Monday, January 31, 2011

అత్యంత విలువైన ఐదు వజ్రాలు!

ఆదిమానవుల కాలంలో వజ్రం అంటే ఏమిటో దాని విలువ ఏమిటో ఎవ్వరికీ తెలీదు. నాగరకత పెరుగుతున్న కొద్దీ ఆభరణాల వాడకంలో వజ్రానికీ విలువ పెరిగింది. వజ్రాన్ని సానబట్టే కొద్దీ, దాని ఆకారం చిన్నదైన కొద్దీ విలువ రెండింతలవుతుంటుంది. అదీ వజ్రం గొప్పదనం.

వాస్తవానికి వజ్రానికి నిర్దిష్టమైన రంగు అంటూ ఉండదు. కాని మన కంటికి కనిపించే దానిని ఆధారం చేసుకుని అవి ఆయా రంగుల్లో ఉన్నట్లు భావిస్తాం. ఒకప్పుడు ప్రపంచంలో ఎక్కడా లేనంత విలువైన వజ్రాలు భరతమాతకు అలంకారంగా ఉండేవి. ఆంగ్లేయుల పరిపాలన కాలంలో... ప్రపంచంలోకెల్లా అతి విలువైన వజ్రాలు బ్రిటన్‌కు తరలివెళ్లాయి. అవన్నీ ఇప్పుడు వారికి పేరుప్రఖ్యాతులు తెచ్చిపెట్టాయి. నవరత్నాలలో వజ్రానిది అగ్రస్థానం. వజ్రపుటుంగరం ధరించడమంటే అది రాజరికానికి చిహ్నం. పూర్వం రాజుల కాలంలో శత్రువుల నుంచి ఆపద కలిగే సమయంలో శత్రువుకు చిక్కడం కంటె మర ణించడమే మేలని భావించి వేలికున్న ఉంగరంలోని వజ్రాన్ని మింగేవారట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక విలువైన వజ్రాలున్నాయి. వాటిలో అత్యంత విలువైనవి ఐదు. అవి: హోప్ డైమండ్, కోహినూర్ డైమండ్, సాన్సీ డైమండ్, కలినాన్ డైమండ్, విటిల్స్‌బ్రాచ్-గ్రాఫ్ డైమండ్.

1. హోప్ డైమండ్: నీలిరంగులో ఉండే ‘హోప్ డైమండ్’ విలువ సుమారు 350 మిలియన్ల అమెరికన్ డాలర్లు. (సుమారు 1600 కోట్ల రూపాయలు). సీతాదేవి విగ్రహానికున్న కంటిలోనుంచి పాశ్చాత్యులు దీనిని తస్కరించినట్టు చరిత్ర చెబుతోంది. ప్రస్తుతం ఇది వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది.

2. కోహినూర్ (మౌంటైన్ ఆఫ్ లైట్):
పరిమాణంలో ప్రపంచంలోకెల్లా పెద్ద వజ్రం ఇది. శ్వేతవర్ణంలో ఉంటుంది. కాకతీయుల కాలంలో గుంటూరులో లభించింది. వెల అమూల్యం. లండన్ టవర్‌లో ఉంది.

3. సాన్సీ డైమండ్:
లేత పసుపుపచ్చ రంగులో, షీల్డ్ ఆకారంలో ఉండే శాన్సీ డైమండ్ విలువ కూడా అమూల్యమే. ప్రస్తుతం ఇది పారిస్‌లోని లోవర్ మ్యూజియంలో ఉంది.

4. కలినాన్ డైమండ్:
శ్వేత వర్ణంలో ఉండే దక్షిణాఫ్రికాకు చెందిన కలినాన్ డైమండ్ ప్రస్తుతం బ్రిటిష్ రాజకిరీటంలో ఉంది. దీని విలువ 400 మిలియన్ల డాలర్లు. (సుమారు 1800 కోట్ల రూపాయలకు పైగా)

5. విటిల్‌సబ్యాచ్ - గ్రాఫ్ డైమండ్:
నీలివర్ణంలో ఉండే విటిల్స్‌బ్యాచ్ గ్రాఫ్ డైమండ్ ఇప్పుడు వాషింగ్టన్ మ్యూజియంలో ఉంది. రెండేళ్ల క్రితం నాటికే ఈ వజ్రం విలువను 16.4 మిలియన్ పౌండ్లుగా లెక్కించారు. (సుమారు 200 కోట్లకు పైగా).

No comments: