Monday, May 2, 2011

నెత్తుటి త్యాగానికి నూట పాతికేళ్లు * శ్రామిక జనావళిలో స్ఫూర్తిని రగిల్చిన ఆ రోజు మేడే (కార్మిక దినోత్సవం)

ప్రపంచ కార్మికోద్యమంలోని చారిత్రక మలుపులెన్నింటికో మే నెల ఒకటో తారీకు ఓ మైలురాయి. మే1, 1886న అమెరికాలో కార్మికులు చేపట్టిన సమ్మె కార్మిక ఐక్యతకు సంకేతంగా, ప్రపంచ కార్మికులకు ఒక సందేశంగా నిలిచింది. శ్రామిక జనావళిలో స్ఫూర్తిని రగిల్చిన ఆ రోజు మేడే (కార్మిక దినోత్సవం)గా చరితార్థమైంది. ఆ మహత్తర ఉద్యమానికి నేటికి నూట పాతికేళ్లు.

ఆ రోజుల్లో అమెరికాలో కేవలం కడుపు నింపుకోవడానికే కార్మికులు రోజుకి 14 నుంచి 20 గంటలు పనిచేయాల్సి వచ్చేది. ఆ వెట్టిచాకిరి నుంచి విముక్తి పొందేందుకు ఫిలడెల్ఫియా రాష్ట్రంలోని చర్మకారులు సమ్మె (1806) చేస్తే వారిపై కుట్ర కేసు పెట్టి విచారించారు. ఆ విచారణలో చర్మకారులు రోజుకు 19 నుంచి 20 గంటలు పనిచేస్తున్నట్లు బయటపడింది. వివిధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరిదీ ఇదే పరిస్థితి. ఈ దుస్థితి నుంచి బయటపడాలంటే సంఘటితమవ్వాలనే ఆలోచన కార్మికుల్లో బలపడింది. పని గంటలు తగ్గించాలనే డిమాండ్‌తో 1820 నుంచి సుమారు రెండు దశాబ్దాలపాటు సమ్మెల పరంపరం కొనసాగింది.

ఫలితంగా 1837లో అమెరికా అధ్యక్షుడు మార్టిన్ వాన్ బురెన్ ప్రభుత్వ రంగంలో పనిదినాన్ని10 గంటలకు కుదిస్తూ డిక్రీ విడుదల చేశాడు. కొన్ని ప్రైవేటు ఫ్యాక్టరీలు కూడా ఆ నిర్ణయాన్ని ఆహ్వానించడంతో కార్మికులకు కాస్త ఊరట లభించినా ఆ ఆనందం ఎక్కువ రోజులు మిగల్లేదు. 1837-41 మధ్య కాలంలో వచ్చిన మహా మాంద్యం సాకుతో 12-14 గంటలు పనిచేయాలని యాజమానులు ఒత్తిడి పెంచారు. మాంద్యం నుంచి కోలుకున్నాక మళ్లీ సమ్మెలు రాజుకున్నాయి. చివరికి చేసేదిలేక కొన్ని రాష్ట్రాలు పది గంటల పని దినాన్ని అమలు చేయాలని చట్టం చేసినా ఆ ప్రభుత్వాలు యాజమాన్యాలకు తొత్తులుగా వ్యవహరించి, అమలు చేయకుండా కార్మిక ద్రోహానికి పాల్పడ్డాయి.

ఎనిమిది గంటల పోరాటం


అమెరికాలో అంతర్యుద్ధ (1861- 65) కాలంలో అనేక కార్మిక సంఘాలు కనుమరుగయ్యాయి. కాని కార్మికుల్లోని అసంతృప్తి, చైతన్యం వల్ల కొన్నాళ్లకు దేశవ్యాప్తంగా మళ్లీ కార్మిక సంఘాలు పుట్టుకొచ్చాయి. ఆ సంఘాలన్నీ బార్టిమోర్ నగరంలో 1866 ఆగస్టులో సమావేశమై 'జాతీయ కార్మిక సంస్థ'గా ఏర్పడ్డాయి. దీని నిర్మాణంలో సిల్విస్ క్రియాశీలపాత్ర పోషించాడు. ఈ సమావేశంలో 'కార్మికులను పెట్టుబడిదారీ బానిసత్వం నుంచి స్వేచ్ఛ పొందేలా చేయడ మే ప్రథమ కర్తవ్యం. 8 గంటల పనిదినం న్యాయ శాసనాన్ని సాధించేందుకు సర్వ శక్తులొడ్డుదాం' అని ఆ సంస్థ తీర్మానించింది. దాని రాజకీయ కార్యచరణ, ఆందోళనల ఫలితంగా 1868లో ఆరు రాష్ట్రాలు ఎనిమిది గంటల పనిదినాన్ని (పబ్లిక్ వర్క్స్) అమలు చేయాలని చట్టాలు చేశాయి.
1873లో మరోసారి ఆర్థికమాంద్యం చుట్టుముట్టడంతో యాజమాన్యాలు పని గంటల్ని పెంచాయి. ఆదివారాల్లోను, పండగ సెలవుల్లోను పనిచేయించేవి. దీనికి వ్యతిరేకంగా కార్మికులు ఉద్యమాలు నిర్వహించినా ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.

ఒకరికి దెబ్బ తగిలితే


సిల్విస్ మరణంతో జాతీయ కార్మిక సంస్థ బలహీనపడింది. కార్మికుల్లో ప్రభుత్వంపై, ఫ్యాక్టరీ యజమానులపై రోజు రోజుకి అసంతృప్తి పెరిగిపోయింది. ఆ కాలంలోనే 'నైట్స్ ఆఫ్ లేబర్(కార్మిక యోధులు)' అనే సంస్థ ఆవిర్భవించి అది లేనిలోటును పూరించింది. 1872లో అది ఒక నిబంధనావళిని విడుదల చేసింది. 'కార్మికులు ఆనందంగా గడపడానికి, ఇతర ఆలోచనలతో మేధాశక్తిని పెంచుకోవడానికి కొంత విశ్రాంతి కావాలి. అందుకు పని దినాన్ని ఎనిమిది గంటలకు తగ్గించాలి.' అని ఆ నిబంధనావళిలో రాసుకుంది. అంతేకాకుండా 'ఒకరికి దెబ్బ తగిలితే అందరూ స్పందిచాల్సిందే' అని కార్మికులకు పిలుపునిచ్చింది. 1881లో మేలో కానీ సెప్టెంబరులో కానీ మొదటి సోమవారం నాడు కార్మికులు ఎనిమిది గంటల పని దినం కోసం యజమానుల్ని డిమాండ్ చేయాలని నిర్ణయించినా సాధించలేకపోయింది.

పోరుబాట


పిట్స్‌బర్గ్‌లో 1881లో సమావేశమైన వృత్తికారుల సంఘాల, నైట్స్ ఆఫ్ లేబర్ ప్రతినిధులు; ఆరుగురు మార్క్సిస్టులు 'ఫెడరేషన్ ఆఫ్ ఆర్గనైజ్డ్ ట్రేడ్స్ అండ్ లేబర్ యూనియన్స్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ అండ్ కెనడా' అనే సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘ సభ్యుల్లో ఎనిమిది గంటల పనిదినం కావాలనేవారే ఎక్కువ. అక్టోబరు 7, 1884లో ఈ ఫెడరేషన్ నాలుగో సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే మే 1, 1886 నుంచి చట్టబద్దమైన ఎనిమిది గంటల పనిదినం ఉండాలని ఓ తీర్మానం చేసింది. దాన్ని సాధించేందుకు కార్మిక పోరాటమే మార్గం' అని ఎలుగెత్తి చాటింది.

సమర సన్నాహాలు


పోరుబాట ఎంచుకున్న ఫెడరేషన్‌లో సభ్యుల సంఖ్య యాభైవేలు మాత్రమే. మే 1, 1886 సమ్మెకు కార్మిక సంఘాల, కార్మికుల మద్దతు కూడగట్టేందుకు '8 గంటల పనిదినపు సమితి' అనే కమిటీలను నియమించింది. ఈ కమిటీలు యజమానులతో సంప్రదింపులు జరపడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కొన్ని ప్రతిపాదనల్ని కూడా రూపొందించాయి. సమ్మెకంటే ముందే ప్రదర్శనలు, సభలు, సర్క్యులర్ల ద్వారా ప్రచార ఆందోళనలు నిర్వహించాయి. ఈ ప్రచారం కార్మికుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడమే కాదు. వారిలో విశ్వాసాన్ని పెంపొందించింది. ఫెడరేషన్ సమ్మె పిలుపుకు కార్మికుల మద్దతు పెరిగింది. ఈ సమ్మె పిలుపు కార్మిక యోధుల్లో అంతర్గత సంఘర్షణకు తెరతీసింది.

చివరికది సమ్మెకు అనుకూల, వ్యతిరేక వర్గాలుగా చీలింది. అనుకూల వర్గం ఈ సమ్మెకు మద్దతుగా నిలవడంతో సమ్మె సన్నాహాలు విస్తృతంగా జరిగాయి. ఫలితంగా ఈ రెండు సంఘాల సభ్యత్వం గణనీయంగా పెరిగింది. ఈ సమ్మెకు సోషలిస్టు లేబర్ పార్టీ నుంచి వేరుపడిన వారంతా 'సోషల్ రివల్యూషనరీ క్లబ్' పేరుతో సంఘటితమై దీనికి మద్దతు పలికారు. వీరిని అనార్కిస్టులు (అరాచకవాదులు) అని కూడా పిలిచేవారు. ఈ అనార్కిస్టులు 1883లో ఇంటర్నేషనల్ వర్కింగ్ పీపుల్స్ అసోషియేషన్‌ను ఏర్పరిచారు. ఈ సమ్మెకు వామపక్ష కేంద్ర కార్మిక సంఘం కూడా మద్దతు ప్రకటించింది. మొత్తానికి సమ్మెకు అనుకూలంగా కార్మికుల మద్దతు కూడగట్టడంలో 8 గంటల పనిదినపు సన్నాహక సమితులు విజయం సాధించాయి.
ఫెడరేషన్ కార్మికులకు జారీచేసిన సర్క్యులర్‌లో ఇలా ఉంది.
"పీడించబడుతున్న కార్మికుల్లారా మేల్కొనండి. మే1,1886 నాడు పనిముట్లను కిందపడెయ్యండి. పరిశ్రమల్ని, గనుల్ని మూయించండి. ఆ రోజు విశ్రాంతి కోసం కాదు తిరుగబాటు కోసం. ఆ రోజు 8 గంటల పనికోసం, 8 గంటల విశ్రాంతి కోసం, 8 గంటలు మనకిష్టమైన పనుల కోసం ఆ రోజే జీవితాన్ని అనుభవించడం మొదలయ్యే రోజు.''

చికాగో, మే 1 (శనివారం)


మే1న జరిగిన సమ్మెలో దేశవ్యాప్తంగా సుమారు అయిదు లక్షల మంది పాల్గొని ప్రదర్శనలు, సభ్యులు జరిపారు. అసంఘటితంగా ఉన్న కార్మికులు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. చికాగో వామపక్ష కార్మికోద్యమాలకు కేంద్రం కావడంతో సమ్మె మహోధృతంగా సాగింది. ఇందులో అనార్కిస్టులు క్రియాశీలకంగా పనిచేశారు. కార్ఖానాల్ని వదిలిపెట్టిన కార్మికులతో చికాగో వీధులు కిటకిటలాడాయి. 1886 మే 1న మొదలైన ఈ సమ్మె చికాగో నగరంలో పరాకాష్టకు చేరింది. అయితే ఆ పరిణామాలను పెట్టుబడిదారులు చూస్తూ కూర్చుండిపోలేదు. ఈ ఉద్యమాన్ని ఎలాగయినా దెబ్బతీయాలని... ఇది 'సామాజిక యుద్ధం', 'పెట్టుబడి పట్ల అసహ్యం' అని విషప్రచారం చేశారు. దీన్ని అణిచివేయాలని కిరాయి హంతక ఏజెన్సీలతో, ప్రభుత్వ బలగాలతో చేయి కలిపారు.

చికాగో, మే 3 (సోమవారం)


'మెక్ కోర్మిక్ రీపడ్ వర్క్స్'కు చెందిన కార్మికులంతా ఈ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఓ సభ జరుగుతోంది. ఈ సభపై పోలీసులు అకారణంగా దాడి చేశారు. కార్మికులపై అమానుషం గా విరుచుకుపడ్డారు. ఈ పాశవికదాడిలో ఆరుగురు కార్మికులు చనిపోయారు. ఎంతో మంది గాయపడ్డారు.

చికాగో, మే 4 (మంగళవారం)


సోమవారం నాటి దాడిని ఖండిస్తూ హే(గడ్డి) మార్కెట్ చౌక్ వద్ద నిరసన సభ నిర్వహించాలని సమ్మె కార్యనిర్వాహక కమిటీ నిర్ణయించింది. ఈ సభకు రావాలని కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశాయి. అనుకున్నట్లుగానే రాత్రి ఏడు గంటలకు వేలాది మంది కార్మికులు సభాస్థలికి చేరుకున్నారు. సభలో కార్మిక నేత ఆగస్ట్ స్పైస్ ప్రసంగిస్తున్నాడు. ఈ లోగా కార్మిక నేతలు అల్బర్ట్ పార్సన్, శామ్యూల్ ఫీల్డెన్ కూడా సభావేదికకు చేరుకున్నారు. పార్సన్ ఉపన్యాసం ముగిసింది. చివరి ఉపన్యాసకుడు ఫీల్డెన్ మాట్లాడుతున్నాడు. ఆకాశంలో ఉరుములు, మెరుపులు. వర్షం వచ్చే సూచన.. సభలో జనం పలుచబడ్డారు. సుమారు రెండు వందల మంది ఉండుంటారు. సమయం పదిన్నర గంటలవుతోంది. ఫీల్డెన్ ఉపన్యాసం మరికాసేపయితే ముగుస్తుందనగా... సుమారు రెండొందల మంది పోలీసులు ఆ సభా స్థలిని హఠాత్తుగా చుట్టుముట్టారు.

ఈ సభను నిలిపివేయాలని పోలీసు అధికారి ఆదేశించాడు. 'ప్రశాంతంగానే జరుగుతోందిగా' అని ఫీల్డెన్ బదులిచ్చాడు. ముందేవేసుకున్న పథకం ప్రకారం... ఎవరో అనామకుడు ఆ సభలో బాంబు విసిరాడు. ఒక పోలీసు చనిపోయాడు. వెంటనే పోలీసులు రెచ్చిపోయారు. కార్మికులపై తుపాకీ గుళ్ల వర ్షం కురిపించారు. ఈ కాల్పుల్లో ఒకరు చనిపోయారు. అనేక మంది గాయపడ్డారు. ఆ తర్వాత ఈ గాయాల వల్ల ఆరుగురు పోలీసులు, నలుగురు కార్మికులు చనిపోయారు. (ఈ ఘటన కు బా«ధ్యుల్ని చేస్తూ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారిచారు. వీరిపై ఉన్న నేరారోపణలు నిరూపణ కానప్పటికీ కోర్టు అన్యాయంగా ఏడుగురికి మరణ శిక్షను, ఒకరికి15 సంవత్సరాల జైలుశిక్ష విధించింది.)

చికాగో, మే 5 (బుధవారం)


మిలేవేకి, హే మార్కెట్ ఘాతుకాలకు నిరసనగా కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శనలో పోలిష్ కార్మికులు ఎక్కువమంది పాల్గొన్నారు. గవర్నరు ఆదేశాలతో పోలీసులు భారీగా మొహరించారు. పోలీసులు ఈ ప్రదర్శనపై నేరుగా కాల్పులు జరపడంతో తొమ్మిది మంది కార్మికులు చనిపోయారు. పైగా 50 మంది కార్మికులపై నే రం మోపి, విచారించి కొంత మందికి శిక్షలు వేశారు.
ఈ పరిస్థితుల్లో ఉద్యమాన్ని నిర్వహించడం సాధ్యం కాలేదు. సమ్మెలు విఫలమయ్యాయి. పోలీసు హింసాకాండ, యాజమాన్యాల కుట్రల వల్ల మే నెల మధ్యలోనే ఈ ఉద్యమం ఆగిపోయింది. కాని దేశం మొత్తం మీద 2 లక్షల మంది కార్మికులు పని గంటల్ని తగ్గించుకోగలిగారు. శనివారం అర్థ పనిదినంగా యాజమాన్యాలు అంగీకరించాయి. కాని వాటి అమలు అంతంతమాత్రమే. చల్లారిపోయిందనుకున్న కార్మికోద్యమం మళ్లీ వేడెక్కింది. మే1, 1890 నుంచి ఎనిమిది గంటల పనిదినాన్ని అమలు చేయాలని పిలుపునిచ్చింది.

ఆ ఉద్యమానికి ఐరోపా దేశాల కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. జూలై 14-20, 1889లో అంతర్జాతీయ సోషలిస్ట్ కాంగ్రెస్ జరిగింది. ఈ సమావేశంలోనే రెండవ ఇంటర్నేషనల్ ఏర్పడింది. ఈ సదస్సు చికాగో కార్మికోద్యమ త్యాగాల్ని, ప్రాధాన్యతను గుర్తిస్తూ మే 1వ తేదీని అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చింది. అప్పటినుంచి అంటే మే1,1890 నుంచి ప్రపంచ వ్యాప్తంగా మేడేని వాడ వాడలా నిర్వహిస్తున్నారు. ఆనాటి చికాగో వీరుల త్యాగమే నేటికీ కార్మికోద్యమాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది.

No comments: