశం కల్పించేవారు. ఆ విధంగా 1892లో 'ఫెడరల్ ఇమిగ్రేషన్ స్టేషన్' ప్రారంభించడం జరిగింది. వలస వచ్చిన వారు తమతో తీసుకొచ్చి వదిలేసిన తట్టలు, చెక్కసామాను, ఇనుప పెట్టెలు మొదలైన వాటిని సందర్శకుల కోసం ఒక పెద్ద హాలులో ప్రదర్శనకు ఉంచారు. ముఖ్యంగా 1900- 1914 మధ్యకాలంలో వలసల సంఖ్య రోజుకి 5000 నుంచి 10000 వరకు ఉండేదట.
వలసలు తగ్గుముఖం పట్టడం, వలసల సంఖ్య పరిమితం చేయడం వలన కూడా 1954లో ఇమిగ్రేషన్ స్టేషన్‌ని మూసేశారు. ఎల్లీస్ ద్వీపానికి వలస వచ్చినవారి వివరాలతో, సంతకాలతో ఒక పట్టిక అందుబాటులో ఉంది. ఇప్పటికీ అనేక మంది తమ తమ పూర్వీకుల వివరాలు తెలుసుకునేందుకు ఎల్లీస్ ద్వీపానికి వెళ్తుంటారు. 1960 ప్రాంతాల్లో ఆసియా నుంచి అమెరికాకి వలస వెళ్లిన వారి సంఖ్య మిగతా దేశాల కంటే ఎక్కువగా ఉన్నట్లు అక్కడున్న ఒక పట్టిక తెలియజేస్తుంది.

ఎల్లీస్ ద్వీపంలో వీటిని చూసిన తరవాత మరల ఫెర్రీ ఎక్కాము. అదే టిక్కెట్‌తో ఫెర్రీలో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ దగ్గరికి ప్రయాణం చేయవచ్చు. రకరకాల దేశాలవారితో, రకరకాల మనుష్యులతో ఆ ప్రయాణం భలే సరదాగా సాగిపోయింది. పదిపదిహేను నిమిషాల్లో లిబర్టీ ద్వీపము చేరాము. అక్కడ నుంచి చూస్తే విగ్రహం వెనక మన్‌హట్టన్, బ్రాక్‌లిన్ బ్రిడ్జీ కనిపిస్తాయి.

స్టాట్యూ ఆఫ్ లిబర్టీ

సంప్రదాయబద్ధమైన పొడవైన వస్త్రాన్ని నిండుగా ధరించిన స్త్రీమూర్తి విగ్రహం అది. కుడిచేతిలో పైకి ఎత్తి చూపుతున్న 42 అడుగుల పొడవున్న జ్యోతి, ఎడమ చేతిలో అమెరికాకి స్వాతంత్య్రం ప్రకటించిన 4 జూలై 1776 వ తేదీతో రాయబడిన రాతి శాసనం, మెడలో విరిగిన హారము (ఇది బానిసత్వపు వలస పరిపాలనా శృంఖలాల నుంచి విముక్తికి సూచన) తలపై మిరిమిట్లు గొలుపుతూ మొనదేలిన ఏడు కిరణాలతో (ఈ ఏడు కిరణాలు సప్త సముద్రాలకు, సప్త ఖండాలకు సూచన) మెరిసే కిరీటంతో మూర్తీభవించిన స్త్రీమూర్తి విగ్రహం అది.

నాలుగు స్టీలు స్తంభాలపై నిర్మించిన ఇనుప చట్రం, దానిపైన రాగి కవచము. ఈ విగ్రహాన్ని నిర్మించాలన్న ఆలోచన 1865లో ఫ్రెంచ్ లా ప్రొఫెసర్, రాజకీయనాయకుడైన 'డెలిబొలె'కి రాగా, శిల్పకారుడైన 'బర్తోల్టి' అతని ఆలోచనకు ఉత్తేజితుడై కార్యరూపం ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. పారిస్‌లోని ఈఫిల్ టవర్‌ను నిర్మించిన చీఫ్ ఇంజనీరు 'గస్టవే ఈఫిల్'యే ఈ లిబర్టీ విగ్రహాన్ని కూడా నిర్మించాడు. ఫ్రాన్స్, అమెరికా దేశాల ఉమ్మడి కృషిగా తయారైంది ఇది. విగ్రహం నిలుచున్న దిమ్మ నిర్మాణం అమెరికా చేపట్టగా, విగ్రహాన్ని ఫ్రెంచివారు తయారు చేశారు. అమెరికన్ విప్లవంలో మరణించిన సైనికుల స్మృతి చిహ్నంగా ఫ్రాన్స్ ప్రజలు ఇరు దేశాల మధ్య స్నేహ సౌభ్రాతృత్వాలను పెంపొందించుకునేందుకు 1886 అక్టోబర్ 28 వ తేదీన దీన్ని అమెరికా ప్రజలకు కానుకగా ఇచ్చారు. ఈ విగ్రహాన్ని 350 భాగాలుగా 214 పెట్టెల్లో ఉంచి ఫ్రాన్స్ నుంచి న్యూయార్క్ హార్బర్‌కు నౌకలో పంపారు. న్యూయార్క్ హార్బర్‌లో ఈ విడిభాగాలను తిరిగి ఏక విగ్రహముగా అమర్చారు. దీని ఎత్తు 151 అడుగులు, విగ్రహం పెట్టిన దిమ్మె ఎత్తు 154 అడుగులు. మొత్తం కలిపి 305 అడుగులు. దిమ్మె 11 కోణాలు కలిగిన నక్షత్రం ఆకారంలో ఉండగా, గోడలు గ్రానైట్ రాతితో నిర్మించబడ్డాయి. దిమ్మె చుట్టూ ఇనుప కంచె ఉంటుంది. దిమ్మె ద్వారము నుంచి పైన కిరీటం వద్దగల అబ్జర్వేటరీ వరకు వెళ్లేందుకు మెట్లు ఉన్నాయి. పై వరకు వెళ్లాలంటే విడిగా టిక్కెట్ తీసుకోవాల్సి ఉంటుంది.

- 1912లో ఫ్రెడరిక్ అనే అతను విగ్రహం జ్యోతి వద్ద గల అబ్జర్వేటరీ ఫ్లాట్‌ఫామ్ నుంచి 75 అడుగుల పొడవున్న పారాచ్యూట్ ద్వారా దిగ్విజయంగా క్రిందికి దూకాడు.
- 1929లో రాల్ఫ్ గ్లేసన్ అనే వ్యక్తి విగ్రహం కిరీటం వద్దనున్న కిటికీలోంచి బయటకు చూసి తిరిగి వస్తున్నప్పుడు కాలుజారి కిందపడి మరణించాడు.
- 1982లో ఒక గర్భవతి విగ్రహం పైకి వెళ్లేందుకు మెట్లు ఎక్కుతుండగా పురిటినొప్పులు వచ్చి అక్కడే ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఇలా విగ్రహానికి సంబంధించి సంతోషకరమైన, విచారించదగ్గ సంఘటనలు చాలా ఉన్నాయట. ఈ విగ్రహాన్ని చూసిన తరవాత లిబర్టీ హౌస్ రెస్టారెంట్‌కి వెళ్లాము. ఆ దేశంలో ఏదైనా ముఖ్యమైన ప్రదర్శనా స్థలానికి వెళ్లినప్పుడు బయటికి వచ్చే మార్గంలో గిఫ్టు షాపింగ్ ఉంటుంది. అది వారి సంప్రదాయ. రెస్టారెంట్‌లో ఆహారం తీసుకున్న వారికి లిబర్టీ బొమ్మల కొనుగోలులో కొంత రాయితీ ఇస్తారు. ఇవన్నీ వ్యాపార మెళకువలు.
దారిలో బర్తోల్టి, ఈఫిల్, పులిట్జర్, కొలంబస్, జెఫర్‌సన్, జార్జి వాషింగ్టన్ మొదలైన ప్రముఖుల విగ్రహాలు ఉన్నాయి.

డబ్ల్యుటిసి చూడలేకపోయాం

ఫెర్రీ ఎక్కేందుకు రెండు క్యూలు ఉన్నాయి. ఒకటి న్యూయార్క్ వైపు వెళ్లేందుకు, రెండోది న్యూజెర్సీ వైపు వెళ్లేందుకు. మేము న్యూజెర్సీ వైపు వెళ్లే ఫెర్రీ ఎక్కాము. అమెరికాలో మే, జూన్, జులై నెలల్లో విపరీతమైన ఎండలు. 40 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత ఉంటుంది. వేడి, చురుకుదనం ఎక్కువగా ఉండడం వల్ల కొత్త వారికి తప్పకుండా తలనొప్పి వస్తుంది. లిబర్టీ ద్వీపమంతా ఎండలో తిరిగిన కారణంగా, ఫెర్రీ బయలుదేరగానే హడ్సన్ నది నుంచి వచ్చే చల్లటిగాలి తనువును తాకి సేదతీరినట్టయింది. హడ్సన్ నది పరవళ్లు, ఫెర్రీ శబ్దం రెండూ కలిసి విచిత్రంగా అనిపించింది. సహజంగానే పిల్లలకి నీళ్లంటే ఇష్టం కదా. ఆ సమయంలో మా మనవడి సంతోషానికి అవధులు లేవు.

నదిలో ప్రయాణించే ఆ ఇరవై నిమిషాలూ ప్రకృతి దృశ్యాలను చూస్తూ మంత్రముగ్దులయిపోతాము. అలా వెళ్తుంటే న్యూయార్కు వైపు మన్‌హటన్‌లోని పెద్దపెద్ద భవనాలు ఆకాశహర్మ్యాలను తలపింపజేస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అంత ఎత్తైన భవన సముదాయాల మధ్యే 2001 సెప్టెంబర్ 11న ముష్కరుల చేతిలో ధ్వంసమైన 'వరల్డ్ ట్రేడ్ సెంటర్' ఉండేది గదా, దాన్ని చూడలేకపోయామే అని ఒకింత నిరాశ కలిగింది. స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చూడాలన్న ఆతృతలో సి.ఆర్.ఆర్.ఎన్.జె. అంటే ఏమిటనిగానీ, అక్కడ రైలు పట్టాలు ముళ్లపొదలతో, పిచ్చి మొ క్కలతో నిండివుండడం గాని గమనించలేదు. 'ఈ రైలు పట్టాలు ఏమిటని' తిరిగి వచ్చేటప్పుడు మా అబ్బాయిని అడిగాను.

"ఇది 'సెంట్రల్ రైల్ రోడ్డు న్యూజెర్సీ టెర్మినల్'. 1600 సంవత్సరంలో యూరప్ దేశాల నుంచి మూకుమ్మడిగా వలసలు వచ్చిన తరుణంలో దీని కార్యకలాపాలు అధికంగా ఉండేవి. న్యూయార్క్ హార్బరు ప్రధాన రవాణా కేంద్రంగా ముఖ్య భూమిక వహించింది. క్రమంగా ఇతర దేశాల నుంచి వలసలు తగ్గుముఖం పట్టడం, పారిశ్రామిక విప్లవం ఉధృతం కావడం, నగరాల్లో రోడ్డు మార్గాలు, ఆనకట్టలు అభివృద్ధి చెందడం మూలంగా 1950 నాటికి సి.ఆర్.ఆర్.యన్.జె. టెర్మినల్ కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి 1967 నాటికి పూర్తిగా ఆగిపోయాయి. ఎంతో చరిత్ర కలిగిన ఈ స్టేషన్‌ను గత చరిత్ర స్మృతి చిహ్నంగా ఉంచేందుకు 1968లో జెర్సీసిటీ 156 ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇచ్చింది. 1976 జూన్ 14న న్యూజెర్సీ ప్రభుత్వం లిబర్టీ పార్కుని ద్విశతాబ్ది కానుకగా జాతికి అంకితమిచ్చింది'' అని చెప్పుకొచ్చాడు.

న్యూయార్క్ హార్బరు లిబర్టీ పార్కుకి ఉత్తర దిశగా ఉంది. అప్పటి సేవలకు గుర్తుగా ఒక రైలు ఇంజను, కొన్ని పెట్టెలు లిబర్టీ పార్కులో పర్యాటకుల సందర్శనార్థం ఉంచారు.
ఎంతోమంది దేశవిదేశీయులను ఆకర్షిస్తూ ప్రపంచంలోని వింతలలో ఒకటైన లిబర్టీ విగ్రహాన్ని దర్శించడం గొప్ప మధురానుభూతిగా మిగిలిపోయింది నా మనస్సులో శాశ్వతంగా.

- అవ్వా విజయలక్ష్మి, బచ్చుపేట, మచిలీపట్నం

Wednesday, October 27, 2010

అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ .... యూఎఫ్‌ఓ


యు.ఎఫ్.ఓ...డిన్నర్ పళ్లెం
ఎగిరే పళ్లేలలో ఏలియన్లు వస్తున్నారు...మనతోపాటు మన ఇంట్లో డైనింగ్ టేబుల్‌పై డిన్నర్ చేసేందుకు!
అవును ఆ రోజులు ఎంతో దూరంలో లేవు! అమెరికన్లు వారి కోసం సిద్ధమవుతున్నారు... వారికి ఐక్యరాజ్యసమతి స్వాగత సన్నాహాలు చేస్తోంది. ఇక మనం కూడా డిన్నర్ పళ్లేలను ఫలహారాలతో నింపి స్వాగతిద్దామా...!


సరిగ్గా నెల క్రితం ఐక్యరాజ్యసమితి ఒక వింత ప్రకటన చేసింది. యాభై ఎనిమిదేళ్ల ఆస్ట్రోఫిజిసిస్ట్ మజ్లన్‌ఆథ్‌మన్ ఇక పై అంతరిక్షానికి దౌత్యవేత్తగా వ్యవహరిస్తారంటూ ఆ ప్రకటన సారాంశం. ‘అంతరిక్షానికి దౌత్యవేత్త ఏంటి?’ అన్న ప్రశ్నకు సమాధానంగా... ఒకవేళ గ్రహాంతరవాసులు గనుక భూమికి వస్తే ‘ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్’ (మొట్టమొదటగా కలవవలసిన మనిషి) మజ్లన్ ఆథ్‌మన్ అని తేల్చిచెప్పింది ఐక్యరాజ్యసమితి! ఈ వార్త ఎంతోమందిని విస్తుపోయేలా చేస్తే, ఇంకెంతోమందిని నవ్వుకునేలా చేసింది.
‘ఇది నిజంగా జరిగే పనేనా?! ఉన్నట్టుండి ఇంత అర్జెంట్‌గా ఇలాంటి ప్రకటన వెలువడడానికి కారణం ఏంటీ..?’ ఆలోచించాల్సిన విషయమే!!!

అక్టోబర్ 13, 2010 న్యూయార్క్ సిటీలోని చెల్సీ ప్రాంతవాసులు ఒక్కసారిగా రోడ్డు మీదకి పరుగుతీశారు. అది ఏ భూకంపం నుంచో తప్పించుకోవడానికి కాదు... ఆకాశంలో గుండ్రంగా తిరుగుతున్న సాసర్ల లాంటి వస్తువులు, తెల్లని కాంతిలో మెరిపోతూ కళ్లకు కనిపించేటంత దూరంలో తిరగాడుతుండటమే దానికి కారణం. అక్కడి టివీ ఛానల్ 7 కెమెరాలు ఈ వింతని బంధించటమే కాదు దీనిపై స్పందించమని ఎఫ్‌ఏఏ (ఫెడరల్ ఏవియేషన్ అసోసియేషన్) వారిని కోరింది. అయితే వీటివల్ల విమానాల రాకపోకలకు ఎటువంటి అంతరాయం కలగలేదని మాత్రమే ఎఫ్‌ఏఏ ప్రకటన విడుదల చేసింది. అంతకు మించి ఎటువంటి సమాచారాన్ని బయటకి పొక్కనివ్వలేదు. కాని ఆ రోజు అక్కడ జరిగింది ఓ ‘యుఎఫ్‌ఓ సైటింగ్.’ అంటే... ఆ రోజు ఆకాశంలో గుర్తుతెలియని ఎగిరే పళ్లేలను ప్రజలు చూశారు. అన్‌ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్‌గా పేర్కొనే వాటికి సంక్షిప్తరూపమే ఈ... యూఎఫ్‌ఓ.

జులై 7, 2010 చైనాలోని ఝీజియాంగ్ ప్రాంతంలోని ఎయిర్‌పోర్టులో విమానం ఎక్కుతున్న ప్రయాణికులను ఉన్నట్టుండి ఆపేశారు. అంతే కాదు ఎయిర్‌పోర్ట్‌లో విమానాల రాకపోకలను గంటపాటు నిలిపివేశారు. కారణాలు చెప్పలేదు. దీనికి కారణం ఆకాశంలో కనిపించిన గుర్తుతెలియని వస్తువని తర్వాత తెలిసింది. సుమారు గంటపాటు జరిగిన ఈ ప్రక్రియ అధికారులకు తెలిసే జరిగినా ప్రభుత్వం మాత్రం దీని తదనంతరం ఎటువంటి సంజాయిషీ ఇవ్వలేదు. ఇది జరగడానికి కొన్ని గంటల పూర్వం ఆకాశంలో మెరుస్తున్న పొడవాటి వస్తువుని చూశామని ఆ ప్రాంతవాసుల ప్రత్యక్ష కథనం.

ఇవి రెండూ ఈ ఏడాది ప్రపంచం రెండు వైపులా జరిగిన యుఎఫ్‌ఓ సైటింగ్స్. పైగా వీటికి ప్రత్యక్ష సాక్షులతో పాటు టీవీ కెమెరాల బంధించిన ఫుటేజ్ మరింత బలమైన సాక్ష్యం. దానికి తోడు అటు ప్రభుత్వం నుంచి కాని, ఇటు శాస్తవ్రేత్తల నుంచి కాని ఎటువంటి వివరణ లేకపోవటం ఈ సైటింగ్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీవీ కెమెరాలకు కూడా చిక్కిన ఈ అంతుపట్టని వస్తువుల వెనక రహస్యం ఏంటి? ఇవి కేవలం ట్రిక్ ఫొటోగ్రఫీ ద్వారా నిజంగా జరిగినట్టు భ్రమ కల్పిస్తున్నారా? మరప్పుడు ప్రత్యక్షసాక్షుల మాటేమిటి? ప్రభుత్వాలు ప్రజలకు తెలియకుండా ఏం దాస్తున్నాయి? ఒకవేళ ఆ సాసర్లు నిజంగా కనపడితే అవి ఎక్కడ నుంచి వస్తున్నాయి? ఎవరు వీటిని పంపిస్తున్నారు? వీటిలో గ్రహాంతరవాసులు మన లోకాన్ని చూడడానికి వస్తున్నారా? ఒక వేళ అదే నిజమైతే అవి మనలని కలవడానికి ఎందుకు ప్రయత్నం చేయటంలేదు? లేదా మన ప్రపంచం మీదకి దాడికి సిద్ధపడుతూ రెక్కీ చేయటానికి వస్తున్నారా? లాంటి ప్రశ్నలకి జవాబు లేనందువల్లనేమో వీటి పట్ల మరింత ఆసక్తి ప్రజల్లో నెలకొంది.

మొట్టమొదటి యుఎఫ్‌ఓ సైటింగ్.
యుఎఫ్‌ఓ సైటింగ్ ఈ మధ్యలో మొదలైన ప్రక్రియ కాదు. ఇలాంటిది మొట్టమొదట చూసిన దాఖలా ఆగస్టు 12, 1886 లో జరిగింది. బోనిల్లా అనే ఓ ప్రముఖ ఖగోళ శాశ్త్రవేత్త సూర్యుడిపై పరిశోధనలు జరుపుతున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 283 గుర్తు తెలియని గుండ్రని ఆకారాలను ఆకాశంలో తిరగాడుతూ ఉండటాన్ని గమనించాడు. వాటిని ఫొటోలు కూడా తీశాడు. వీటికి సంబంధించినంత వరకూ మొదటి ఫోటో ప్రూఫ్ ఇదే. అది మొదలు... నేటి వరకూ తరచూ వీటికి సంబంధించిన సమాచారం ‘అదిగో పులి అంటే, ఇదిగో తోక’ చందాన బైటకి వస్తూనే ఉంది.

చూడటం వరకూ ఓకే... కాని వీటివల్ల హాని కలగవచ్చనే భయం అక్టోబర్ 10, 1886లో మొదటిసారిగా కలిగింది. వెనిజులా దేశంలో మరకైబో నగరంలో జరిగిన వింతైన సంఘటన ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. తుఫాను సమయంలో ఆకాశాన ‘ఝుమ్‌మ్‌మ్‌మ్....’మంటూ శబ్దం చేస్తూ తిరుగాడుతున్న ప్రకాశవంతమైన వస్తువు ఓ గుడిసె వద్ద కనిపించింది. కొంతసేపు అక్కడే తచ్చాడిన ఆ వస్తువు తరవాత ఆకాశంలోకి అదృశ్యం అయిపోయింది. తరవాత ఆ గుడిసె చుట్టు కనిపించిన దృశ్యమే అందరినీ భయభ్రాంతులకి గురిచేసింది. గుడిసె చుట్టూ చెట్టూ చేమా పూర్తిగా కాలి బూడిదై కనిపించింది. అంతేకాదు ఆ గుడిసెలో నివసించే వారు రేడియేషన్ పాయిజనింగ్‌కి గురైనట్టు కూడా తరవాత జరిపిన పరీక్షల్లో తేలింది.

అది మొదలు వీటికి సంబధించినంతవరకూ ఎన్నో కథలు పుట్టుకొచ్చాయి. ఈ కథలన్నీ ఏ ఒక్క ప్రాంతానికో పరిమితం కాలేదు. ప్రపంచ వ్యాప్తంగా వీటిని చూసిన ప్రత్యక్ష సాక్షుల కథనాలు కొట్టి పడేయడానికి వీలు లేకుండా ఉన్నాయి. ఎక్కువగా ఎగిరే పళ్లేల ఆకారంలో ఇవి కనిపించినా వీటిని కోడిగుడ్డు ఆకృతిలో చూసిన వారూ ఉన్నారు. ఆకారం ఏదైనా కళ్లు చెదిరిపోయే తెల్లటి కాంతిని ప్రత్యక్షంగా చూసిన ప్రతీ ఒక్కరూ గమనించారు. కొంతమందికి ఇవి రంగుల లైట్లతో కూడా దర్శనమిచ్చాయి.

టార్గెట్ అమెరికా!
బాగా అభివృద్ధి చెందిన దేశమనో ఏంటో కాని అమెరికా దేశాన్ని సందర్శించే యూఎఫ్‌ఓల సంఖ్య ఎక్కువనే చెప్పాలి. ముఖ్యంగా 1940-60 ప్రాంతంలో యుఎఫ్‌ఓ సైటింగ్స్ ఎక్కువగా అమెరికాలోనే చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా అమెరికాకు చెందిన సైనిక స్థావరాల పై ఇవి తిరుగాడుతున్నాయన్న విషయంపై ప్రభుత్వం ఒక అధికారిక పరిశోధన (ఇన్వెస్టిగేషన్) ప్రారంభించింది. 1948 జనవరి 7న ఫోర్ట్‌నాక్స్, కెంటకీ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఒక్కసారిగా ఉత్కంఠత నెలకొంది. ఆకాశంలో ఏదో గుర్తుతెలియని వస్తువు తిరుగుతోందన్న వార్త తెలిసిన వెంటనే ఫైటర్ జెట్ దాన్ని వెంబండించటానికి నింగిలోకి ఎగిసింది. కాని ఈ జెట్ మళ్లీ తిరిగి రాలేదు. దానిలోని ఫైటర్ పెలైట్ మృత్యువాత పడ్డాడు. కారణాలు బైటకి రాలేదు. 1952 లో వరుసగా రాడార్‌పై కనిపించిన ఈ యుఎఫ్‌ఓలు అక్కడ దేశవ్యాప్తంగా మొదటిపేజీ ప్రధాన కథనంగా మారాయి. దాంతో ఈ విషయాలను దర్యాప్తు చేయాల్సిందిగా అక్కడి ప్రభుత్వం సిఐఏకు కేసు అప్పగించింది. అయితే ఈ సంగతులేవీ బైటకి పొక్కకుండా జాగ్రత్త పడింది.

మానవులతో కాంటాక్ట్
1957లో బ్రెజిల్ దేశానికి చెందిన ఆంటోనియో విల్లాస్ బోయాస్ అనే వ్యక్తి రాత్రి పూట పని పూర్తి చేసుకొని, నిర్మానుష్యంగా ఉన్న రోడ్డుపై కార్లో రేడియో వింటూ ఇంటికి వెళ్తున్నాడు. సడెన్‌గా రేడియో వింత వింత శబ్దాలు చేయటం మొదలు పెట్టింది. కారు ఉన్నట్టుండి ముందుకి వెళ్లనని మొరాయించింది. ‘ఏంటా?’ అని ఆలోచిస్తున్న ఆంటోనియో కళ్లు తిరిగిపోయే దృశ్యాన్ని చూశాడు. కారుకి ఎదురుగా పెద్ద శబ్దం చేస్తూ ఆకాశంలో వెలిగిపోతూ పళ్లెం ఆకారంలో స్పేస్‌షిప్‌ని పోలిన వస్తువొకటి కనపడింది. జరిగిన దాన్నుంచి తేరుకునేలోగానే ఎగిరే పళ్ళెం లాంటి వస్తువులో వచ్చిన ఏలియన్లను పోలిన వ్యక్తులు అతనని బంధించి తీసుకువెళ్ళారు.

ఆంటోనియా కథనం ప్రకారం ఆ స్పేస్‌షిప్‌లో అత్యంత ఆధునాతన సైన్స్ లెబొరేటరీ ఉందని... అందులో ఉన్న ఏలియన్లు అతడిని బల్లమీద పడుకోబె ట్టి వింత వింత ఉపకరణాలతో అతనిపై రకరకాల పరీక్షలు జరిపారని తెలిపాడు. పరిశోధనల అనంతరం అతడిని తిరిగి భూమి పైన వదిలేసి వెళ్లిపోయారు. ఆంటోనియో మాటల్లో సత్యం ఉందనటానికి అతని శరీరంపై అంతకుముందులేని మచ్చలు హటాత్తుగా ప్రత్యక్షమవ్వటమే. ఇవి ఏలియన్లు అతనిపై పరిశోధనలు జరిపారనటానికి సాక్ష్యంగా నిలిచాయి. ఇది మొదలు ఇలాంటి అనుభవాలు ఎదుర్కొన్న వ్యక్తులు మరికొంతమంది ముందుకు వచ్చారు. వీటిని పరీక్షించిన డాక్టర్లు ఇవి ఎంతో అత్యాధునికమైన (సొఫెస్టికేటెడ్) పరికరాలతో, ఎంతో నైపుణ్యం ఉన్న డాక్టర్లు మాత్రమే చేయగలిగినవిగా గుర్తించారు.
- కె. ఎం

ప్రత్యక్ష సాక్షి


1969లో జార్జియా రాష్ట్రానికి గవర్నర్‌గా పని చేస్తున్నప్పుడు లీరీ అనే పట్టణం దగ్గర్లో తాను యుఎఫ్‌ఓను చూశానని అమెరికన్ ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ చెప్పిన ఉదంతం ‘జిమ్మీ కార్టర్ యుఎఫ్‌ఓ ఇన్సిడెంట్’గా ప్రఖ్యాతి గాంచింది. ఈ విషయమై అతను 1973లో ఇంటర్నేషనల్ యుఎఫ్‌ఓ బ్యూరో అభ్యర్థన మేరకు ఒక రిపోర్ట్‌ను కూడ ఫైల్ చేశారు. తాను చూసిన వస్తువు తెల్లని కాంతితో మెరిసిపోతూ ఏలియన్ స్పేస్‌క్రాఫ్ట్‌ను పోలి ఉందని ఆ రిపోర్ట్‌లో కార్టర్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆ రోజు అక్కడే కార్టర్‌తో ఉన్న మరో పదకొండు మంది వ్యక్తులు కూడా ధృవీకరించారు. దాదాపు 10 నిముషాల పాటు రంగుల కాంతులని చిందించిన ఆ వస్తువు తిరిగి ఆకాశంలో అదృశ్యం అయిపోయిందన్నది వీరి కథనం.

క్రాప్ సర్కిల్స్... పొలాల్లో యుఎఫ్‌ఓలు
అమెరికాలోని క్యాన్సెస్ రాష్ట్రంలో రైతులు ఓ కొత్త తరహాలో యుఎఫ్‌ఓల ఉనికిని గుర్తించారు. ఉదయం లేచేటప్పటికి పొలాల్లో ఎంతో నైపుణ్యంతో ఎవరో చేసినట్టు గుండ్రని వలయాలు దర్శనమిచ్చాయి. ఇదేం పెద్ద విషయం కాదనుకునే వారికి ఆ వలయాలు ఒక్కొక్కటి కొన్ని మీటర్ల పొడవుతో ఉండటమే కాదు అవి ఏర్పడిన చోటు గడ్డి మొత్తం కాలిపోయి ఉంది. అలాంటి ఒక వలయం చేయడానికి మనుషులకి కనీసం 9-10 గంటల సమయం పడుతుంది.

అది కూడా ఏదైనా మిషన్ సహాయంతో! కాని అక్కడ దర్శనమిచ్చినవి ఒకటి రెండు వలయాలు కాదు... దాదాపు 10 వరకు ఉన్నాయి. అంటే ఒకవేళ మానవమాత్రులు పూనుకుని వాటిని రూపొందించాలన్నా వాటిని తయారు చేయడానికి ఒక రాత్రి సరిపోదు! అంతేకాదు అక్కడి రైతులకి తమ పశువుల్లో కొన్ని గల్లంతవడం, మరికొన్నింటి అవయవాలు తీసేసి వాటి కళేబరాలు మాత్రం పడేయడం వారిలో ఆశ్చర్యాన్ని, భయాన్ని కలిగించాయి. పరిశోధనల తరవాత తేలిన విషయం ఏంటంటే ఆ వలయాకృతులు మానవులు రూపొందిచలేరనీ... ఏవో చాలా బరువైన వేడి వస్తువులు అక్కడ వాలినందుకే అవి ఏర్పడ్డాయని తెలిసింది. కాని అవేమిటో ఇప్పటికీ ఎవరికీ అంతుచిక్కలేదు.

అంతా ట్రాష్...

‘గ్రహాంతరజీవులా, ఫ్లయింగ్ సాసర్లా... అంతా ట్రాష్!’ అంటూ కొట్టి పడేసే వారూ ఉన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు వేరే దేశాల పైకి వేగుల్లాగా, గూఢచారిగా పనిచేయడానికి వాడే విమానాలకు ‘ఎగిరే పళ్లేలు’ అని పేరు పెట్టారన్నది వీరి వాదన. అందుకే వీటి వెనకాల అంత రహస్యం అంటారు. కాని ఈ యుఎఫ్‌ఓ లను చూసినవారిలో సామాన్య ప్రజలే కాదు, శాస్తవ్రేత్తలు, పోలీస్ అధికారులు, పెలైట్లు. సమాజంలో బాధ్యాతాయుతమైన వృత్తుల్లో ఉన్నవారు, అంతెందుకు అమెరికా ప్రెసిడెంట్ జిమ్మీ కార్టర్ కూడా ఉన్నారంటే... ఇవి ఉన్నాయనే కదా అర్థం?!

పి.ఎస్: 2005, ఏప్రిల్7న అమెరికా ప్రెసిడెంట్ నివాసమైన వైట్ హౌస్‌ని యుఎఫ్‌ఓ సైటింగ్ కారణంగా ఖాళీ చేయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2007, మార్చి 7న లో మన దేశ ప్రధాని నివాసం దగ్గర రెండు యుఎఫ్‌లో దర్శనమిచ్చాయి.